పెంచిన బడ్జెట్ ఇవ్వలేం.. పోలవరంపై జగన్ కు కేంద్రం షాక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోషారి షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్.పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ రెడ్డి సర్కార్ కు ఝలక్ ఇచ్చింది. డిజైన్లు మార్చినప్పటికీ.. 2014 ఏప్రిల్‌ 1 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ ఇరిగేషన్‌ పనులకు అంచనా వేసిన వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ల మార్పుల వల్ల హెడ్‌ వర్క్స్‌ వ్యయం 5,535 కోట్ల రూపాయల నుంచి 7,192 కోట్ల రూపాయలకు పెరిగినట్లుగా ఏపీ ప్రభుత్వం తెలిపినట్టుగా కేంద్ర మంత్రి తన సమాధానంలో తెలిపారు. గోదావరి ట్రైబ్యునల్‌ నియమ, నిబంధనలకు లోబడే ప్రాజెక్టు డిజైన్లు ఉండాలన్నారు. వాటిని సీడబ్ల్యూసీ(కేంద్ర జల సంఘం) ఆమోదించాకే ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

ఏపీ కోరిక మేరకు ప్రాజెక్టులోని కొన్ని డిజైన్లకు సీడబ్ల్యూసీ మార్పులు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. మార్పుల కారణంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఎత్తు పెంచడం, పునాదుల లోతు పెంచడం, స్పిల్‌వేలోని అత్యంత లోతైన బ్లాకులలో కాంక్రీట్‌ గ్రేడ్‌ల పెంపు, ఎగువ కాఫర్‌ డామ్‌లో ఎడమ వైపు డయాఫ్రం వాల్‌తో కటాఫ్‌ నిర్మాణం, గేట్‌ గ్రూవ్స్‌లో చిప్పింగ్‌ పనులు, స్పిల్‌వేలో రెండో దశ కాంక్రీట్‌ పనుల నిర్వహణ పనులను అదనంగా చేపట్టవలసి వస్తోందని మంత్రి తెలిపారు.

ఇక పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణ ప్రణాళికతోపాటు ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. కేంద్ర మంత్రి సమాధానంతో ఏపీ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర పతనావస్థలో ఉన్న ప్రభుత్వానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టులో వ్యయం భరించాల్సి రావడం భారంగా మారనుంది. నిధుల లేమితో ప్రాజెక్టు పనులు ఆపితే జనాల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం.