అసోంలో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లు మృతి..
posted on Nov 19, 2016 10:34AM
అసోంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అసోంలోని టిన్సుకియా, పెంగ్రీ ప్రాంతాల్లో ఉల్ఫా తీవ్రవాదులు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. తీన్సుకియా జిల్లాలోని దిగ్బోయ్ ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్ ముందు ఉగ్రవాదులు శక్తిమంతమైన ఐఈడీ పేల్చి.. తర్వాత విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వెంటనే సమాచారం అందుకున్న భారత జవాన్లు అక్కడికి చేరుకోని ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అసోం డీజీపీ ముఖేష్ సాహాయ్ తెలిపారు. గాయపడిన జవాన్లను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఆర్మీ, తీవ్రవాదుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.