ప్రియుడి మోజులో పడి కూతురిని చంపిన తల్లి.. ఇద్దరికి జీవిత ఖైదు
posted on Jul 3, 2025 7:39PM

ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన మొరంపల్లి గ్రామానికి చెందిన శాంత రామసముద్రం మండలానికి చెందిన శ్రీనివాసులు ఇద్దరూ గ్రామాలలో రికార్డింగ్ డ్యాన్స్ లు చేస్తూ జీవనం సాగించేవారు. ఒకే వృత్తిలో ఉండటంతో వీరిద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడింది. కాగా శాంతకు పెళ్లయి కూతురు ఉండేది. వారి మధ్య కొనసాగుతున్న అక్రమ సంబంధానికి ఆమె కూతురు అడ్డుగా ఉంటుందని భావించిన ఇద్దరూ దారుణానికి ఒడిగట్టారు.
పుంగనూరు మండలంలోని పెద్దతాండ గ్రామంలో డ్యాన్స్ ప్రోగ్రాం నిమిత్తం ఒక ఆటోలో వెళ్తున్న సమయంలో, వారు ప్రయాణిస్తున్న ఆటోలోనే చిన్నారిని ఇనుపరాడుతో తలపై గుద్ది హత్య చేసి, ఆమె మృతదేహాన్ని గుడ్డలో కట్టి ఆటోలో ఉంచారు. అనంతరం అదే ఆటోలో మదనపల్లి మండలంలోని మదనపల్లె–చెంబకూర్ రోడ్డులో ఉన్న దాసరి వంకలో మృతదేహాన్ని పారవేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై ఆ రోజు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ లో ఆ గ్రామ వి.ఆర్.ఓ కావలి వెంకటరమణ ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్ఐ కె.వి.హెచ్.నాయుడు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మదనపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళి దర్యాప్తును చేపట్టి సంఘటనా స్థల పరిశీలన, పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా ఈ హత్య శాంత మరియు ఆమె ప్రియుడు శ్రీనివాసులు కలిసి చేశారని నిర్ధారించారు.
2017 డిసెంబర్ 5న లభించిన సమాచారంతో, మదనపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ మదనపల్లి-చెంబకూర్ రోడ్డులోని లాబాల గంగమ్మ దేవాలయం వద్ద ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారు ప్రయాణించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. సదరు కేసులో ముద్దాయికి శిక్ష పడుటకు కృషి చేసిన అప్పటి పుంగనూరు ఇన్స్పెక్టర్ టి.సాయినాథ్, ఇప్పటి చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ అడిషనల్ పి.పి జయనారాయణ రెడ్డి, కోర్టుకు సాక్షాలను సకాలంలో హాజరు పరచిన కోర్ట్ కానిస్టేబుల్ మోహన్ రెడ్డి, పుంగనూరు కోర్ట్ కానిస్టేబుల్ రవి మరియు కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మరియు వారి సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ప్రత్యేకంగా అభినందించారు.