ఇంకెన్ని డిజాస్ట‌ర్స్ సంభ‌వించాలి.. అన‌సూయ ఫైర్‌!

  ఉత్త‌రాఖండ్‌లో హిమానీన‌దం కార‌ణంగా ధౌలిగంగా న‌ది ఉధృతంగా పోటెత్త‌డంతో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ఎన్‌టీపీసీ నిర్మిస్తోన్న రిషిగంగ ప‌వ‌ర్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంస‌మైంది. ఆ ప్ర‌కృతి వైప‌రీత్యానికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఆదివారం నుంచీ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విషాద‌మేమంటే ఆ ప్రాజెక్టులో ప‌నిచేస్తున్న దాదాపు 170 మంది సిబ్బంది గ‌ల్లంత‌యిపోయారు. వారిలో ఎంత‌మంది మృత్యువాత‌ప‌డ్డారు, ఎంత‌మంది ప్రాణాలు ద‌క్కించుకున్నార‌నే విష‌యం ఇంకా వెల్ల‌డి కాలేదు. ఈ విషాదం అంద‌రినీ క‌దిలించి వేస్తోంది.. అంద‌రి హృద‌యాల‌నీ క‌ల‌చివేస్తోంది. ఈ ఉత్పాతానికి ఎవ‌రు బాధ్యులంటూ ప‌లువురు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌కృతిని ధ్వంసం చేస్తూ రావ‌డం వ‌ల్లే ఇలాంటి వైప‌రీత్యాలు ఎదుర‌వుతున్నాయ‌ని విమ‌ర్శిస్తున్నారు.  మ‌న ఫైర్ బ్రాండ్ యాంక‌ర్ అన‌సూయ భ‌రద్వాజ్ సైతం ఈ విషాదంపై త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. "మ‌రో ప్ర‌కృతి వైప‌రీత్యం మ‌న‌ల్ని తాకింది. ఇది మ‌నం ప్ర‌కృతికి అనుగుణంగా జీవిస్తూ, దానిని సంర‌క్షించడం మొద‌లుపెట్టాల్సిన స‌మ‌యం కాదా? మ‌నం నేర్చుకోవ‌డానికి ముందు ఇంకెన్ని ఉత్పాతాలు సంభ‌వించాలి?" అంటూ ఆమె ఆగ్ర‌హంతో ప్ర‌శ్నించింది.  హిమాల‌యాల‌పై కాంక్రీట్ నిర్మాణాలు పెరుగుతుండ‌టం వ‌ల్ల ఆ ప‌ర్వ‌తాలు చాలా వేగంగా వేడెక్కుతున్నాయ‌ని పర్యావ‌ర‌ణ‌వేత్త‌లు చెబుతున్నారు. దాని వ‌ల్లే మంచు చ‌రియ‌లు క‌రిగి, విరిగి ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వాలు కూడా దీనికి బాధ్య‌త వ‌హించాలంటున్నారు.

'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' స్టేజ్‌పై ఇమ్మానియేల్ ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌!

  ఈటీవీలో 'జ‌బ‌ర్ద‌స్త్' త‌రువాత‌ అంత‌గా పాపుల‌ర్ అయిన షో 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో'. ఈ షోకి న్యాయ నిర్ణేత‌లుగా రోజా, మ‌నో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌ష్మీ గౌత‌మ్ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోలో వ‌ర్షని స్టేజ్‌పైనే ఇమ్మానియేల్ ప్ర‌పోజ్ చేయ‌డం అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేస్తోంది. ఈ షో లేటెస్ట్ ప్రోమోలో ఫిబ్ర‌వ‌రి 14 వేలంటైన్స్ డే సంద‌ర్భంగా చేతిలో ఒక‌సారి రెడ్ క‌ల‌ర్ హార్ట్ సింబ‌ల్ బెలూన్‌ని ప‌ట్టుకుని, ఇంకోసారి చేతిలో గులాబీ పువ్వు ప‌ట్టుకుని ఇమ్మానియేల్ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ మోకాళ్ల‌పై కూర్చుని ప్ర‌పోజ్ చేసిన తీరు వైర‌ల్‌గా మారింది.  ఈ దృశ్యం చూసి రోజా అవాక్క‌యింది. ఫిబ్ర‌వ‌రి 12న ప్ర‌సారం కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. వ‌ర్ష కూడా సిగ్గుల మొగ్గ‌వుతూ ఇమ్మానియేల్ ఇచ్చిన‌ రోజా పువ్వుని అందుకోవ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఇమ్మానియేల్ భావోద్వేగానికి లోన‌య్యాడు. చాలా మంది అమ్మాయిలు త‌న ప‌క్క‌న నించోవ‌డానికే ఇష్ట‌ప‌డ‌లేద‌ని, అలాంటిది వ‌ర్ష మాత్రం త‌న‌తో స‌న్నిహితంగా వుంద‌నీ ఎమోష‌న‌ల్ అయ్యాడు.  వ‌ర్ష 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్'లోకి ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌రి నుంచి ఇమ్మానియేల్ తో స‌న్నిహితంగా వుంటోంది. వీరిద్ద‌రిపై గ‌త కొన్ని రోజులుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశం జ‌ర‌గ‌డం, ప్రేమికుల రోజు సంద‌ర్భంగా చిత్రీక‌రించిన ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోలో జ‌డ్జెస్ సాక్షిగా ఇమ్మానియేల్ .. వ‌ర్ష‌కు ప్ర‌పోజ్ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్ర‌వ‌రి 12న ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానున్న‌ది.