తెలంగాణలో సోమవారం సెలవు.. ఎందుకంటే?

  తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ సందర్బంగా ఈ నెల 21న సోమవారం రాష్ట్ర ప్రభుత్వం  పబ్లిక్ హాలీడేగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆది, సోమవారం  విద్యార్థులకు సెలవులు రానున్నాయి. మొత్తంగా సోమవారం ప్రభుత్వ కార్యాలయాలు బంద్ కానున్నాయి. మరోవైపు ఆదివారం, సోమవారం సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో వైన్స్‌లు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆషాడం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మహా నగరం హైదరాబాద్ లో ఇప్పటికే బోనాల పండుగ చివరి దశకు చేరుకుంది. అయితే ఆదివారం ఆషాడ మాసంలో చివరి బోనాల పండుగ పూర్తవుతుంది. దీంతో సోమవారం రోజు తెలంగాణ ప్రభుత్వం అధికారిక బోనాల పండుగ సెలవును ప్రకటించింది.

సిట్‌ విచారణకు హాజరైన ఎంపీ మిథున్‌రెడ్డి

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విజయవాడలో సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆయన కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడలోని సిట్  కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆయన ఈ కేసులో ఏ4గా ఉన్నారు. ఇప్పటికే మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.  శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. మిథున్‌రెడ్డి రాక నేపథ్యంలో సిట్‌ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో పెట్టిన తప్పుడు కేసు ఇది అని.. ఎట్టి పరిస్థితుల్లో ఇది నిలబడదని అన్నారు. నోటి మాటలతో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు మిథున్‌రెడ్డి తెలిపారు.    

టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులు సస్పెండ్

  టీటీడీ దేవస్థానంలో  పని చేస్తున్ననలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేశారు. టీటీడీలో పనిచేస్తున్న బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( క్వాలిటీ కంట్రోల్),  ఎస్. రోసి, స్టాప్ నర్స్, బర్డ్ ఆసుపత్రి, ఎం.ప్రేమావతి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ , బర్డ్ ఆసుపత్రి, అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ  లలో విధులు నిర్వహిస్తున్న ఈ నలుగురు ఉద్యోగులను టిటిడి సస్పెండ్ చేసింది. సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని  అందుకు సంబంధించిన ఆధారాలు ,వచ్చిన ఆరోపణల నేపథ్యంలో  వారిని సస్పెండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. సదరు ఆరోపణల నేపథ్యంలో  టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ  సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ  భాద్యతా రహితంగా వ్యవహరించడం జరిగింది .ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.  

రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరం

కాంగ్రెస్ లో మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యత అన్నది ఎండమావే అన్న విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. తాజాగా రేవంత్ రెడ్డి మరో పదేళ్లు తానే సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి సంచలన కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలు పార్టీ విధానాలకు పూర్తి విరుద్ధమని సమాజిక మాధ్యమ వేదికగా స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (జులై 18)న యంగ్ ఇండియా స్కూల్ కు శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ మరో పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందనీ, తానే ముఖ్యమంత్రిననీ అన్నారు. ఈ వ్యాఖ్యలను వ్యాఖ్యలపై కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ స్థానం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదును చూసి సీఎంకు షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది నిర్ణయించాల్సింది పార్టీ అధిష్ఠానం అన్న కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి తానే మరో పేదళ్లు సీఎం అన్న వ్యాఖ్యలు పార్టీ విధానానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.  కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుందనీ, అంతే కానీ ఎవరికి వారుగా సొంతంగా తమను తాము సీఎం అని ప్రకటించుకోవడం సరికాదని పేర్కొన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సహించరంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కాంగ్రెస్ లో అనైక్యత మరో సారి ప్రస్ఫుటమైంది. 

ఇండియా కూటమి నుంచి వైదొలగిన ఆప్.. బీహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడి

