ఏబీ కేసులో ట్విస్ట్.. సుప్రీంకు ఏపీ సర్కార్
posted on Jul 2, 2020 2:51PM
ఏపీ మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. ఇది జులై 6వ తేదీ తర్వాత విచారణకు వచ్చే అవకాశముంది.
ఫిబ్రవరి 8న ఏపీ ప్రభుత్వం నిఘా పరికరాలకు సంబంధించిన కాంట్రాక్ట్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ను సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ను ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అయితే క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు వెంకటేశ్వరరావుకు ఊరట కలిగించే విధంగా తీర్పు ఇచ్చింది. వెంటనే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.