ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం

 

భూమా శోభా నాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ వైసీపీ అభ్యర్థిగా పోటీలో వున్నారు. ఈ స్థానం నుంచి ప్రధాన రాజకీయ పార్టీలేవీ అభ్యర్థులను నిలపలేదు. అయితే కొంతమంది ఇండిపెండెంట్లు మాత్రం నామినేషన్లు దాఖలు చేయడంతో అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నిక అవరేమోనన్న అనుమానాలు వచ్చాయి. ఇదిలా వుండగా, నామినేషన్ల స్క్రూటినీ సందర్భంగా నలుగురు ఇండిపెండెంట్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో అఖిలప్రియతోపాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్లు మాత్రమే రంగంలో నిలిచారు. కాగా, శుక్రవారం నాడు ఆ ఇద్దరు ఇండిపెండెంట్లూ తమ నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. దాంతో భూమా అఖిలప్రియారెడ్డి ఈ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడమే మిగిలి వుంది.