జగన్, చంద్రబాబు విభజనకే మొగ్గు
posted on Sep 11, 2013 3:36PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ లు రాష్ట్ర విభజనకే మొగ్గుచూపుతున్నాయని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలమని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సమన్యాయం అని, సమైక్యం అని నాటకాలు ఆడుతోంది. సమన్యాయం అంటే విభజించమనే అర్ధం కదా ? సమైక్యాంధ్ర కోసం తాను విభజన వైఖరిని వెనక్కి తీసుకున్నానని చంద్రబాబు అనడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రం రావణకాష్టంలా మండుతుంటే ఇప్పుడు అధికారం ఇవ్వండి ఆరునెలల్లో రాష్ట్రాన్ని మారుస్తానంటూ చంద్రబాబు నాయుడు అంటున్నారని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ విమర్శించారు.
హైదరాబాద్లో ఎపి ఎన్జీవోల సభను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుకు వణుకు పుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలుగా తాము విభజనను ఒప్పుకోవడం లేదని, దీని మీద ఎటువంటి ప్రత్యామ్నాయాలు కోరుకోవడం లేదని, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే అభిప్రాయం చెప్పాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. అసేంబ్లీలో తెలంగాణ తీర్మానం వచ్చినప్పుడు దానిని ఓడిస్తామని, ప్రతిపక్షాలు తమ రాజీనామాల ఆమోదం కోరుతుండడం అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు.