కరోనాతో సహజీవనమేనట.. 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పంజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొవిడ్ రోగులకు బెడ్లు దొరకడం లేదు, ఆక్సిజన్ అందడం లేదు, వ్యాక్సిన్ ఇవ్వడం లేదనే ఆరోపణలపై ఆయన స్పందించారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్నారు జగన్. దేశంలో వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటో అందరికి తెలుసన్నారు. వ్యాక్సిన్ల కొరత ఉన్నందున... కరోనాతో సహజీవనం చేయడం తప్ప మారో మార్గం లేదని కామెంట్ చేశారు ఏపీ సీఎం జగన్. 

భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ కోసం మొత్తం 172 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాల్సి ఉంటుంద‌ని చెప్పారు జగన్.ఇప్ప‌టివ‌ర‌కు 18 కోట్ల డోసుల‌ను మాత్ర‌మే ఇవ్వ‌గ‌లిగార‌ని  తెలిపారు.  ఏపీకి మొత్తం 7 కోట్ల డోసులు కావాల్సి ఉంద‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 73 ల‌క్ష‌ల డోసుల‌ను మాత్ర‌మే ఇచ్చార‌ని వివ‌రించారు. భార‌త్‌లో సీరం, భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌లు వ్యాక్సిన్లను త‌యారు చేస్తున్నాయ‌న్నారు. భార‌త్ బ‌యోటెక్ నెల‌‌కు కోటి వ్యాక్సిన్లు త‌యారు చేస్తోంద‌ని, అలాగే, సీరం ఇన్‌స్టిట్యూట్ కు నెల‌కు 6 కోట్ల వ్యాక్సిన్ల త‌యారీ సామ‌ర్థ్యం ఉంటుంద‌ని తెలిపారు. అంటే దేశంలో నెల‌కు కేవ‌లం 7 కోట్ల వ్యాక్సిన్ల సామ‌ర్థ్యం మాత్ర‌మే ఉందని చెప్పారు. కాబ‌ట్టి దేశ ప్ర‌జ‌లు కరోనాతో స‌హ‌జీవ‌నం చేస్తూనే మరోపక్క దానితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంద‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రు కరోనా జాగ్ర‌త్తలు పాటించాలని సీఎం జగన్ కోరారు.