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఇండియా కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  ప్రకటించింది. సరిగ్గా పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముంగిట కూటమి నుంచి వైదొలగుతూ ఆప్ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి ఇబ్బందికరమేననడంలో సందేహం లేదు. పార్లమెంటులో అధికార ఎన్డీయే కూటమిని ఇరుకున పెట్టాలని భావిస్తున్న ఇండియా కూటమికి ఇప్పుడు ఒక భాగస్వామ్యపక్షం వైదొలగడం మింగుడుపడని అంశమే.  పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు లేవనెత్తాల్సిన అంశాలపై శనివారం (జులై 19) ఇండియా కూటమి సమావేశం కానున్న సమయంలో  ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడమే కాకుండా, కూటమి సమావేశానికి కూడా హాజరు కావడం లేదని స్ఫష్టం చేసింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కూటమి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇండియా కూటమి సమావేశానికి హాజరు కానున్నారు.   ఐక్యత విషయంలో ఇండియా కూటమి వైఫల్యాన్ని కారణంగా చూపుతూ ఆప్ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు శుక్రవారం (జులై 18) ప్రకటించిన సంగతి విదితమే.  అయినా ఇండియా కూటమితో పొత్తు కేవలం లోక్‌సభ ఎన్నికల వరకేననీ, ఆ తరువాత జరిగిన  ఢిల్లీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో తాము ఒంటరిగానే బరిలోకి దిగామనీ ఆప్ గుర్తు చేసింది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేసింది.  

నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు.  అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమై, తీవ్ర ఆర్థిక సమస్యలతో చికిత్సకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమైన మొత్తాన్ని అందించేందుకు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఫిష్ వెంకట్ ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  ఫిష్ వెంకట్ వయస్సు 53ఏళ్లు. గత మూడేళ్లుగా ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత వ్యాధితో  బాధ పడుతున్నారు.  చికిత్స తీసుకుంటున్నప్పటికీ వ్యాధి ముదిరిపోవడంతో కోలుకునే అవకాశం లేకుండా పోయింది.  పేరుకి చిన్న ఆర్టిస్ట్ అయినప్పటికీ ఫిష్ వెంకట్ కి ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది.   ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్.   ముషీరాబాద్  మార్కెట్ లో చేపలు అమ్ముకునే వెంకటేష్ కి ఆ వ్యాపారమే ఇంటి పేరుగా మారిపోయి ఫిష్ వెంకట్ గా పాపులరయ్యారు.  

మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు

ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ మరింత వేగం పెంచింది. ఇప్పటికే పలువురిని సిట్ విచారించి..కొందరిని అరెస్ట్ చేసింది. అయితే తాజాగా సిట్ అరెస్టు చేస్తుందని ముందస్తు బెయిల్ కోసం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టు, సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని రెండు కోర్టులూ కూడా స్పష్టం చేశాయి.  మరో వైపు సిట్ కూడా మిథున్ రెడ్డి ని అరెస్టు చేసే దిశగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.   అయితే   సిట్ విచారణ కు రావాలని ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ ఆధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో మద్యం కుంభకోణంలో కేసులో నిందితుడు మిథున్ రెడ్డి సిట్ విచారణకు  శనివారం  హాజరుకానున్నారు.  ఉ  మద్యం కుంభకోణం కేసులో A 4 గా మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది.  మరో వైపు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన కలత్తూరు నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. సోమవారం సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి నారాయణ స్వామి  సైతం కనిపించడం లేదు. అరెస్టు భయంతో కనిపించకుండా పోయారని ప్రచారం జరుగుతోంది.

భారీ వర్షంతో హైదరాబాద్‌ అతలాకుతలం..నీట మునిగిన పలు ప్రాంతాలు

    హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి చిగురుటాకులా భాగ్యనగరం వణుకిపోతుంది. పలు ప్రాంతాల్లో  ఇళ్లు, షాపుల్లో వరద నీరు చేరింది. రోడ్లు ఫ్లైఓవర్లు వరద నీటితో పొంగిపొర్లుతూ సముద్రాన్ని తలపిస్తున్నాయి. పలు వాహనాలు వరద ప్రవాహంతో కోట్టుకుపోయాయి. కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పల్ - హబ్సిగూడ, మియాపూర్ - గచ్చిబౌలి మార్గాల్లో, వివిధ కూడళ్లలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  భారీ వర్షంతో రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. ఓ కార్ల షోరూమ్‌లోకి 4 అడుగుల మేర వరద చేరింది. దీంతో అందులో పనిచేస్తున్న సుమారు 30 మంది ఉద్యోగులు వరదలో చిక్కుకుపోయారు. తమను రక్షించాలని పోలీసులు, డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులకు షోరూం సిబ్బంది సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన హైడ్రా వారిని వెనుక వైపు నుంచి రక్షించారు. చిన్న పడవలలో వారిని బయటకు తీసుకువచ్చారు. భారీ వర్షంతో కురవడంతో రోడ్లపైకి వరద నీరు పోటెత్తింది. నగరంలో అత్యధికంగా మారేడ్‌పల్లి పికెట్ ప్రాంతంలో 11.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బాలనగర్, బండ్లగూడ, మూషీరాబాద్‌లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.   తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు (శనివారం) వరకూ తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురవనున్నట్లు వెల్లడించింది. భారీ వర్షల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. జీహెచ్ఎంసీ   హైడ్రా అధికారులు వరదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

జగన్ ఈ పేరున్నోళ్లు..ఎందుకిలా ఉంటారు?

