ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వ్యాన్ బోల్తా పడి ఆరుగురి మృతి

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఓ పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో దాదాపు 17 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరంతా పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను గోకవరం మండలం టాకుర్‌పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆలయంలో పార్కింగ్ ప్లేస్ మీదుగా రోడ్డు మీదికి రావాల్సిన వ్యాన్‌ మెట్లు పై నుంచి ఒక్కసారిగా కింద పడినట్లు పోలీసులు వెల్లడించారు.