మండలి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్
posted on Sep 1, 2020 11:47AM
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజుకు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా.. తాజాగా మండలి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు ఉండటంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, ఏపీలో సోమవారం 10,004 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్తగా 85 మంది కరోనా కారణంగా మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,876 కు చేరగా.. మృతుల సంఖ్య 3,969 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,276 యాక్టివ్ కేసులున్నాయి.