బుద్ధగయ పేలుళ్ళ పై నేతల స్పందన
posted on Jul 8, 2013 11:44AM
మహాబోధి ఆలయంలో పేలుళ్ల పట్ల పలువురు నేతలు స్పందించారు. శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షే తీవ్రంగా దిగ్భ్రాంతి చెందినట్లు ఆయన మీడియా సమన్వయకర్త తెలిపారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ ఈ దాడులను ఖండించారు. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ఈచర్య తీవ్ర ఆవేదన మిగిల్చిందన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలను బెదిరించేందుకు జరిగిన 'గేమ్ప్లాన్'గా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభివర్ణించారు.
ఆటవిక, అమానవీయ చర్యగా పంజాబ్ సీఎం బాదల్ దుయ్యబట్టారు. అంతర్గత, బహిర్గత భద్రతా లోపాలపై కేంద్రం వద్ద సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఏమీ లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. శాంతికి చిహ్నమైన బుద్ధగయలో ఉగ్ర వాదులు పేలుళ్లకు పాల్పడటాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రకటనలో ఖండించారు. బీహార్ భవిష్యత్తును ఈ పేలుళ్లే చెబుతున్నాయని ఎల్జేపీ అధ్యక్షుడు రామ్విలాస్ పాశ్వాన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీజేపీ సహా విపక్షాలన్నీ రాజకీయాలకు కులమతాల రంగు పూస్తున్నాయని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు నగరాలకు ముప్పు పొంచి ఉందని ఐబీ వర్గాలు హెచ్చరించాయి.