చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ లో పెరిగిన మృతుల సంఖ్య... 29 మావోయిస్టులు దుర్మరణం 

మరో పది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో ఛతీస్ గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉండటంతో భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి. దీంతో మావోలు కూడా నిన్న పోలీస్ బేస్ క్యాంప్ పై బాంబులు విసిరారు.దీంతో భద్రతాదళాలు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  ఈ క్రమంలో ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మవోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్ రావు కూడా ఉన్నాడని, ఆతని మీద రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. 
ఈ ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్ పెక్టర్, ఇద్దరు జవానులు గాయపడినట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.ఇదిలా ఉండగా, కాంకేర్ లోక్ సభ స్థానానికి రెండో దశలో భాగంగా ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనున్నారు.