13 మంది జవాన్లను చంపిన మావోయిస్టులు

 

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. మావోయిస్టులు 13 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను చంపేశారు. సుకుమా జిల్లాలో కూంబింగ్ నిమిత్తం వెళ్తున్న జవాన్ల మీద మావోయిస్టులు మెరుపుదాడి చేసి 13 మంది జవాన్లను చంపేశారు. నాలుగు రోజుల క్రితం సుకుమా జిల్లాలోనే జరిగిన ఒక ఎన్‌కౌంటర్లో సీఆర్‌పిఎఫ్ జవాన్లు 15 మంది మావోయిస్టులను చంపేశారు. దానికి ప్రతీకారంగానే మావోయిస్టులు ఈ దాడికి ఒడిగట్టారని తెలుస్తోంది. ఈ ఘటనలో 11 మంది సీఆర్‌పిఎఫ్ జవాన్లు కాగా ఇద్దరు ఉన్నతాధికారులు. ఐదుగురు గాయపడ్డారు. ఈ మధ్యకాలంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కార్యకలాపాలు బాగా విస్తృతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపడంతో మావోయిస్టు ఛత్తీస్‌గడ్‌ను కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దేశం మొత్తం నివ్వెరపోయే మెరుపుదాడి చేశారు.