సోనియా, మోడీలను భయపెడుతున్న 'ఆమ్ఆద్మీ'

      ఢిల్లీలో బలంగా ఉన్న కాంగ్రెస్, బిజెపిలను 'ఆమ్ఆద్మీ' కలవరపెడుతున్నాడు. కాంగ్రెస్, బిజెపిలతో ఈ కొత్త పార్టీ హోరాహోరీగా పోరాడుతుందని ఇప్పటికే వివిధ సర్వేలు నిర్దారించడంతో భవిష్యత్ రాజకీయాలలో 'ఆమ్ఆద్మీ' ప్రభావం పై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతో౦ది.   ఇప్పుడున్న రాజకీయపార్టీలు అనుసరిస్తున్న పద్దతులకు భిన్నమైన పద్దతులు అనుసరించడం ద్వారా 'ఆమ్ఆద్మీ' పార్టీ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. నీతి నీజాతి పరులు, సమర్ధులు అనే వారికీ ప్రాధాన్యం ఇచ్చి అభ్యర్ధులను ఎంపిక చేయడంతో పాటు, నిరాడంబరంగా ఆ పార్టీ చేస్తున్న ప్రచారం కాంగ్రెస్, బిజెపిలకు చెమటలు పట్టిస్తోంది.   ప్రజల వద్దకు ప్రజలు అనే భావంతో వ్యూహాలను రూపొందిస్తున్నారు. ప్రజలకు అర్ధంకాని భారీ వాగ్ధానాలతో లేనిపోని ఆశలు సృష్టించకుండా, నిత్య జీవితంలో వారికి ఎదురవుతున్న సమస్యలకు ఎలా పరిష్కారం చూపగాలమో చెబుతున్నారు. ప్రధాన పార్టీలు చేస్తున్న అవినీతిని ప్రస్తావిస్తూ ఆ పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణాలను ప్రస్తావిస్తూ 'ఆమ్ఆద్మీ' ప్రధాని పై విమర్శలు చేస్తున్నారు. వ్యవస్థలో మార్పు రావాలాని మీరు కోరుకుంటున్నారా? లేదా ? అని ప్రజలను స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు.   అక్రమంగా సేకరించిన డబ్బుతో కాంగ్రెస్, బిజెపిలు ఒక్కో ఓటుకు భారీ ఎత్తున డబ్బు చెల్లించే అవకాశం ఉందని...అయితే ఓట్ల కోసం డబ్బులు, చీరలు ఇస్తే తీసుకోండని ప్రజలకు చెప్పడం ఆసక్తికరం. అదంతా ప్రజల డబ్బెనని, అందువల్ల ఆ పార్టీలు ఇచ్చినవి తీసుకొని ఓటు మాత్రం 'ఆమ్ఆద్మీ' పార్టీకి వేయాలని కోరుతున్నారు. మద్యం అనారోగ్యం కాబట్టి దానిని తీసుకోవద్దని సూచిస్తున్నారు.   'ఆమ్ఆద్మీ' పార్టీ ఢిల్లీలో పోరాడుతున్న తీరు దేశవిదేశాల్లోని వారికి ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. పోలింగ్ కి దూరంగా ఉండే ఐటీ ఉద్యోగులు, ఉన్నతాధికారులు వంటి వారిలో 'ఆమ్ఆద్మీ' పట్ల కలుగుతున్న ఆసక్తి వల్ల ఢిల్లీలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోందని మేధావి వర్గాలు భావిస్తున్నాయి.

రాష్ట్ర విభజనపై రోజుకో కొత్త ముడి

  రాష్ట్ర విభజన అంశం కంటే, ఇరుప్రాంతల నేతలు చేస్తున్నవివాదస్పద వ్యాఖ్యల వలన ఇప్పటికే జటిలంగా ఉన్నఈ సమస్య క్రమేపి మరింత జటిలంగా మారుతోంది.   ఇరుప్రాంతల నేతలు తమ రాజకీయ మైలేజి పెంచుకోవడానికో, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే తాము తమ ప్రజల, ప్రాంతం మేలుకోరుతూ వీర పోరాటం చేస్తున్నామని చాటుకొనే ప్రయత్నంలోనో లేక వేరే ఇతర కారణాలతోనో చేస్తున్న చిన్నచిన్న వ్యాఖ్యలు, విమర్శలు, డిమాండ్స్ పై, రెండోవైపు వారు తీవ్రంగా స్పందిస్తుండటంతో ప్రతీ అంశం కూడా ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవలసి రావడంతో రాష్ట్ర విభజన ఊహించిన దానికంటే ఇంకా చాలా క్లిష్టంగా మారుతోంది. కానీ, తాము ఆ విధంగా స్పందించకపోయినట్లయితే కేంద్రం ఎదుటవారిని మంచి చేసుకొనే ప్రయత్నంలో వారికి ఆయాచితంగా అన్నీఇచ్చేసి తమ ప్రాంతానికి అన్యాయం చేస్తుందనే భయం వల్ల కూడా అందరూ తలో రాయి వేస్తూ క్లిష్టమయిన విభజన అంశాన్ని మరింత క్లిష్టంగా మార్చుతున్నారు.   అయితే, ఈ విషయంలో వారికంటే ముందు కాంగ్రెస్ అధిష్టానాన్నే ఎక్కువ తప్పు పట్టవలసి ఉంటుంది. ఒకసారి తెలంగాణా ప్రాంతం వారిని, మరోసారి సీమాంధ్ర ప్రాంతం వారిని మంచి చేసుకొనే ప్రయత్నంలో రోజుకో కొత్త ప్రతిపాదన చేస్తూ ఇరు ప్రాంతాల ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.   ఇంతవరకు రాష్ట్ర విభజనలో జలవనరులు, ఉద్యోగాలు, హైదరాబాద్ అంశాలే క్లిష్టమయినవిగా అందరూ భావిస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు వాటికి కొత్తగా భద్రాచలంపై ఎవరికి హక్కులు ఉండాలనే అంశం కూడా వచ్చి జేరింది. అంటోనీ కమిటీ హైదరాబాదు ఆదాయంపై పదేళ్ళపాటు ఇరుప్రాంతాలకి జనాభా ప్రాతిపదికన హక్కులు ఉండాలని ప్రతిపాదించడంతో సహజంగానే తెలంగాణా నేతలలో వ్యతిరేఖత మొదలయింది.   ఈవిధంగా రోజుకొక కొత్త అంశంపై తెరపైకి తెస్తూ దానిపై పీట ముడులు వేసుకొంటూ పోవడం వలన, తెలంగాణా ప్రక్రియలో మరిన్ని అడ్డంకులు పెరిగి చివరికి రాష్ట్ర ఏర్పాటు వాయిదాపడినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే, ఇక ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చే కూటమిపై, అప్పటి రాజకీయ పరిస్థితులు, అవసరాలు, పొత్తులు, ఒత్తిళ్ళు వంటివి తప్పక ఉంటాయి గనుక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో మరింత జాప్యం జరుగవచ్చును.   రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర ప్రజలు, నేతలు ఇందుకు సంతోషించవచ్చును. కానీ, తెలంగాణా ప్రజలకు మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. గనుక తెలంగాణా కాంక్షిస్తున్న నేతలు మీడియా ముందు కొంత సంమయనం పాటించుతూ, తమ అధిష్టానంతో నేరుగా మాట్లాడటం మేలేమో.