  ఏపీలో మాజీ సీఎం జగన్ పేరు తరచూ వినిపిస్తూనే ఉంటుంది. తన తండ్రి మరణించినప్పటి నుంచీ ఆయన ఏదో ఒక రూపంలో రాజకీయం చేస్తూ జనం నోళ్లలో నానుతూనే వస్తున్నారు. ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు, ఇలా రకరకాలుగా హల్ చల్ చేస్తూనే వచ్చారు. అధికారంలోకి వచ్చాక అయ్యగారి అసలు స్వరూపం బయట పడింది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలు పెట్టిన జ.. గన్ తర్వాత రాష్ట్ర రాజధాని నిర్మాణం నుంచి మొదలు పెడితే ఆర్ధిక పరిస్థితి చిందర వందర గందరగోళం చేయడం వరకూ ఆ రూటే సపరేటు.  క్విడ్ ప్రో కో అనే కొత్త విధానం ద్వారా ఏకంగా లక్ష కోట్ల అవినీతికి తెరలేపిన జగన్ తర్వాతి కాలంలో ఇవే కేసులతో జైలుకెళ్లి 16 నెలలు ఉన్నారు. బయటకొచ్చాక.. ఏపీ లో అనేకరకాల రాజకీయం చేసి.. అధికారం చేపట్టారు. ఆపై కొన్ని వందల కోట్ల రూపాయల మేర అవినీతి కార్యకలాపాలకు పాల్పడి.. భారీ ఎత్తున వెనకేసినట్టు చెబుతారు. శాండ్ వైన్ మైన్ అంటూ రంగమేదైనా రాబడి చూసుకోవడమే మెయిన్ కాన్సెప్ట్. ఆ మాటకొస్తే తాను అధికారులతో నిర్వహించే మీటింగులు కూడా ఓట్లా నోట్లా ఇవేవీ రాకుంటే నో అనేస్తారని టాకు. జగన్ ఒక్కడే కాదు ఆయనతో పాటు ఆయన మంత్రి వర్గంలో పని చేసిన వారు కూడా ఏదో ఒక రకంగా అవినీతిలో భాగమయ్యి తలా పాపం తిలాపిడికెడుగా బిహేవ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా కలసి వరుస పెట్టున జైళ్లకెళ్తున్న దృశ్యాలు మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి.  ఇక్కడ తెలంగాణలో ఆ కొరత తీర్చడానికా? అన్నట్టు మరో జగన్ తయారయ్యాడు. అయితే ఆయన రాజకీయాల్లో లేరు కానీ వారికన్నా మించి అన్నట్టుగా చెలరేగిపోయినట్టు తెలుస్తోంది. కేవలం HCA అనే ఒక క్రికెట్ అసోసియేషన్ నుంచే ఆయన ఏకంగా 800 కోట్ల రూపాయల బీసీసీఐ నిధులను దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. ఇటు SRH నుంచి అదనపు టికెట్లను ఆశించడం నుంచి మొదలు పెడితే.. టీవీల కొనుగోళ్ల వరకూ అంతా అవినీతి మయంగా తెలుస్తోంది.  ఆ మాటకొస్తే తనకున్న రాజకీయ పలుకుబడి అండదండలను అడ్డు పెట్టుకుని అదిపనిగా.. ఈ జగన్మోహనుడు HCAలోకి రాంగ్ ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాదు.. పరి పరి విధాలా ఈ క్రికెట్ అసోసియేషన్ ని కంపు కంపు చేసినట్టు ఆరోపిస్తోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఈ తెలంగాణ జగన్ కేవలం HCAలో ఉన్నందుకే ఇంత పెద్ద మొత్తంలో మేస్తే.. ఆయనే గనక రాజకీయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తే పరిస్థితేంటన్న ప్రశ్న వినిపిస్తోంది. అసలా పేరే అలాంటిది.. ఎటు నుంచి ఎటు చూసినా.. అవినీతిలో అందనంత ఎత్తుకు ఎదగాల్సిందే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి సర్వత్రా.

