వారం రోజుల పాటు ఎంపిలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
posted on Aug 25, 2013 9:26PM
సోనియా గాంధి మానస పుత్రికగా భావిస్తున్న ఆహారభద్రత బిల్లు ఈ వారం సభలో చర్చకు రానుండటంతో పాటు పలు కీలకమైన బిల్లులు ఆమోదం పొందాల్సి ఉండటంతో కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణ, ఇతర అంశాల కారణంగా పార్లమెంటు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ఎంపీలందరిని కట్టడి చేయడానికి కూడా విప్ ఉపయోగపడుతుందని భావిస్తుంది కాంగ్రెస్.
సోమవారం నుంచి వరుసగా వారం రోజుల పాటు పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభలోనే ఉండాలంటూ మూడు వాక్యాలతో కూడిన విప్ను జారీ చేసింది. వచ్చే ఎన్నికల తమ ముఖ్య ప్రచారాస్త్రంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ అన్ని రకాలుగా శ్రమిస్తుంది. ఈ బిల్లు ఈ సోమవారం చర్చకు రానుంది.
రాష్ట్రనికి చెందిన 12 మంది సీమాంద్ర ఎంపిలు సస్పెండ్ కావటంతో, సోమవారం నుంచి సభ సజావుగానే సాగుతుందన్న ఆశాభావంలోనే ఉంది కాంగ్రెస్.ఇప్పటికే శనివారం మూడు బిల్లులను ఆమోదించారు. ఇక ఈ వారం ఆహార భద్రత బిల్లుతొ పాటు భూసేకరణ బిల్లు కూడా చర్చకు రానుంది. ఈ రెండు బిల్లులే ఈ సారి ఎన్నికల్లో తమకు ఓట్లు కురిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తుంది.