The Capital Conundrum

  The issue of bifurcation appears to be any body’s guess. But if the bifurcation does happen, which City in Andhra and Rayalaseema area will be that Hot City? It seems as tough as selecting the City for Hosting Olympics! As in the case of presenting their credentials for allowing them to host Olympics, even the Cities and Towns are vying with each other for that coveted status with their qualifications.   Though it is evident that, given a choice of making a decision, the majority of Andhra people want the state to be united, in their hearts, nevertheless they are also thinking what if the State is divided? With the Congress going steadfast in the case of bifurcation, the issue of where the capital is going to be located is slowly gaining currency.   The issue is also important in the sense that the entire discussion of whether the state should be divided or not is getting focused only on Hyderabad. The city of Hyderabad, a sleeping beauty just a few decades back has become into a bustling metropolis with around 75 lakhs population. Its’ indeed a stark reality that the City of Hyderabad, where in the people of Andhra and Rayalaseema region have put in their fortunes, is the bone of contention.   The fact that the place where normal people have put their hard earned money to acquire a flat of a house or a plot, suddenly is not going to be their States capital and they are going to be just staying there is difficult to digest. But, the issue is that these people have put their money in the city just because they came here migrating from their place for good livelihood. T   he same migration will also happen tomorrow to the new capital. Its beyond doubt that the new capital of Andhra irrespective of the proposed regulation not to make it clutter, will be bustling. The population will definitely make the area grow in leaps and bounds, with their needs of housing, education, markets, clothing, infrastructure, industries, IT, Biotech..what not!!   The provision of Raj Bhavan, Assembly, Council, Secretariat, High Court, various government buildings, Airport, Higher education institutes, more Universities, four and six lane roads, IT, infrastructure, Pharma, industries, parks, housing…etc etc will make the City a Dream City in the next one and half to two decades. All this means, enough of construction work to feed the appetite of various construction firms, for which Andhra is famous for. The number of jobs that all these initiatives will create and the amenities required for them will spur good amount of economic activity around the city.   All this will augur well for the new Capital City. Then why not any city vies for that coveted tag of Capital City then?   Any Capital in the Indian context has been a driving force for the economy of that area. It will be foolhardy at least in the present times, to think of growth without having a great capital city!! In this scenario, the Capital City of Andhra, if formed, has acquired enormous importance.   Then now the discussion centers on the probable Cities / Towns of Andhra which will become the capital. Right from the Political capital of Andhra Pradesh, Vijayawada, to the Port City of Andhra Pradesh, Vishakapatnam, to the Spiritual Capital of Andhra Pradesh, Tirupati, every City is vying for the status.   In between these cities, Ongole, with the tag of having vast government lands, Kurnool, being the capital of previous Andhra State, Rajamundry, with its varied heritage are competing for the capital status.   We will discuss the viability and the credentials of each of the Capital City contender in detail in the coming days. (To be continued)   (By: Neelayapalem Vijay Kumar)

మోడీ.. జర భద్రం!

