నేతాజీ సభలో జై శ్రీరామ్ నినాదాలు తప్పే! బీజేపీకి బెంగాల్ ఆరెస్సెస్ లీడర్ షాక్
posted on Jan 28, 2021 11:52AM
కోల్ కతాలో నిర్వహించిన నేతాజి జయంతి వేడుకల్లో జై శ్రీరామ్ నినాదాలు చేయడంపై రాజకీయ రగడ ముదురుతోంది. ఈ ఘటనను బీజేపీ నేతలు సమర్థించుకోగా.. విపక్షాలు మాత్రం తీవ్రంగా తప్పుపట్టాయి. అయితే అనూహ్యంగా ఆరెస్సెస్ నేతల నుంచి కూడా జై శ్రీరామ్ నినాదాలపై వ్యతిరేకత వస్తోంది. కోల్ కతా ఘటనపై స్పందించిన ఆరెస్సెస్ బెంగాల్ విభాగం... ప్రభుత్వ కార్యక్రమంలో జై శ్రీరామ్ నినాదాలను తాము సమర్థించబోమని చెప్పింది. నేతాజీని గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో జై శ్రీరామ్ నినాదాలను చేయాల్సింది కాదని ఆరెస్సెస్ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జిష్ణు బసు అన్నారు. ఆరోజు జరిగిన దానికి చాలా చింతిస్తున్నామన్నారు.
జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారు అటు నేతాజీకి, ఇటు రాముడికి గౌరవం ఇవ్వలేదన్నారు జిష్ణు బసు. నేతాజీకి నివాళులర్పించేందుకు ఆ కార్యక్రమం పెట్టారని, అక్కడ అలాంటి నినాదాలు చేయడమేంటని ప్రశ్నించారు. ఆ నినాదాలు చేసిన వారిని బీజేపీ గుర్తించాలని, ఆ కార్యక్రమాన్ని చెడగొట్టడానికే ఎవరైనా కావాలనే ఆ నినాదాలు చేశారా? అనే విషయాలను గుర్తించాల్సిందిగా బెంగాల్ ఆరెస్సెస్ నేత సూచించారు. ఆ నినాదాలు చేసిన వారు వేరే రాష్ట్రానికి చెందిన నేతలకు సన్నిహితులని బీజేపీ బెంగాల్ నేతలు చెబుతున్నారు. మమతా బెనర్జీ కూడా ఆ నినాదాలను వివాదాలుగా మార్చి తన రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయమంతా జై శ్రీరాం, నేతాజి నినాదాల చుట్టే తిరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకల్లో కొందరు వ్యక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేయడం కలకలం రేపింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతుండగా.. కొందరు ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేయడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించి అవమానిస్తారా అంటూ ఆమె మాట్లాడకుండానే వేదిక దిగి కోపంగా వెళ్లిపోయారు.