కేసీఆర్ ‘మండల యాత్ర’
posted on Mar 31, 2013 10:44AM
ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్న కేసీఆర్, 'తెలంగాణ మండల యాత్ర' పేరుతో మే నెలలో ఆదిలాబాద్ జిల్లా నుంచి బస్సు యాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రతినిధుల సభను నిజామాబాద్లో నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు కుత్బుల్లాపూర్ కూడా పరిశీలనలో ఉంది.
తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ పొలిట్బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. సమావేశం వివరాలను అనంతరం నాయిని, వినోద్కుమార్ మీడియాకు తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపు, కోతలను నిరసిస్తూ వివిధ పార్టీలు ఏప్రిల్ 9న జరపతలపెట్టిన బంద్లో తమ పార్టీ శ్రేణులూ పాల్గొంటాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ రెండు నుంచి బస్తీ బాట చేపట్టనున్నట్టు వారు తెలిపారు. అది పూర్తయ్యాక మండల బస్సు యాత్రను కేసీఆర్ చేపడతారని తెలిపారు. కాగా టీఆర్ఎస్ కొత్త ఎమ్మెల్సీలు కె.స్వామిగౌడ్, పాతూరి సుధాకర్రెడ్డి, మహమూద్అలీ ఏప్రిల్ 5న ప్రమాణం చేయనున్నారు.