      ఇప్పుడు దేశమంతా నరేంద్ర మోడీ వైపు ఆశగా చూస్తోంది. తమను కాంగ్రెస్ కబంద హస్తాల నుంచి తప్పించే ఏకైక శక్తి నరేంద్ర మోడీ అని దేశ ప్రజలు భావిస్తున్నారు. మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీలో వున్న కొన్ని లోపాలను ప్రజలు క్షమించడం ప్రారంభించారు. బీజేపీ మీద వున్న మతతత్వ ముద్రను మోడీ తుడిచేస్తారని భావిస్తున్నారు. 2014 ఎన్నికలలో మోడీని ప్రధాని చేయడం కోసం ఎదురు చూస్తున్నారు.   గుజరాత్ ముఖ్యమంత్రిగా తన పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించుకున్న మోడీ దేశానికి ప్రధాని అవడం కొన్ని శక్తులకు ఇష్టం లేదు. ఆయన్ని దేశానికి ప్రధానమంత్రి కాకుండా చేయడానికి, అవసరమైతే వ్యక్తినే కనుమరుగు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉగ్రవాద శక్తులు మోడీని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే మొన్నీమధ్య పాట్నాలో మోడీ మీటింగ్ సందర్భంగా జరిగిన బాంబు పేలుళ్ళు! మోడీకి తీవ్రవాదుల నుంచి ముప్పు వుందని స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర నిఘా సంస్థలు కూడా ఈ విషయాన్ని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మోడీకి భద్రత పెంచాలని భారతీయ జనతాపార్టీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే బీజేపీ విజ్ఞప్తిని కేంద్రం లైట్‌గా తీసుకుంది. మోడీకి ఆల్రెడీ ఎన్.పి.జి. భద్రత వుందని, ఆ భద్రత స్థాయిని ఎన్.పి.జి.కి పెంచాల్సిన అవసరం లేదని కేంద్రం సమాధానమిచ్చింది. అయితే బీజేపీ దీనిని తీవ్రంగా ఖండిస్తోంది. కేంద్రం మోడీకి ఉద్దేశపూర్వకంగానే భద్రత పెంచడం లేదని ఆరోపిస్తోంది. మోడీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు వుందని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచడానికి నిరాకరించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ భద్రత విషయంలో కేంద్రం అలసత్వంతో వ్యవహరించడం భావ్యం కాదని అంటున్నారు. ఏది ఏమైనా ఈ దేశానికి మోడీ అవసరం ఎంతో వుంది.. తనకోసం కాకపోయినా.. కాంగ్రెస్ కబంద హస్తంలో ఇరుక్కుపోయిన ఈ దేశాన్ని కాపాడ్డం కోసమైనా మోడీ.. జర భద్రం!

కాంగ్రెస్‌కి ఆటలైపోయింది!

      తెలుగు ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటోంది. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండేది ఇంకా నాలుగైదు నెలలే కాబట్టి ఈలోపు సాధ్యమైనంత ఎక్కువగా ఆడుకోవాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు తెలుగు ప్రజల గుండెలు మండిపోయేలా చేస్తోంది. తెలుగు ప్రజలు ఈ ఆవేదనలో వున్నా కనికరించని కాంగ్రెస్ పార్టీ తన ఆటలు కంటిన్యూ చేస్తోంది.   కేంద్రం నిరంకుశంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా సమైక్య రాష్ర్టాన్ని కోరుకుంటున్నారో లేక అధిష్ఠానం ఆడమన్నట్టు ఆడుతున్నారో గానీ, మొదటి నుంచీ సమైక్యవాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టెక్నిక్కులను అర్థం చేసుకోలేని సామాన్య ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్యవాదిగానే నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, తెలుగు ప్రజల మెడమీద గుదిబండ అయిన దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు అంగీకరించారని ప్రకటించడం తెలుగు ప్రజల్ని హతాశులను చేసింది. ఒక్క పూటలో ముఖ్యమంత్రి ఇలా ప్లేటు తీప్పేశారేంటా అని బాధపడేలా చేసింది. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని, తాను రాష్ట్ర విభజనకు అంగీకరించానని దిగ్విజయ్ సింగ్ ప్రకటించడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని ప్రకటించారు. ఏంటీ డ్రామాలు? ఎవరి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు, ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సొంత ప్రాపర్టీనా? ఒకపక్క తెలుగు ప్రజల గుండెలు మండిపోతూ వుంటే ఇలాంటి చెలగాటాలు ఆడటం కాంగ్రెస్ పార్టీ నాయకులకు పద్ధతి కాదు. దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయదలుచుకుంటే తనని తరిమికొట్టిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి చేసుకుంటే మంచిది. తెలుగు ప్రజలతో ఇంకా ఆడుకోవాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆటలని తెలుగు ప్రజలు త్వరలో కట్టిస్తారు.

రాహుల్ చచ్చు తెలివి!

      ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న విషయం హండ్రెడ్ పర్సెంట్ కన్‌ఫమ్ అయిపోయింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ నెత్తిన తెల్లగుడ్డేనన్న విషయం అర్థమైపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాను ప్రధాని కాలేమోనన్న భయం రాహుల్ గాంధీని పట్టి పీడిస్తోంది. ఆ భయంతోనే తానేం మాట్లాడుతున్నాడో తనకే అర్థంకాని స్థితిలో వున్నాడు. జనాన్ని బుట్టలో పెట్టడానికి మామూలు తెలివితేటలు పనికిరావని చచ్చు తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు.   చచ్చు తెలివితేటలంటే జనానికి చావుల పేరు చెప్పి సానుభూతి పొందాలని ప్రయత్నించడం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశలో వుంది. రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. మొన్నామధ్య జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, దేశం కోసం తన నాయనమ్మ, తన తండ్రి చనిపోయారని,  తనను కూడా తీవ్రవాదులు చంపే అవకాశం వుందని ప్రకటించిన రాహుల్ అందరి చేతా తలంటి పోయించుకున్నాడు. తన కుటుంబంలో జరిగిన మరణాలని, తనకున్న ప్రాణభయాన్ని సాకుగా చూపి ఓటర్ల నుంచి సానుభూతి పొందాలని రాహుల్ ప్రయత్నించడాన్ని ఎవరూ హర్షించలేదు. చావుల ప్రస్తావన తెస్తే ఒకసారి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తినా రాహుల్ గాంధీలో మార్పు రాలేదు. మరోసారి తన చచ్చు తెలివితేటలు ప్రదర్శించాడు. ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆమధ్య జరిగిన మావోయిస్టుల దాడి సంఘటనని ప్రస్తావించాడు. ఛత్తీస్‌ఘడ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, మావోయిస్టుల దాడిలో కేంద్ర మాజీ మంత్రి వి.సి.శుక్లా, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడితోపాటు చాలామంది కాంగ్రెస్ పార్టీవాళ్ళు చనిపోయారని అన్నాడు. ఇంతటి ప్రాణ త్యాగాల పార్టీ అయిన కాంగ్రెస్‌కే ఓటేయాలన్నాడు. మావోయిస్టుల దాడిలో జరిగిన మరణాలను ప్రస్తావించి ఓటర్ల నుంచి సానుభూతి పొందడానికి రాహుల్ ప్రయత్నించడం మరోసారి వివాదాస్పదం అయింది.