పాలమూరు ప్రజలు అన్నం పెడితే..కేసీఆర్ సున్నం పెట్టారు : సీఎం రేవంత్‌రెడ్డి

  పాలమూరు జిల్లా అంటే మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబానికి చిన్నచూపని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలు లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ ప్రజలు ఓడించడానికి సిద్దమైతే కేసీఆర్ మహబూబ్​నగర్‌కు వలస వచ్చారని సైటైర్లు వేశారు. కేసీఆర్‌ను కడుపులో పెట్టుకొని చూస్తే జిల్లాకు ఆయన చేసిందంటని ప్రశ్నించారు. పదేళ్లు సీఎంగా ఉన్నా పైసా పనికూడా చేయలేదన్నారు. 2023లో కాంగ్రెస్ పాలమూరు జిల్లాలో 12 సీట్లు ఇచ్చారని, మరో రెండు గెలిచి ఉంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్న.. మా పాలమూరు ప్రాజెక్టులకు అడ్డం పడొద్దు. మీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సమానంగా అభివృద్ధి చేందాలనే ఆలోచనతో ఉన్నది నిజమే అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి మా ప్రాజెక్టులు పూర్తయ్యేలా ఉదారంగా ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న. మీరు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కల్వకుర్తి ప్రాజెక్టు మొదలుపెట్టారు. మీరు సీఎంగా ఉన్నప్పుడే బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులు వచ్చాయిని రేవంత్‌రెడ్డి తెలిపారు. మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవారు. మీ మేలు ఎప్పటికి మర్చిపోమన్నారు. మా విజ్ఞప్తులు మీరు వినకపోతే పోరాటాలు ఎలా చేయాలో పాలమూరుకు తెలుసు. మాకు పౌరుషం ఉంది. పోరాడి సాధించుకునే శక్తి ఉంది. ఈ పోరాటానికి నాయకత్వం నేను వహిస్తాను’ అన్నారు. అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించినా, ఇక్కడి సూర్యుడు అక్కడ ఉదయించినా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు  

