తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా : సీఎం రేవంత్
posted on May 23, 2025 6:18PM

తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్నిముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం కేంద్రీయ విద్యాలయన్ని ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని సీఎం పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని.. తర్వాత అందరినీ కలుపుకుని ముందుకెళ్తామని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని రేవంత్ తెలిపారు.
జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేస్తామని, వారికి ఇళ్ల పట్టాలు అందించే బాధ్యతను స్థానిక నేత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. పటాన్చెరును మినీ ఇండియాగా అభివర్ణించిన ఆయన, బీహెచ్ఈఎల్, బీడీఎల్, నిమ్జ్, ఇక్రిశాట్ వంటి సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతానికి వచ్చాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. రైతులను అప్పుల బాధ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం విముక్తి చేసిందని సీఎం అన్నారు. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రూ.12 వేలకు పెంచి అందిస్తున్నామని, భూమిలేని కౌలు రైతులకు కూడా సహాయం చేస్తున్నామని తెలిపారు.
"గతంలో వరి వేసుకుంటే ఉరేనని ఆనాటి సీఎం కేసీఆర్ అన్నారని తెలిపారు. కానీ, నేడు మేం వరి పంటకు బోనస్ ఇస్తున్నాం" అని గుర్తుచేశారు. 18 నెలల్లో మహాలక్ష్మి పథకం కోసం రూ.5,500 కోట్లు కేటాయించామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ప్రతినిధులు కూడా మన రాష్ట్ర మహిళలు తయారుచేసిన వస్తువులను చూసి అభినందించారని సీఎం పేర్కొన్నారు. మహిళలే బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి కిరాయికి ఇచ్చేలా ఆర్థిక స్వావలంబన చర్యలు తీసుకుంటున్నామని, ఇందిరమ్మ ఆదర్శంగా, సోనియమ్మ స్ఫూర్తితో మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని భరోసా ఇచ్చారు.