రూ.30 కోట్లు ఎక్స్‌‌గ్రేషియా విడుదల! ఉత్తర్వులను జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా విడుదల చేసింది. రూ.30 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రథమచికిత్స చేసుకున్న వారికి రూ.25 వేలు. ఆస్పత్రిలో రెండు, మూడు రోజులు ఉన్నవారికి రూ.లక్ష. వెంటి లెటర్‌పై ఉన్నవారికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. 

గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రూ.30 కోట్లు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్‌ లీక్‌ ఘటనలో మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. అలాగే విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైనవారికి విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు గ్యాస్‌ లీకేజి అరికట్టేందకు 9 మంది నిపుణుల బృందంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నిపుణల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.