ఫోన్ ట్యాపింగ్ నిందితుడి ఫ్లాట్లో.... ఏపీ లిక్కర్ స్కాం బాబులు

  తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ , ఏపీ లిక్కర్ స్కాం మధ్య లింకులు ఉన్నట్లు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. మాజీ ముఖ్యంత్రులు కేసీఆర్, జగన్‌ల జాయింట్ ఆపరేషన్‌తోనే ఈ కుట్రలు జరిగాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. దుబాయ్‌లోని పారామౌంట్ హోటల్ ఫ్లాట్ నెంబర్ 5801లో ఏపీ లిక్కర్ స్కాం నిందితులు చాణక్య, వరుణ్ సహా ఇంకొందరు విలాసవంతమైన జీవితం గడిపినట్లు సిట్ గుర్తించింది. ఆ ఫ్లాట్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్‌రావు ఆధీనంలో ఉన్నట్లు వెల్లడైంది. ఆ క్రమంలో రెండు స్కాంలు వైసీపీ, బీఆర్ఎస్‌ల జాయింట్ ఆపరేషనే అన్నది నిరూపితమైందంటున్నారు.  దుబాయ్‌లోని ఖరీదైన ప్రాంతంలో శ్రవణ్‌రావు మరొకరితో కలిసి కొనుగోలు చేసిన ఫ్లాట్‌లోనే లిక్కర్‌ స్కామ్‌ నిందితులు మకాం వేసినట్టు తేలడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. లిక్కర్‌ స్కామ్‌ సూత్రధారి రాజ్‌ కసిరెడ్డికి సన్నిహితంగా ఉంటూ వ్యవహారం నడిపిన చాణక్య బూనేటి,  వరుణ్ మరో నలుగురు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్‌ 27 వరకు ఆ ఫ్లాట్‌లోనే ఉన్నారని వెల్లడైంది. ఆ ఫ్లాట్‌ను డీలక్స్‌ హాలిడే హోమ్స్‌ సంస్థకు లీజుకిచ్చామని, ఆ సంస్థ ఎవరికి అద్దెకిచ్చిందో తమకు తెలియదని శ్రవణ్‌రావు తరపున ఐన్యూస్‌ యాజమాన్యంఇచ్చిన ప్రకటన అవాస్తవమని తేలింది.  యజమాని కోటా కింద శ్రవణ్‌రావే కొంతకాలం తీసుకుని, లిక్కర్‌ స్కామ్‌ నిందితులకు ఇచ్చారని.. స్వయంగా ఆయన వారితో కలిసి ఉన్నారని పక్కా ఆధారాలు సిట్ అధికారులకు లభించాయంట. దుబాయ్‌లోని పారామౌంట్‌ టవర్‌ హోటల్స్‌ అండ్‌ రెసిడెన్సెస్‌లో 35వ అంతస్తు వరకు హోటల్‌ ఉండగా ఆపై అంతస్తుల్లో నివాస ఫ్లాట్లు ఉన్నాయి. అందులో 5801 నంబర్‌ ఫ్లాట్‌ శ్రవణ్‌రావుకు సంబంధించింది. దీనిని రెంటల్‌ ఏజెన్సీకి లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఏడాదిలో ఒక నెల పాటు యజమాని ఆ ఫ్లాట్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. అంతకు మించితే నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్‌ 27 వరకు రెండు నెలల పాటు ఫ్లాట్‌ను ఉపయోగించుకున్న శ్రవణ్‌రావు ఒక నెల ఉచితంగా, మరో నెల కేవలం నిర్వహణ ఖర్చులు చెల్లించినట్టు తేలింది. టవర్‌ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం.. యజమానులు సహా ఎవరు ఫ్లాట్‌లోకి వెళ్లాలన్నా ఆధారపూర్వక వివరాలు ఇవ్వాలి. ఆ వివరాల మేరకు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్‌ 27 వరకు శ్రవణ్‌రావు, చాణక్య, మరో నలుగురు ఫ్లాట్‌లోనే ఉన్నారని తేలినట్టు సమాచారం. ఏపీ లిక్కర్‌ స్కామ్‌తో దుబాయ్‌ ఫ్లాట్‌కు లింకులు బయటపడటంతో జగన్, కేసీఆర్‌ల రాజకీయ వ్యాపారం బహిర్గతమైందంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏపీసీసీ ప్రెసిడెంట్, జగన్ చెల్లెలు షర్మిల ఫోన్ ట్యాప్ చేసి ఆ వివరాలు జగన్‌కు అందజేసినట్లు ఆరోపణలున్నాయి. ఒకవైపు చూస్తే తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూ సమన్వయంతో ముందుకెళ్తున్నారు. వారిద్దరు ఎప్పుడు భేటీ అయినా బీఆర్ఎస్, వైసీపీ వర్గాలు నానా రచ్చ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో తమ హయాంలో వైసీపీ, బీఆర్ఎస్ పెద్దలు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి, చీకటి వ్యవహారాల్లో లాలూచీ పడ్డారని తాజా ఉదంతాలు స్పష్టం చేస్తుండటంతో ఆపార్టీల ప్రతిష్ట మరింత దిగజారుతూ.. తెలుగు ప్రజల ఆగ్రహానికి గురవుతోంది.

టీడీపీకి రాజీనామా చేస్తూ అశోక్ గజపతి రాజు భావోద్వేగం

  కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తెలుగు దేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశారు. అలాగే పార్టీ పొలిట్ బ్యూరో పదవికి కూడా రిజైన్ చేశారు.  ఇటీవల రాష్ట్ర పతి ఆయన్ను గోవా గవర్నర్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించవలసిందిగా ఆయ‌న‌ టీడీపీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు పంపించారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు టీడీపీలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీలో ఎన్నో అవకాశాలు అందుకున్నట్లు చెప్పుకొచ్చారు.  ఇన్ని అవకాశాలు కల్పించిన పార్టీకి, సీఎం చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు ప్ర‌త్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి అశోక్‌ గజపతి రాజు పార్టీలో కొనసాగుతున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అశోక్‌ గజపతిరాజు రెండవసారి శాసన సభకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో కూడా విజయనగరం నుంచి విజయం సాధించారు. అయితే, 2004లో అశోక్‌ గజపతిరాజు ఓటమి పాలయ్యారు. కానీ, 2009లో తిరిగి అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు.  

