భారత్ కు అత్యాధునిక ఆయుధాలు... మోడీ-ట్రంప్ భేటీ తర్వాత ఎంవోయూ...
posted on Feb 25, 2020 9:13AM
అగ్రరాజ్యాధినేత ట్రంప్ పర్యటనలో భాగంగా భారత్-అమెరికా మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరగనున్నాయి. హైదరాబాద్ హౌజ్లో సుమారు రెండు గంటలపాటు సమావేశంకానున్న ట్రంప్-మోడీలు... మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ముఖ్యంగా భారత సైనిక అవసరాల కోసం అమెరికా నుంచి ఆర్మ్డ్ హెలికాప్టర్లను కొనుగోలుకు ఎంవోయూ చేసుకోనున్నారు.
మొతెరా స్టేడియం స్పీచ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ ఆర్మ్డ్ హెలికాప్టర్ల డీల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రక్షణ రంగంలో భారత్, అమెరికా మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందన్న డొనాల్డ్ ట్రంప్.... ఈ భూమ్మీదున్న అత్యాధునిక, భయంగొల్పే సైనిక పరికరాలను ఇండియాకి ఇవ్వడానికి తాము సంసిద్ధంగా ఉన్నామన్నారు.
మోడీ-ట్రంప్ ద్వైపాక్షిక చర్చల్లో కేవలం సైనిక ఒప్పందాలే కాకుండా, వాణిజ్యపరమైన ఎంవోయూలు కూడా జరగనున్నాయి. పరస్పర లబ్దితోపాటు ఇరుదేశాల మైత్రిని పెంచేలా ఒప్పందాలు ఉండనున్నాయి.