ఓడే పందెంకోడి అంబటి!

      ఉపయోగపడినంత వరకు ఉండనీయ్... పనికిరాడనుకుంటే బయటకి తరిమేయ్.. ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి ఇప్పటికే చాలా మంది నాయకులను ఆ పార్టీ బయటకి సాగనంపింది. ఆమధ్య జగన్-సోనియాగాంధీకి వున్న అండర్‌స్టాండింగ్ విషయంలో నోరుజారిన ఎంపీ సబ్బం హరికి జగన్ పార్టీ జెల్ల కొట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినప్పటికీ జగన్‌కి బాహాటంగా మద్దతు పలికిన సబ్బం హరికి జగన్ చెల్లుచీటీ రాస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ అలా జరిగిపోయింది. ఎవరూ ఊహించని దానిని చేయడమే జగన్ సార్ అపజయ రహస్యం.   నిన్నగాక మొన్న కొండా సురేఖమ్మని కూడా పార్టీ వదలిపోయేలా పొగపెట్టారు. పార్టీలో హెరాస్‌మెంట్ తట్టుకోలేక కొండా సురేఖ వైసీపీకి గుడ్ బై కొట్టేసింది. జగన్ పార్టీ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్న కొండా సురేఖకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చివరికి దక్కిన గౌరవం అది! పార్టీ అభివృద్ధి కోసం పాటు పడిన వాళ్ళకి జరుగుతున్న అవమానాలను చూస్తున్న సీనియర్ నాయకులు తమకి కూడా ఆ గతి ఎప్పుడు పడుతుందోనని భయపడుతున్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీలో  త్వరలో పడబోయే వికెట్ అంబటి రాంబాబుదేనని తెలుస్తోంది. పసలేని పార్టీ విధానాలను పెద్ద గొంతుతో వినిపించే అంబటి రాంబాబుని గతంలో జగన్ కొంతకాలం కంట్రోల్‌లో పెట్టాడు. పార్టీలో తనకంటే ఎదిగిపోతున్న అంబటిని చాలావరకు అదుపుచేశాడు. అయితే అంబటి కంటే గట్టి వాయిస్ పార్టీలో లేకపోవడంతో ఆయన ‘సేవలు’ తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగించుకుంటున్నాడు. అంబటి వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆరాటపడుతున్నాడు. సత్తెనపల్లి ఏరికోరి సత్తెనపల్లి ఇన్‌ఛార్జ్ పదవి కూడా తీసుకున్నాడు. అయితే ఆ నియోజకవర్గంలో జగన్ సర్వే జరిపిస్తే ఆ నియోజకవర్గంలో అంబటి ఆరు నూరైనా గెలవడని రిపోర్ట్ వచ్చింది. దాంతో వచ్చే ఎన్నికలలో అంబటికి సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని ఖరారైపోయింది. అంబటి మాత్రం నత్తెనపల్లి విషయంలో రాజీపడటం లేదు. ఈ నేపథ్యంలో అంబటి పార్టీని వీడటం కానీ, ధిక్కార స్వరం వినిపిస్తున్న అంబటిని పార్టీ నుంచి తొలగించడం గానీ జరగడం ఖాయమని పార్టీ నాయకులు అనుకుంటున్నారు. పందెంలో గెలవని కోడిని ఎలా బలి చేసేస్తారో అంబటి కూడా త్వరలో అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీడలో వుండి, ఎన్నికలలో టిక్కెట్లు ఆశిస్తున్న అందరి నియోజకవర్గాల్లో జగన్ సర్వే చేయించాడట. తప్పకుండా గెలుస్తారని రిపోర్ట్ వచ్చిన వారికి మాత్రమే టిక్కెట్లిచ్చి, గెలవరని తెలిసిపోయిన వారిని పార్టీ నుంచి సాగనంపాలని జగన్ డిసైడ్ అయ్యాడట. తమకు టిక్కెట్ రాదని అర్థం చేసుకున్న చాలామంది వైసీపీ నాయకులు పార్టీ నుంచి సైడైపోవాలని అనుకుంటున్నారట.

టీజీ గారి అతి తెలివి!

