ప్రజలకు అప్పులు.. బినామీలకు ఆస్తులు! హెటిరో బ్లాక్ మనీ ఎవరిది జగన్? 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ అజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ లో కోలుకోలేని విధంగా నష్టపోతుందని ఆరోపించారు. సాగునీటి రంగాన్ని జగన్  నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పోలవరం, నదుల అనుసంధానాన్ని కమీషన్లకు కక్కుర్తిపడి అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు. కమీషన్లకు ఆశపడి పోలవరం లోపల మరో ఎత్తిపోతల పథకం అంటున్నారని ఆరోపించారు. 

పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవీనితి, అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రజలకు అప్పులు, జగన్ బినామీలకు ఆస్తులు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాంకీ, హెటెరో సహా అనేక బినామీ కంపెనీల్లో వేలకోట్ల మేర నల్లధనం ఉందని అన్నారు. డ్రగ్స్, కల్తీ మద్యంతో జాతి నిర్వీర్యం అవుతోందని చంద్రబాబు అన్నారు. గంజాయి, హెరాయిన్ స్మగ్లర్లే రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్నారని తెలిపారు. పాడేరు ఏజెన్సీలో గంజాయితో డ్రింకులు, ఐస్ క్రీములు,
చాక్లెట్లు తయారుచేస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో నెలకొన్ని విద్యుత్ కోతలు, కరెంట్ కొరతపైనా చంద్రబాబు స్పందించారు. జగన్ విధానాల వల్లే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఏపీ.. ఇప్పుడు అంధకారంగా మారిపోతుందన్నారు. రెండున్నరేళ్లలో విద్యుత్ వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం పడిందని ఆరోపించారు. ప్రజారక్షక పోలీస్ వ్యవస్థ కాస్తా ప్రజా భక్షక వ్యవస్థగా మారిందని విమర్శించారు. ఇంద్రకీలాద్రి, తిరుమలలో అన్యమత ప్రచారం దుర్మార్గం అని మండిపడ్డారు చంద్రబాబు. విమానాల్లో వాడే ఇంధనం కంటే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయని వెల్లడించారు. ఆరు దశల్లో పరిశీలన పేరుతో రాష్ట్రంలో పెన్షన్, రేషన్ కార్డుల్లో కోత విధిస్తున్నారని ఆరోపించారు.