తెలంగాణాలో 9 మంది మృతి పాజిటివ్ వ‌చ్చిన వారు 127

తెలంగాణాలో ఒకే రోజు 30 కొత్త కేసులు న‌మోదైయ్యాయి. మ‌రో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఢిల్లీ నుంచి వ‌చ్చిన వారే!  దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 127కు పెరిగింది. 
నిజాముద్దీన్ మర్కజీకి వెళ్లొచ్చిన వారికి, వారి వల్ల వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణలో కొత్తగా వైరస్ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని అధికారులు తెలిపారు. బుధవారం జరిపిన పరీక్షల్లో 30 మందికి వైరస్ సోకినట్లు తేలింది. గాంధి ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు బుధవారం కరోనా వైరస్ సోకి మరణించారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో ఈ వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 9కి చేరింది. బుధవారం వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిగానే తేలింది. గతంలో మరణించిన ఆరుగురు కూడా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారే. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరి కొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు, అలాంటి వారిలో ఎవరి పరిస్థితి కూడా ఆందోళన కరంగా లేదు, ఎవరూ చనిపోలేదు. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో నమోదవుతన్న పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారివిగానే తేలాయి. 

దీంతో తెలంగాణ ప్రభుత్వం మర్కజ్ వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మర్కజ్ వెల్లి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నది. మర్కజ్ కు వెళ్లివచ్చిన మరో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న వారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షలు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం కోరుతున్నది. మర్కజ్ కు వెళ్లివచ్చిన వారికి సోకిన వైరస్ ప్రమాదరకంగా మారుతున్నది కాబట్టి, వారంతా తప్పక పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల, వైరస్ సోకినట్లు తేలినా, వారి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇది వారికి, వారి కుటుంబానికి శ్రేయస్కరం కాబట్టి, మర్కజ్ వెళ్లి వచ్చిన ప్రతీ ఒక్కరు తప్పక పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం కోరుతున్నది. 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్వహిస్తున్న లాక్ డౌన్ ను ప్రజలు విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. మరికొద్ది రోజుల పాటు ప్రజలు సహకరిస్తే, తెలంగాణ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సిఎం అన్నారు. కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సిఎం వెల్లడించారు. వైద్య సిబ్బందికి అవసరమైన పిపిఇ కిట్స్, ఎన్ 95 మాస్కులు, హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలు, అజిత్రో మైసిన టాబ్లెట్లు సిద్దంగా ఉంచినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన మెడికల్ కిట్స్ ను కూడా సిద్ధంగా ఉంచినట్లు సిఎం చెప్పారు. వ్యాధి వచ్చిన వారికి వైద్యం అందించడానికి, వైద్యం అందిస్తున్న మెడికల్ సిబ్బంది భద్రతకు, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యలును ప్రభుత్వం తీసుకుంటున్నదని సిఎం వెల్లడించారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, వైద్యసిబ్బంది భద్రతకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో మద్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉన్నతాధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం గవర్నర్ తమిళిసైని కలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై చర్చించారు. గురువారం రాష్ట్రపతితో గవర్నర్ కు, ప్రధాన మంత్రితో ముఖ్యమంత్రికి వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందున రాష్ట్రంలో చేస్తున్న ప్రయత్నాలపై ఇద్దరూ చర్చించారు.