      విభజనవాదులు ఎవరికైనా అదనపు తెలివితేటలు కావాలంటే రాష్ట్రమంతి టీజీ వెంకటేష్ దారి దగ్గర పొంగి పొర్లుతున్న అతి తెలివి తేటల నుంచి అప్పు తీసుకోవచ్చు. పేరులో టీజీ వున్నా సమైక్యవాదినని చెప్పుకునే టీజీ వెంకటేష్ రాష్ట్రం విడిపోదని సీమాంధ్ర ప్రజలని చాలాకాలం మభ్యపెట్టాడు. సీమాంధ్రలో వున్న ఇలాంటి పెద్దమనుషుల మాటలు నమ్మిన సీమాంధ్రులు ఇప్పుడు నిండా మునిగిపోయారు. తెలంగాణకి అడ్డుపడతా... ఊడబొడిచేస్తా అని ఏవేవో స్టేట్‌మెంట్స్ ఇచ్చి వార్తల్లో ఒక వెలుగు వెలిగిన టీజీ వెంకటేష్, కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాక సైలెంటైపోయాడు.     ఇంతకాలం సమైక్య హీరోలా పోజులు కొట్టి, పులిలా గర్జించిన టీజీ వెంకటేష్ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం వంటింట్లో పిల్లిలాగా మ్యావ్ అంటున్నాడు. తాజాగా టీజీ మాట్లాడిన మాటలు సమైక్యవాదుల రక్తం మరిగేలా చేస్తున్నాయి. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం గట్టిపట్టుదలతో ఉండటానికి కారణం సమైక్య ఉద్యమం సందర్భంగా జరిగిన అల్లర్లే కారణమట. సమైక్యవాదులే కేంద్రం రెచ్చిపోయి హడావిడిగా విభజన చేయడానికి నూటికి నూరుశాతం కారణమట. ఇంతకీ సమైక్య ఉద్యమంలో జరిగిన అల్లర్లు ఏమిటయ్యా అని అడిగితే, సమైక్యవాదులు రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం, సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, సోనియాగాంధీకి సమాధి కట్టడం.. ఇవేనట! తాము చేసిన విజ్ఞప్తులకు కరిగిపోయి కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ప్రక్రియను నిలిపేసేదేనట! కానీ, సీమాంధ్రులు పైన పేర్కొన్న అల్లర్లు చేయడం కారణంగానే సోనియాగాంధీ, కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా హర్టయిందట. అందువల్లే తమ మాట వినకుండా విభజన చేసేస్తున్నారట. ఇలాంటి వంకర మాటలు మాట్లాడడానికి టీజీకి నోరెలా వస్తోందోనని సమైక్యవాదులు మండిపడుతున్నారు. టీజీ వెంకటేష్‌లో నిన్నటి వరకూ నిద్రపోయిన మరో వాది కూడా బయటికొచ్చాడు. ఆ వాదిపేరు రాయల తెలంగాణ వాది. రాయలసీమలో చాలామంది రాయల తెలంగాణని కోరుకుంటున్నారంటూ తానేం కోరుకుంటున్నాడో చెప్పకుండానే చెప్పేశాడు. ఇంతకాలం ఇలాంటి నాయకుడిని నమ్మినందుకు సీమాంధ్రులు చెంపలేసుకోవాలి.  

ఉద్యమానికి ‘వంద’నం!

      రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటూ సీమాంధ్ర ప్రజలు చేస్తున్న శాంతియుత ఉద్యమం వంద రోజుల మైలురాయిని దాటింది. భారతీయ ఉద్యమ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఈ వందరోజుల్లో లిఖించింది. గాంధీజీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర్యోద్యమం తర్వాత అంత శాంతియుతంగా, అంత ప్రభావవంతంగా, అంత ఐకమత్యంగా జరుగుతోన్న ఉద్యమం ఇదేనని దేశమంతా కీర్తిస్తోంది. ఉద్యమమంటే ఇలా వుండాలని, దేశంలోని ఏ ఉద్యమకారులకైనా సీమాంధ్రులు చేస్తున్న ఈ ఉద్యమం స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసలు లభిస్తున్నాయి.   ఉద్యమమంటే హింస, ఆస్తుల ధ్వంసం, పోలీసుల మీద దాడులు, రాళ్ళు విసరడం అనుకునేవాళ్ళు చూసి బుద్ధి తెచ్చుకునేలా సీమాంధ్రుల ఉద్యమం విజయవంతంగా కొనసాగుతోంది. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం నాయకుడు లేని ఉద్యమం. ప్రతి ఒక్క తెలుగువాడూ నాయకుడై నడిపిస్తున్న ఉద్యమం.. రాజకీయ నాయకుల ఊహలకు అందని ఉద్యమం. రాజకీయ నాయకులకు నో ఎంట్రీ అని స్పష్టంగా చెప్పిన ఉద్యమం. శాంతియుతంగా, స్ఫూర్తివంతంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని చూసి విభజనవాదులు నోళ్ళు తెరిచారు. కుళ్ళుబుద్ధితో ఎన్నో ఆరోపణలు చేశారు. సీమాంధ్ర ఉద్యమాన్ని చులకన చేస్తూ ఎన్నో కామెంట్లు చేశారు. ఉద్యమం మొదలైన దగ్గర్నుంచీ ఇది చల్లారిపోయే ఉద్యమమంటూ అవాకులు చవాకులు పేలారు. ఇప్పుడు వందరోజులు పూర్తిచేసుకున్న ఉద్యమాన్ని చూసి ఏం మాట్లాడాలో అర్థంకాక, ఎలా విమర్శించాలో బుద్ధికి తట్టక గప్‌చుప్‌గా ఉండిపోయారు. సీమాంధ్రలో ఉద్యమం ఒక్కరోజున కూడా విశ్రమించలేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఎక్కడ విన్నా సమైక్య హోరే! ఒక్క లాఠీ కూడా విరక్కుండా, ఒక్క లాఠీఛార్జ్ కూడా జరక్కుండా, ఒక్క గొడవ కూడా జరగకుండా జరుగుతున్న సమైక్య ఉద్యమానికి పోలీసులు కూడా సెల్యూట్ చేస్తున్నారు. పట్టు విడవకుండా, మడమ తిప్పకుండా వంద రోజులుగా సమైక్య హోరు ఢిల్లీకి చేరేలా చేస్తున్న సమైక్య ఉద్యమకారులకు వందనాలు!  

టీ కాంగీయుల వెటకారం!

