గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ దోపిడీ చేస్తున్నది : హరీశ్రావు
posted on Jun 14, 2025 9:24PM
.webp)
కృష్ణా జలాల్లో జల దోపిడి జరిగినట్లుగా గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై, బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారని.. ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప.. ఇరిగేషన్పై దృష్టి లేదని.. రాష్ట్ర ప్రయోజనాలను పదవుల కోసం తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ‘బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ఏపీ చేస్తున్న జల దోపిడి- కాంగ్రెస్ మౌనం’ అన్న అంశంపై హరీశ్రావు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే.. సీఎం, మంత్రులు మౌనం వెనుక ఉన్న కారణం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రకి ఇచ్చినమని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రాలో చెప్పాడని.. కేంద్రంలో పరపతితో చంద్రబాబుపై నుంచి కాకుండా పోలవరం నుంచి నీళ్లు మళ్లించి.. కేంద్రం నుంచి నదుల అనుసంధానం పేరుతో నిధులు తెచ్చుకున్నదని ఆరోపించారు. అయినా రేవంత్ రెడ్డికి, మంత్రులకు కదలిక లేదని.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. నష్టం పూర్తిగా జరగకముందే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.