లోకేశ్‌ను క‌ల‌వ‌లేదు..క‌లిస్తే త‌ప్పేంటి : కేటీఆర్

  ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను క‌ల‌వ‌లేదు కానీ క‌లిస్తే త‌ప్పేంటి..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. శుక్రవారం ఖమ్మంలోని దివంగత మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించి  ఖ‌మ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ బీఆర్‌ఎస్ నేతలతో కలిసి మాట్లాడారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో డ‌బ్బున్న మ‌హిళ‌లు మ‌ధ్యాహ్నం కిట్టి పార్టీలు చేసుకుంటుంటారు.  ఆయన కూడా కిట్టి పార్టీ ఆంటీలాగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఎవ‌రో ఎక్క‌డో చెప్పింది విని అదే నిజ‌మ‌నుకుని భ్ర‌మించి, మ‌ళ్లీ ఓ ప‌ది మందిని పోగేసుకుని చిట్ చాట్‌ల పేరిట చిల్లర మాట‌లు మాట్లాడుతున్నాని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  శ‌వాల మీద పేలాలు ఏరుకోవ‌డం ఏంద‌య్యా..? నాక‌ర్థం కాదు. ఎవ‌డో దుబాయ్‌లో చ‌నిపోతే దాన్ని నాకు అంట‌గ‌ట్ట‌డం ఏంది ఏమ‌న్నా జ్ఞానం ఉందా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. నేను అర్ధ‌రాత్రి పోయి లోకేశ్‌ను క‌లిసాన‌ట‌. మేం ఏం జేసిన బాజాప్తా చేస్తాం. బేజాప్తా చేయాల్సిన క‌ర్మ మాకు లేదు. అయినా నాకు తెల్వ‌క అడుగుతా.. క‌ల‌వలేదు కానీ క‌లిస్తే త‌ప్పేంది..? అని రేవంత్‌ను కేటీఆర్ ప్ర‌శ్నించారు. ప‌క్క రాష్ట్రం మంత్రి యువ‌కుడు నాకు త‌మ్ముడి లాంటోడు క‌లిస్తే క‌లుస్తా.. కానీ క‌ల‌వ‌లేదు. దానికేదో ఆయ‌న గొప్ప విష‌యం క‌నిపెట్టిన‌ట్టు. పాల‌న గురించి తెలుసుకోవాలంటే మ‌మ్మ‌ల్నే బీఆర్ఎసోళ్ల‌ను క‌లుస్తారు. దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను క‌లుస్తారు. ఆయ‌న న‌న్ను క‌లిస్తే నీకేం ఇబ్బంది. నీకేం బాధ అయితుంది. ఈ చిల్ల‌ర మాట‌ల‌తోని ఎన్నిరోజులు టైం పాస్ చేస్త‌వ్. ఎన్ని రోజులు ప్ర‌జ‌ల‌ను ఆగం చేసే ప్ర‌య‌త్నం చేస్త‌వ్ అని ముఖ్యమంత్రి కేటీఆర్ మండిపడ్డారు.  

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

  హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. గచ్చిబౌలి, కొండాపూర్ హైటెక్ సిటీ, జూబిలీహిల్స్, బంజారహిల్స్, యూసఫ్ గూడ, మధురానగర్, అమీర్‌పేట్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. డ్రైనేజీ రోడ్లపై పొంగి పొర్లుతోంది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకొని ఇబ్బందులు పడ్డుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తెలంగాణలో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వరకు ఉరుములు మెరుపులతో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నాది. శుక్రవారం వరంగల్‌, మహబూబాబాద్‌, యాదాద్రి, ఉమ్మడి నల్గొండ, నాగర్‌కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం హనుమకొండ, వరంగల్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

పెద్దారెడ్డిని స్వగ్రామంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. తాడిపత్రి పర్యటనకు తాజాగా ఆయనకు అనుమతి నిరాకరించారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు తాడిపత్రిలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడానికి సిద్దమైన కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. దాంతో నాలుగు రోజుల క్రితం పెద్దారెడ్డి తన పర్యటనను ఎప్పటిలాగే మరోసారి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నెల 18న పర్యటనకు ఓకే అన్న అధికారులు పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మనపల్లి చేరుకోగానే హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించడంతో మళ్లీ తాడిపత్రితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ క్రమంలో తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.  తాడిపత్రిలో తాజాగా వైసీపీ ‘చంద్రబాబు రీకాలింగ్’ మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని  పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్లేందుకు వీలు లేదని, తాడిపత్రిలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున తిమ్మంపల్లి నుంచి వెళ్లేందుకు వీలులేదని పోలీసులు స్పష్టం చేశారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైసీపీ నేతలు సమావేశానికి హాజరుకావొచ్చని పోలీసులు తెలిపారు. అలాగే కేతిరెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే స్వగ్రామమైన తాడిపత్రి సెగ్మెంట్లోని  తిమ్మంపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఎందుకు అనుమతించరని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్లి తీరతానంటూ రోడ్డుపైనే మాజీ ఎమ్మెల్యే బైఠాయించారు. పోలీసుల తీరుపై పెద్దా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా తాడిపత్రిలోనూ అటు తిమ్మంపల్లిలోనూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు... ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టకుండా కోర్టు ఆంక్షలు విధించింది. అయితే తర్వాత హైకోర్టు ఆదేశాలతో సొంత ఇలాకాలోకి వెళ్లేందుకు పెద్దారెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తుంటే.. జేసీ వర్గీయుల తిరుగుబాటుతో పోలీసులు ఎప్పటికప్పుడు పెద్దారెడ్డికి అనుమతి నిరాకరిస్తున్నారు. ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుని, పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. అయితే ఆ రోజు తాడిపత్రిలో మంత్రుల ప్రొగ్రాం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో వైసీపీ నేతలు తమ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది ఏమి లేక పెద్దారెడ్డి అప్పుడు వెనుతిరిగారు.  తాజాగా మళ్లీ తాడిపత్రిలో ‘చంద్రబాబు రీకాలింగ్’ కార్యక్రమం చేపట్టడానికి పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లి చేరుకున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి , వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వైరం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రి రావడానికి రెడీ అయినా  జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం ఆయన్ని అడ్డుకోవడనికి ఎక్కడికక్కడ  మొహరిస్తోంది. ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో పోలీసులు శాంతిభద్రల విఘాతం కలుగుతుందని మరోసారి పెద్దారెడ్డి పర్యటనకు చెక్ పెట్టారు.