      సీమాంధ్రుల మీద వెటకారాలు పోయే విషయంలో, వాళ్ళని తిట్టిపోసే విషయంలో టీఆర్ఎస్ నాయకులు, టీ కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా వున్నారు. టీఆర్ఎస్సోళ్ళు సీమాంధ్రులని ఒక తిట్టు తిడితే, మేం మాత్రం తక్కువా అన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకటిన్నర తిట్లు తిడతారు. ఇప్పుడు కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక సమర్పించే విషయంలో కూడా టీఆర్ఎస్, టీ కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా వెటకారాలు పోయారు. రెండ్రోజుల క్రితం జీఓఎంకి నివేదిక ఇచ్చిన టీఆర్ఎస్ అందులో తమ గొంతెమ్మ కోర్కెలన్నీ వివరంగా పొందుపరిచింది. సీమాంధ్రులు అసలు మనుషులే కాదు.. వాళ్ళకేమీ హక్కులు అవసరం లేదన్నట్టుగా వెటకారాలు పోయింది.     ఇప్పుడు తాజాగా టీ కాంగ్రెస్ నేతలు ఆ బాధ్యతని తీసుకున్నారు. వాళ్ళు కూడా జీఓఎంకి ఓ నివేదిక సమర్పించారు. వాళ్ళు కూడా ఆ నివేదికలో టీఆర్ఎస్‌ని మించిన వెటకారాలు పోయారు. ఆ నివేదికలో తెలంగాణ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్ళ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులకి జాతీయ హోదా కల్పించాలన్నారు. తెలంగాణలో వైద్య, ఉద్యాన, మహిళా, పశు సంవర్ధక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. శంకర్‌పల్లి, నేదునూరు విద్యుత్ కేంద్రాలని వెంటనే ప్రారంభించాలన్నారు. వీటితోపాటు ఇంకా బోలెడన్ని కోరికల లిస్టు ఆ నివేదికలో పొందుపరిచారు. ప్రత్యేక రాష్ట్రం కావాలి.. ఇంకా బోలెడన్ని కోర్కెలు తీర్చాలి. బాగుందయ్యా.. చాలా బాగుంది!  సరే ఈ కోరికల సంగతి పక్కన పెడదాం.   ఆ నివేదికలో సీమాంధ్రులని అవమానించే కోరికలు చాలా వున్నాయి.  సీమాంధ్రులకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు చాలా ఎక్కువైపోతుందట. సాధ్యమైనంత తక్కువకాలం వాళ్ళని హైదరాబాద్‌లో ఉంచాలట. అది కూడా హైదరాబాద్ మొత్తం ఉమ్మడి రాజధానిగా కాకుండా ఏదో ఒక మూల ప్రాంతాన్ని వాళ్ళకి కేటాయించి, ఆ ప్రాంతానికే వాళ్ళని పరిమితం చేయాలట. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణని ఇచ్చేసి, సీమాంధ్రులని తరిమేయడమే కాకుండా, తెలంగాణకే ప్రత్యేకంగా భారీ ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలట. మొగుణ్ణి కొట్టి మొగసాలకొచ్చి ఏడ్చినట్టు సీమాంధ్రులని హైదరాబాద్ నుంచి తరిమేసి అన్యాయం చేయాలనుకుంటున్నదీ వాళ్ళే... మాకు ఇంకా న్యాయం చేయాలని మొత్తుకుంటున్నదీ వాళ్ళే!

తెలంగాణ తల్లి లొల్లి!

        తెలంగాణ ప్రజలకి కేసీఆర్ కుటుంబమే ఇప్పుడు పెద్ద దిక్కయిపోయింది. తెలంగాణ నాలుగు దిక్కుల్లో ఏ దిక్కులో చూసినా కేసీఆర్ కుటుంబమే కనిపిస్తోంది. తెలంగాణ మొత్తం తమ కుటుంబం జాగీరులాగా కేసీఆర్ ఫ్యామిలీ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే వ్యూహరచనలు చేస్తోంది. మొన్నీమధ్య జరిగిన బతుకమ్మ ఉత్సవాలనే చూడండి. ఎక్కడ చూసినా కేసీఆర్ కూతురు కవితమ్మే. కవితమ్మ ఎక్కడ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నా ఛానెళ్ళన్నీ పోటీపడి లైవ్ కవరేజ్ ఇచ్చాయి.   టీఆర్ఎస్ వాళ్ళచేత సీమాంధ్ర ఛానెళ్ళంటూ తిట్లుతినే ఛానెళ్ళు కూడా కేసీఆర్ ఫ్యామిలీని మంచి చేసుకోవడానికేమో అన్నట్టుగా కవితమ్మ పాల్గొన్న బతుకమ్మ వేడుకలని ఒక్కక్షణం కూడా మిస్ కాకుండా కవర్ చేశారు. కవితమ్మ చేసిన బతుకమ్మ వేడుకల మీద ప్రత్యేక ప్రోగ్రాములు రూపొందించారు. ఈ హడావిడి అంతా చూసి సామాన్యుడు ఇవి బతుకమ్మ ఉత్సవాలా.. కవితమ్మ ఉత్సవాలా అని సందేహపడిపోయాడు. ఇప్పుడు లేటెస్టుగా మరో పాయింట్ వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రతిష్టిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాలు కవితమ్మ పోలికలతో వుంటున్నాయట. విగ్రహాలను తయారు చేస్తున్న శిల్పులు మెహర్బానీ కోసం మోడల్‌గా కవితమ్మనే ఎంచుకున్నారో, లేక టీఆర్ఎస్ నాయకత్వం నుంచి అలాంటి ఆదేశాలు ఏవైనా అందాయో గానీ తెలంగాణ తల్లి విగ్రహాల్లో కవితమ్మ పోలికలు ఉట్టిపడుతున్నాయట. అది చూసి జనం నోళ్ళు నొక్కుకుంటున్నారట. తెలంగాణ తల్లి విగ్రహాల్లో కవితమ్మ పోలికలు కనిపిస్తూ ఉండటాన్ని ఎం.ఆర్.పి.ఎస్. నాయకుడు మందకృష్ణ మాదిగ వ్యతిరేకిస్తున్నారు. విగ్రహాల్లో కవితమ్మ పోలికలు ఉండటంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని లేనిపోని ఆడంబరాలతో రూపొందిస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నిరాడంబరంగా ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ తల్లిలో కనిపించాల్సిన పోలికలు కవితమ్మవి కావని.. చాకలి ఐలమ్మవని ఆయన అంటున్నారు.  

