జగన్ మానసిక స్థితి మీద అనుమానం: షర్మిల

తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె శనివారం నాడు జగన్‌కి ఒక అద్దాన్ని బహుమతిగా పంపారు. ఆ అద్దంతో జగన్‌కి తానే కనిపిస్తాడో, లేక చంద్రబాబు కనిపిస్తాడో చూసుకోవాలని సూచించారు. మీకు ఎందుకు చంద్రబాబు పిచ్చి ఇంతలా పట్టిందో తనకు అర్థం కావడం లేదని ఆమె తన సోదరుడిని ఉద్దేశించి అన్నారు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో మేం న్యాయం కోసం పోరాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈరోజు వరకు చెప్పకుండా చంద్రబాబుతో మేం చేతులు కలిపామని చెబుతున్నారేంటని ఆమె నిలదీశారు. వివేకాని గొడ్డలితో నరికి హత్య చేస్తే సాక్షి ఛానల్లో హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పారని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు పేరు జపం ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు వివేకా హత్యమీద సీబీఐ ఎంక్వయిరీ డిమాండ్ చేసిన మీరు, మీరు సీఎం అయిన తర్వాత సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు వద్దన్నారో్ సమాధానం చెప్పాలి అన్నారు. ఆధారాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ వున్నాడని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు కదా.. దానికి సమాధానం చెప్పండి అని షర్మిల అన్నారు. ‘‘మీకు చంద్రబాబు పిచ్చి పట్టిందేమోనని నాకు అనుమానంగా వుంది. అందుకే ఈ అద్దం మీకు పంపిస్తున్నాను. ఇందులో మీకు మీరే కనిపిస్తున్నారో, చంద్రబాబు కనిపిస్తున్నారో చూసుకోండి’’ అని షర్మిల అన్నారు.