టీజీకి పవన్,చంద్రబాబు వార్నింగ్

 

జనసేనతో పొత్తులపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తాజాగా పవన్ విశాఖపట్టణం జిల్లా పాడేరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ..టీజీకి వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదంటూ హెచ్చరించారు. తాను వద్దనుకుంటే వచ్చిన రాజ్యసభ సీటు తెచ్చుకున్న టీజీకి బుద్ధి చెబుతానని పవన్ వ్యాఖ్యానించారు.‘‘పెద్దమనిషి అని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా. నేను నోరు అదుపు తప్పితే మీరు ఏమవుతారో తెలియదు.’’ అంటూ హెచ్చరించారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణమంటూ పవన్ సంచలన ఆరోపణలు చేశారు. టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదని ఆయన వెల్లడించారు. ఈ తరహా ప్రకటనలో కార్యకర్తలను అయోమయానికి గురిచేయొద్దని ఆయన ఆదేశించారు. పార్టీ విధానాలపై మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోవద్దని సూచించారు.