టూరిస్టు జగన్!

      జగన్ అరికాలిలో పెద్ద పుట్టుమచ్చ లాంటిదేమైనా ఉందేమోనన్న డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే, పాపం జైల్లో వున్న ఆ పదహారు నెలలు తప్ప ఎప్పుడు చూసినా దేశదిమ్మరిలా దేశాలు పట్టి తిరుగుతూనే వున్నాడు. ఓదార్పు యాత్ర అనో, మరో యాత్ర అనో ఏదో ఒక టూర్ ప్రోగాం పెట్టుకుని ప్రకృతిని ఆరాధిస్తూ తిరిగాడు. మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ సీఎం కుర్చీని చేరుకోవడం కోసం బహుదూరపు బాటసారిలా ప్రయాణాలు, ప్రయత్నాలు చేసిన జగన్ ఇప్పుడు సీమాంధ్ర సీఎం కుర్చీ కోసం ప్రయాణాలు ప్రారంభించబోతున్నాడు.   మేకతోలు కప్పుకున్న పులిలాగా, గోముఖ వ్యాఘ్రం లాగా జగన్ కూడా సమైక్య ముసుగు వేసుకున్న విభజనవాది అని విమర్శకులు ఎంత విమర్శిస్తున్నా వెనకడుగు వేయకుండా తన ప్రయాణ సన్నాహాల్లో వున్నాడు. ఒక వైపు రాష్ట్ర విభజనకు కేంద్రం వేగంగా పావులు కదుపుతుంటే జగన్ తీరిగ్గా సీమాంధ్ర జిల్లాల్లో రహదారులను దిగ్బంధం చేయించడంలో బిజీగా వున్నాడు. మొన్నటి వరకూ జగన్ హైదరాబాద్‌లోనే వుండాలని కంట్రోల్ చేసిన సీబీఐ కోర్టు ఓవారం క్రితం జగన్ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చంటూ అనుమతి ఇచ్చింది. దాంతో జగన్‌కి రెక్కలొచ్చాయి. తాను ప్రస్తుతం దిగ్బంధం చేయిస్తున్న రహదారుల్లోనే త్వరలో మరోసారి ఓదార్పు యాత్ర చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. సీమాంధ్ర జిల్లాల్లో తాను చేయబోయే ఓదార్పు యాత్రకి సంబంధించిన వివరాలను ఈనెల పదిహేను తర్వాత ప్రకటించే అవకాశం వుంది. రాష్ట్రం విభజనకు గురవుతోందని గుండెమంటతో వున్న సీమాంధ్రులు జగన్ చేయబోతున్న ఓదార్పు యాత్ర విషయంలో ఎలా రియాక్టవుతారో చూడాలి. ఇదిలా వుంటే రాష్ట్రంలో తిరిగితే చాలదన్నట్టు జగన్ బాబు దేశమంతా చుట్టిరావాలని కోరుకుంటున్నాడు. దానికోసం జగన్ తనకు దేశమంతా తిరిగే పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మమతా బెనర్జీతోపాటు జాతీయ నాయకులందర్నీ కలవాల్సిన అవసరం వుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనికి కూడా అనుమతి వచ్చేసిందంటే ఇక అయ్యగారు దేశమంతా ఒక రౌండ్ కొట్టి వస్తాడన్నమాట. తిట్టేనోరు తిరిగేకాలు ఊరకే ఉండవంటే ఇదేనేమో!  

తెదేపా సందిగ్ధం నుండి బయటపడేదెపుడు?

  తెలుగుదేశం పార్టీ తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ, దానివల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనమూ కలుగలేదు. పార్టీలో తెలంగాణా నేతలు కనీసం దాని గురించి గట్టిగా చెప్పుకోవడానికి కూడా వీలులేకపోవడంతో వారు తెలంగాణాలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేకుండాపోయింది. ఈవిషయం పార్టీ అధిష్టానానికి తెలియకపోలేదు. అయినప్పటికీ పార్టీని రెండు చోట్ల బ్రతికుంచుకోవాలనే తాపత్రయంతో నిర్దిష్టమయిన వైఖరిని చెప్పలేక రెండు ప్రాంతాలలో బలపడలేకపోతోంది.   గమ్మతయిన విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన అనివార్యమని పార్టీలో అందరికీ స్పష్టంగా తెలిసి ఉన్నపటికీ, సీమాంధ్ర నేతలు తమ ఉనికిని కాపాడుకొనేందుకు, ఇంకా సమైక్యవాదం చేస్తూ పార్టీని సంక్షోభంలోకి నెట్టి వేయడం విచిత్రం. తెదేపా సీమాంధ్ర నేతలు పార్టీ కార్యాలయంలో కూర్చొని విభజనను వ్యతిరేఖిస్తూ చేస్తున్న వాదనలు, ప్రకటనల వల్ల వారికి కానీ, పార్టీకి గానీ, ప్రజలకి గానీ ఒరిగేదేమీ ఉండదు. వారి వాదనల వల్ల కనీసం సీమాంధ్రలోనయినా  పార్టీ బలపడే పరిస్థితి లేదు.   మరి అటువంటప్పుడు వారు ఇంకా సమైక్య రాగం ఆలపిస్తూ తెలంగాణాలో కూడా పార్టీని బలపడకుండా అడ్డుతగలడం వలన ప్రయోజనం ఏమిటో వారే వివరించాలి. రేపు పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత కూడా సీమాంధ్ర నేతలు ఇలాగే వితండ వాదం చేస్తూ కూర్చొంటే ముందుగా నష్టపోయేది వారు, వారి పార్టీయే.   ఇప్పటికే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒకరొకరిగా విభజనకు సంసిద్దమయి కేంద్ర మంత్రుల బృందానికి తమ కోర్కెల చిట్టాలు సమర్పిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఏ నిమిషంలో ఏ వైఖరికి మారిపోతాడో ఎవరూ ఊహించలేరు. మరటువంటప్పుడు తెదేపా ఇప్పటికీ భ్రమలోనే ఉండాలని ఎందుకు కోరుకొంటోందో వారికే తెలియాలి. సీమాంధ్ర ప్రజలు మానసికంగా విభజనకు సిద్దమయినట్లే భావించవచ్చును. ఎందుకంటే కేంద్రం రాష్ట్ర విభజన ప్రక్రియను చకచకా చేస్తున్నపటికీ వారు అంతగా స్పందించడం లేదు.   అటువంటప్పుడు నేటికీ తెదేపా రాష్ట్ర విభజనపై స్పష్టమయిన వైఖరి ప్రకటించడానికి జంకుతూ తనను తానే నష్టపరచుకొంటోంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలు.

