కోర్టులో 'కాకాణి ఫైల్స్' చోరీ.. హైకోర్టు సుమోటో విచారణ.. సీబీఐకి నోటీసులు..
posted on Apr 26, 2022 11:55AM
మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనను ఏపీ హైకోర్టు సుమోటో పిల్గా స్వీకరించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని సుమోటో పిల్గా పరిగణించింది.
చోరీ జరిగిన తరువాత డాగ్ స్క్వాడ్ తనిఖీలు, వేలిముద్ర, కాలి ముద్ర సేకరణ చెయకుండా నెల్లూరు జిల్లా ఎస్పీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని ధర్మాసనం నిలదీసింది. కేసును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదని హైకోర్ట్ ప్రశ్నించింది. కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం లేదంటూ ఏజీ వివరించారు. దీంతో.. 18 మందికి నోటీసులు జారీ చేసింది ధర్మాసనం.
ప్రతివాదులుగా మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, సీబీఐ డైరెక్టర్, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) తదితరులను చేర్చింది. కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణ మే 6కి వాయిదా వేసింది.