మాజీ సీఎం కుమారుడు అరెస్ట్

  చత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ సీనియర్ నేత భూపేశ్‌ బఘేల్‌ కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈడీ శుక్రవారం అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ సంబంధించి మనీ లాండరింగ్  కేసులో ఇవాళ తండ్రీకొడుకులిద్దరికీ చెందిన ఆస్తులపై భారీ బందోబస్తు నడుమ అధికారులు సోదాలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్ స్కామ్‌లో రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. లిక్క‌ర్ స్కామ్‌లో త‌మ‌కు కొత్త ఆధారాలు దొరికినట్లు ఈడీ చెబుతోంది.  అసెంబ్లీ స‌మావేశాల‌కు చివ‌రి రోజు కావ‌డంతో రాజ‌కీయ క‌క్ష‌తో ఈడీ సోదాలు చేప‌డుతున్నార‌ని మాజీ సీఎం భూపేశ్ భ‌గేల్ ఆరోపించారు.మార్చి 10వ తేదీన కూడా చైత‌న్య భ‌గ‌ల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేప‌ట్టారు. కాగా.. బర్త్‌డే రోజు నాడే చైతన్యను ఈడీ అధికారులు అరెస్టు చేయడం గమనార్హం. దీనిపై ఆయన తండ్రి భూపేశ్‌ స్పందించారు. ‘‘రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు నేడు చివరి రోజు. అదానీ సంస్థ కోసం చెట్లు కూలుస్తున్న అంశాన్ని మేం లేవనెత్తాం. వెంటనే మా ఇంటికి ఈడీని పంపించారు. నా కుమారుడి పుట్టిన రోజున మంచి బహుమతి ఇచ్చారు’’ అని మాజీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మిథున్‌రెడ్డికి సుప్రీం షాక్.. అరెస్ట్‌కు రంగం సిద్దం చేసిన సిట్

  రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించడంతో.. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్  చేసిన మిథున్‌రెడ్డికి అక్కడా చుక్కెదురైంది. మరోవైపు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది. పరారీలో ఉన్న మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో  పిటిషన్ వేశారు.  మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ కావడంతో ఆయన తలదాచుకున్న ప్రాంతాల్లో సోదాలు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు సిట్ అధికారులు.  మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించడం, లొంగిపోవడానికి సమయమిచ్చేందుకు నిరాకరించడంలో ఆయన అరెస్ట్ ఖాయమైంది. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా.. రాజకీయ కక్షలో భాగంగా తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని మిథున్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ జరిపిన జస్టిస్ జెబి పార్థివలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం.. అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. సరెండర్ కావడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనాన్ని కోరగా.. దానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. తాజాగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

కవితక్క కథకళీ!

