వైసీపీ పందికొక్కుల బ్యాచ్! సొంత పార్టీ నేతల బండారం బయటపెట్టిన మంత్రి..

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చాకా అవినీతి, అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయనే ఆరోపణలు వస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. విపక్ష పార్టీ నేతలే కాదు కొందరు అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు లంచగొండులుగా మారి ప్రజలను వేధిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

కొంతమంది వైసీపీ నేతలు ప్రజల నుంచి రూ.5 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. ఒక షాపు పెట్టుకోవాలన్నా, బిల్డింగ్ అప్రూవల్, లే అవుట్‌‌లు ఏర్పాటు చేయాలన్నా డబ్బులు అడుగుతున్నారని.. వాళ్ల తాట తీస్తానని హెచ్చరించారు. తాజాగా ఏకంగా జగన్ కేబినెట్ మంత్రి కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. 

అనంతపురం జిల్లా పెనుగొండ వైసీపీలో పందికొక్కుల బ్యాచ్ ఎక్కువైందని మంత్రి శంకర్ నారాయణ వ్యాఖ్యానించారు. అడ్డదారుల్లో డబ్బులు సంపాదన కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీలోని పందికొక్కుల బ్యాచ్ రెచ్చిపోతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలకు గోరంట్ల మండలానికి చెందిన వైసీపీ నేత రమణారెడ్డి కౌంటరిచ్చారు. ఎవరు పందికొక్కులో అందరికీ తెలుసునన్నారు. దేవుడిపై ప్రమాణం చేయడానికి ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. మంత్రే పందికొక్కనే విధంగా వైసీపీ నేత కౌంటరివ్వడం మరింత కాక రేపుతోంది.