రాజకీయ ప్రయోజనాలకోసమే ఎన్నికల కమీషనర్కు కులం అంటగట్టారా?
posted on Mar 20, 2020 11:36AM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారా? రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నియామకానికి సంబంధించి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మధ్య ఘర్షణ జరగడానికి కారణం ఏమిటి? ప్రభుత్వం పంపిన ఫైల్ను ఎందుకు రాజ్భవన్ వెనక్కి పంపింది? ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కులాన్ని ఆపాదిస్తూ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? చంద్రబాబు ప్రోద్బలంతోనే ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రమేష్ కుమార్ తీసుకున్నారని సి.ఎం. ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇలా వ్యవహరించారా? వాస్తవం ఏమిటి?
2015 నవంబర్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ చిత్తరంజన్ దాస్ బిస్వాల్ పేరును ప్రతిపాదిస్తూ చంద్రబాబునాయుడి ప్రభుత్వం రాజ్భవన్కు ఫైల్ పంపింది. అయితే బిస్వాల్ అర్హతను సవాల్ చేస్తూ ఈ నియామకాన్ని గవర్నర్ అడ్డుకున్నారు. గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ తన అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంపై లీగల్ ఓపీనియన్ కోరింది.
బిస్వాల్ ఎపిపిఎస్సి ఛైర్మన్ పదవీ విరమణ చేశారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియామకం చేయమని ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని రాజ్భవన్ తిరస్కరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన ఫైల్ను రాజ్ భవన్ తిప్పి పంపింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 319 బి "స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఇతర సభ్యుడు లేదా మరే ఇతర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా నియామకానికి అర్హులు, కానీ ఇతర ఉద్యోగాలకు కాదు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక రాజ్యాంగ పదవి. ఇది ఎల్లప్పుడూ ప్రధాన కార్యదర్శి-ర్యాంక్ అధికారులచే నింపబడుతుంది. బిస్వాల్ తన అధీనానికి ముందు చీఫ్ సెక్రటరీ హోదా పొందలేదు.
"రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి హైకోర్టు న్యాయమూర్తికి సమానం మరియు ఈ పదవిలో చీఫ్ సెక్రటరీ ర్యాంక్ అధికారులను మాత్రమే నియమిస్తారు. అందుకే రాజ్భవన్ ప్రభుత్వం ప్రతిపాదించిన పేరును అంగీకరించలేదు.
అసలు రమేష్ కుమార్ నియామకం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అయినా.. ఆయన్ని నియమించింది, పేరును ప్రతిపాదించింది చంద్రబాబునాయుడు కాదు. చంద్రబాబునాయుడు ప్రతిపాదించిన పేరు బిస్వాల్ను కాదని అప్పటి గవర్నర్ నరసింహన్ రమేష్ కుమార్ను ఎన్నికల కమీషనర్గా నియమించారు.