ఈ మ‌ధ్య క‌విత‌క్క కొత్త క‌థ మొద‌లు పెట్టారు. అదేంటంటే.. కాంగ్రెస్ తీసుకొచ్చిన బీసీ ఆర్డినెన్స్ బాగుంద‌ని..  బీఆర్ఎస్ కూడా త‌న దారికి రావ‌ల్సిందేనంటున్నారు. నిజానికి.. క‌విత ఇలా ఎందుకు అనాల్సి వ‌చ్చిదంటే.. ఆమెపై కావ‌చ్చు, ఆమె కుటుంబ స‌భ్యుల‌పై కావ‌చ్చు వ‌రుస పెట్టున న‌మోద‌వుతున్న కేసుల మోత అలాంటిది. తాజాగా చూస్తే హెచ్ సీ ఏలోనూ కవిత‌క్క హ‌స్త‌ముంద‌ని అంటున్నారు. అంత‌గా ఆమె, ఆమె కుటుంబ స‌భ్యుల అవినీతి  బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా న‌లు మూల‌లా విస్త‌రించింద‌ని చెబ‌తారు. మొన్న అరెస్ట‌యిన జ‌గ‌న్మోహ‌న రావు మ‌రెవ‌రో కారు.. హ‌రీష్ రావు కి సోద‌రుడి వ‌రుస అవుతారు. అంటే క‌విత‌కు బావ వ‌రుస‌. ఈ లెక్క‌న చూస్తే ఇందు గ‌ల‌దు అందు లేద‌న్న సందేహంబు వ‌ల‌దు- క‌ల్వ‌కుంట్ల వారి అవినీతి క‌థ‌.. ఎందెందు చూసిన అందందే క‌ల‌ద‌న్న మాట వినిపిస్తోంది. దీంతో క‌విత‌క్క కాంగ్రెస్ రాగం అందుకున్నారు. అందుకు బీసీ తాళం ఎంచుకున్నారు. తద్వారా  ఛాన్స్ దొరికిన‌పుడ‌ల్లా కాంగ్రెస్ కి తాన తందాన అన‌డానికి చిడ‌త‌లు సిద్ధం చేసుకున్నార‌ని స‌మాచారం. మొన్న‌టి వ‌ర‌కూ ప్రో బీఆర్ఎస్ రాగం ఆల‌పించిన క‌విత‌క్క కొత్త‌గా ఈ కాంగ్రెస్ రాగ‌మాలిక అందుకోవ‌డం వెనుక ఉన్న అస‌లు కథ ఇదీ.  ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో  చేసిన అవినీతి తెలంగాణ నాలుగు చెరగులా విస్త‌రించిన విష‌యం తెలిసిందే. స్వ‌యానా సొంత పార్టీయే ఆమెను సింగ‌రేణి కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తొల‌గించింది. ఇక బ‌య‌ట సంగ‌తి మాటేంటీ? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక ప‌క్క ఢిల్లీ రేంజ్ లో లిక్క‌ర్ కేసు మెడకు ఉచ్చులా త‌గులుకుని క‌నిపిస్తోంది. మ‌రొక ప‌క్క తెలంగాణ‌లోనూ ర‌క‌ర‌కాల కేసులు. తాజాగా హెచ్ సీ ఏ కేసు. ఒక‌టీ రెండు కాదు ఏకంగా 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్య‌వ‌హార‌మిది. ఇందులో కేటీఆర్ బావ‌మ‌రిదికే కాంట్రాక్టులు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ దిశ‌గా తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ సీఐడీకి కంప్ల‌యింట్ చేసింది. దీంతో బీఆర్ఎస్ పెద్ద‌ల‌తో మీకున్న సంబంధ‌మేంట‌న్న కోణంలో అరెస్ట‌యిన జ‌గ‌న్మోహ‌న‌రావును ఆరా తీస్తున్నారు విచార‌ణాధికారులు. బీసీసీఐ ఇచ్చిన 600 కోట్లు ఎటు మ‌ళ్లించార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ కేసు చూస్తుంటే తిరిగి  ఈడీ చేతుల్లోకి వెళ్లేలా క‌నిపిస్తోంది.  ఇక్క‌డ కూడా క‌విత‌క్క హ‌స్త‌మున‌న‌ట్టుగా స‌మాచారం.  ఇన్నేసి  కేసుల్లో పీక‌లోతు ఇరుక్కోవ‌డంతోనే స‌డేన్ గా తెలంగాణ వాదం వినిపించ‌డం, ఆపై బీసీల త‌ర‌ఫు పోరాటాలు.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఆర్డినెస్ కి  కవిత జైకొట్టి ప్రభుత్వం తన పట్ల ఒకింత సానుకూలంగా వ్యవహరించేలా చూసుకుందాని కవిత భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  ముందు ముందు  ఇంకెన్ని క‌విత‌క్క‌ క‌థ‌క‌ళి నృత్యాలు వెలుగులోకి వ‌స్తాయో ఇప్పుడిప్పుడే చెప్ప‌లేం అంటున్నారు కొంద‌రు.