జూలు విదిల్చిన చంద్రబాబు : దారిలోకొచ్చిన బీజేపీ

 

మొన్నటి వరకూ పొత్తుల విషయంలో తెలుగుదేశం మీద పైచేయి సాధించిన భారతీయ జనతాపార్టీ ఇప్పుడు చంద్రబాబు జూలు విదిలించేసరికి దారిలోకి వచ్చింది. మీకిచ్చిన సీట్లలో చెత్త అభ్యర్థులను నిలబెడుతున్నారు. మీతో పొత్తు కట్ అని చంద్రబాబు ప్రకటించేసరికి బిజేపీ నాయకత్వం గతుక్కుమంది. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబుని బెదిరిస్తూ మాట్లాడిన బీజేపీ నాయకులు ఇప్పుడు చాలా శాంతంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుని శాంతింపజేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు పొత్తులు, సీట్లలో నిలిపిన అభ్యర్థుల విషయంలో ఏర్పడిన పొరపొచ్చాలు గాలిలో మబ్బుల్లా తేలిపోతాయని ప్రకటించారు. అలాగే మరో జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ తెలుగుదేశంతో పొత్తు కొనసాగుతుందని, రెండు పార్టీల మధ్య వున్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి మంచి వాతావరణం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాజాగా చంద్రబాబుతో చర్చించి, ఆయన్ని శాంత పరిచేందుకు బీజేపీ సీమాంధ్ర నాయకుడు, వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థి హరిబాబు ఈరోజు చంద్రబాబుని కలిసి స్నేహగీతం ఆలాపించున్నారు. మొత్తానికి చంద్రబాబు సింహగర్జన చేసేసరికి బీజేపీ దారిలోకి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.