టీడీపీ గెలుపుపై జేసీ సంచలన వ్యాఖ్యలు

 

చంద్రబాబు అదృష్టవంతుడిని, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని.. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు అదృష్టవంతుడు. డ్వాక్రా మహిళలకు చెక్కులు సరైన సమయంలో వేయడమే అదృష్టానికి కారణం. నిన్న క్యూలో అమ్మవార్లు, వృద్ధులు విరగబడి వచ్చారు. చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలపడానికే వాళ్లు వచ్చారు. అనంతపురం లోక్‌సభ పరిధిలోని అభ్యర్థులు అందరినీ మార్చమని చెప్పా. మార్చకపోతే గెలవం అని చెప్పాను. అయినా మార్చలేదు. మార్చకపోయినా గెలుస్తున్నారంటే అమ్మవార్ల దయే. అనంతపురం టౌన్‌, శింగనమల, గుంతకల్లు కూడా గెలవబోతున్నాం. రాసిపెట్టుకోండి.. మే 23వ తేదీన చూడండి’ అంటూ జేసీ ధీమా వ్యక్తం చేశారు. మొన్న రాత్రి వరకు అనంతపురం, శింగనమల, గుంతకల్లు పోతాయనుకున్నానని.. కానీ నిన్న ఉదయం క్యూలో అమ్మవార్లను చూశాక.. లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక లెక్క.. ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఇంకో లెక్క అని జేసీ చెప్పుకొచ్చారు.

చంద్రబాబుకు అదృష్టం.. సుడి తిరిగినట్లు తిరిగిందని జేసీ కొనియాడారు. ఈవీఎంలు మధ్యాహ్నానికే పనిచేశాయని, సహజంగా క్యూలో ఉండే మహిళలు ఒక్కసారి ఇంటికి వెళ్తే తిరిగిరారు.. కానీ చంద్రబాబు పిలుపుతో ఆయనకు కృతజ్ఞతతోనే మళ్లీ వచ్చి ఓటేశారని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సైలెంట్‌ వేవ్‌ మహిళల్లో ఉందని, అందుకే అర్థరాత్రి దాకా ఓట్లు వేశారని జేసీ పేర్కొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మరపురాని సన్నివేశమని చెప్పారు. ఇప్పుడున్న వేవ్‌లో 5 వేల ఓట్లతో గెలుపు గెలుపే కాదని, భారీ మెజార్టీలతో టీడీపీ అభ్యర్థులు గెలుస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

జేసీ ఏ పార్టీలో ఉన్నా.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. సొంత పార్టీ నేతలు, అధినేత మీద కూడా జేసీ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే జేసీ టీడీపీ విజయం పట్ల ధీమా వ్యక్తం చేయడంతో.. టీడీపీ శ్రేణులు తమ పార్టీ విజయం సాధించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.