లొంగిపోని అక్బరుద్దీన్ ఓవైసి, నాలుగు రోజులు రెస్ట్..!
posted on Jan 7, 2013 10:37AM
కొద్దిరోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జరిగిన ఒక భారిబహిరంగసభలో హిందూ దేవతలను కించపరుస్తూ, ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగం చేసిన యంఐ.యం. పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసికి వ్యతిరేఖంగా సర్వత్ర నిరసనలు వెల్లువెత్తడంతో, రాష్ట్రంలోనే కాకుండా దేశంలో పలుచోట్ల కూడా అతనిపై పోలీసు కేసులు నమోదు చేశారు. అక్బరుద్దీన్ తన సభలోప్రజలపై విషం చిమ్మిన తరువాత, మరి ముందే ఈ సమస్యని ఊహించినందువల్లనో మరి వేరే ఇతర కారణాలతోనో వెంటనే లండన్ వెళ్ళిపోయాడు.
ఈ రోజు తెల్లవారుజామున అక్బరుదీన్ లండన్ నుండి హైదరాబాదు తిరిగి వచ్చేశారు. అతనికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున యం.ఐ.యం. పార్టీ శాసన సభ్యులు, పార్టీ కార్యకర్తలు కూడా శంషాబాద్ విమానాశ్రయానికి తరలి రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తరువాత పెద్ద ఊరేగింపుగా తన ఇంటికి బయలుదేరి వెళ్ళారు.
ఈ రోజు అక్బరుద్దీన్ అదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసు స్టేషన్లో హాజరు కావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా అక్బర్ హాజరు కావట్లేదని మజ్లిస్ చెబుతోంది. అక్బరుద్దీన్ తరఫున ఆయనకు చెందిన ఇద్దరు న్యాయవాదులు ఇస్మాయిల్, రసూల్ ఖాన్ నిర్మల్ పోలీసు స్టేషన్ ఎదుట హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా అక్బరు పోలీసు స్టేషన్కు ఈ రోజు హాజరు కాలేదని, నాలుగు రోజులు సమయం ఇవ్వాలని వారు పోలీసులను కోరారు. అతను నిర్మల్ పోలీసు స్టేషన్లో లొంగిపోతాడని ఉహించిన పోలీసులు పట్టణంలో సెక్షన్ 144 క్రింద కర్ఫ్యూ విదించారు
ఒక సామాన్యుడిని క్షణాలమీద లాకప్ లో పడేయగల పోలీసులు, ఇటువంటి బడానేతలను మాత్రం ఏమిచేయలేక చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తోందంటే అందుకు మన ఓటు బ్యాంకు రాజకీయాలే కారణం అని చెప్పక తప్పదు. ఇప్పుడు, మతపరమయిన అల్లర్లు చెలరేగుతాయనే భయంతో పోలీసులు అతనిని ఉపేక్షంచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటువంటి కేసులు చట్టం దృష్టిలో కొందరు ‘అధిక సమానం’ అని నిరూపిస్తుంటాయి.