ఆదాయం పెంచేందుకు మార్గాలను అన్వేషించండి..అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

 

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం పెంచేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గడిచిన 30 ఏళ్ల ఆదాయ ఫలితాలను పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, సేవల రంగాలు ఎక్కువగా దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇవాళ సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో శాఖలవారి పురోగతిపై చర్చించారు. మరోవైపు గోల్డ్ అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నప్పటికీ.. పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని.. పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని... ప్రతిశాఖకు ఏఐ బృందం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు, మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. 

ప్రక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమంగా రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా సరఫరా దగ్గర నుంచి అమ్మకం వరకు.. ప్రతీది రియల్ టైమ్‌లో ట్రాక్ చేయాలని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు తక్కువుగా ఆదాయం వస్తోందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. దీనికి కారణాలు అన్వేషించి వెంటనే, సరైన విధానాలను అవలంభించి ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పారు. నెలవారీ లక్ష్యాలను అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలని అన్నారు. తెలంగాణలో హైదరబాద్ నుంచే 75% ఆదాయం వస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.  ఏపీకి అలాంటి అవకాశం లేనందున ఆదాయం పెంచేందుకు లోతైన అధ్యయం చేయాలని అధికారులను సీఎం సూచించారు.