టీడీపీతో పొత్తు కుదుర్చు రామా!

      రాష్ట్ర బీజేపీ నాయకులు తమ పార్టీ దైవమైన రాముణ్ణి ఇప్పుడు ఒకే ఒక కోరిక కోరుకుంటున్నారు. అదేమిటంటే.. సాధ్యమైనంత త్వరగా తెలుగుదేశం పార్టీతో తమకి పొత్తు కుదరాలి. ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కాలి. అదేంటీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో పొత్తు వుండదని నొక్కి వక్కాణిస్తున్నారు కదా అనే సందేహం వస్తోంది కదూ? అది మేకపోతు గాంభీర్యమే! ఎక్కువగా బెట్టు చేసి పొత్తులో ఎక్కువ లాభం పొందే ప్లానే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   రాష్ట్ర బీజేపీకి ఎప్పుడూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తే అధ్యక్ష పదవిని అలంకరిస్తూ వుంటాడు. వాళ్ళు మొదటి నుంచీ తెలంగాణ ఉద్యమాన్ని ఎగదోయడానికి తమవంతు కృషి చేశారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో తెలంగాణలో పాగా వేయొచ్చని కేంద్ర నాయకత్వాన్ని నమ్మించారు. అయితే అవన్నీ భ్రమలేనని తాజాగా తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వబోతున్నట్టు ప్రకటించాక పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో బావుకునేదేమీ లేదని బీజేపీకి అర్థమైంది. తెలంగాణని నమ్ముకుని సీమాంధ్రలో బిచాణా ఎత్తేసే పరిస్థితిని తెచ్చుకోవడం పట్ల ఇప్పుడు తీరిగ్గా విచారిస్తోంది. ప్రస్తుతం సీమాంధ్రలో బీజేపీ కార్యాలయాల తలుపులు తీసి కూర్చునే పరిస్థితులు కూడా బీజేపీ కార్యక్తలకి కనిపించడం లేదు. దాంతో బీజేపీ అగ్ర నాయకత్వం టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మినహా తమకు వేరే గత్యంతరం లేదన్న విషయాన్ని అర్థం చేసుకుంది. అయితే టీడీపీతో పొత్తును రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఇంతకాలం కిషన్ రెడ్డి లాంటి తెలంగాణ నాయకులు చెప్పిన మాటల్లా విన్న కేంద్ర నాయకత్వం ఇప్పుడు మీరు కాస్త తగ్గండమ్మా అని అంటోంది. మీ మాటలు విని రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అస్తవ్యస్తం చేసుకున్నామని చెబుతోంది. తెలంగాణ ఉద్యమం విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందన్న అభిప్రాయానికి బీజేపీ కేంద్ర నాయకత్వం వచ్చినట్టు తెలుస్తోంది. ఇకముందు తెలంగాణ విషయంలో దూకుడును కంట్రోల్ చేయాలని యోచిస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్ర విభజన మీద మంత్రుల బృందానికి నివేదిక ఇచ్చే విషయంలో జాప్యాన్ని పాటిస్తోంది. గతంలో మాదిరిగా పూర్తిగా తెలంగాణ పక్షం వహించకూడదని భావిస్తోంది. రాబోయే ఎన్నికలలో ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారానే జరిగిన నష్టాన్ని పూడ్చుకోగలమని బీజేపీ అగ్రనాయకత్వం అనుకుంటోంది. ఆ రాముడి మీద భారం వేసి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

టీఆర్ఎస్‌కి హైదరాబాద్ ఫీవర్!

      విభజనవాదుల పప్పులు తెలంగాణలో మూడు నాలుగు జిల్లాల్లో మాత్రమే ఉడుకుతాయి. మిగతా జిల్లాల్లో తమకు అంత సీన్ లేకపోయినా వి.వాదులు ఏదో ఒక వివాదం సృష్టించి, హడావిడి చేసి ఇక్కడ కూడా విభజనవాదం ఉందని అంటూ వుంటారు. విభజన చాంపియన్లమని చెప్పుకునే టీఆర్ఎస్ నాయకులు చేసేది కూడా ఇదే. పదిమందిని వెంట తీసుకెళ్ళి హడావిడి చేసి, ఉద్రిక్త వాతావరణం సృష్టించి ఆ గొడవని తెలంగాణ ప్రజల అకౌంట్లో వేసేయడమే టీఆర్ఎస్ చేసే ఉద్యమం తీరుతెన్నులు. గోరంత విషయాన్ని కొండంత చేసి చూపడానికి విభజన మీడియా వుండనే వుంది. విభజనవాదులు హైదరాబాద్ సిర్ఫ్ హమారా అని గొంతు చించుకుని అరుస్తూ వుంటారు. కానీ, హైదరాబాద్‌లో విభజన వేడి అంతగా వుండదు. ఆ ఉన్న కాస్త వేడి కూడా టీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీల సృష్టే.     ఎన్నికలలో విభజనవాదులకు హైదరాబాద్‌లో ఓట్లు పడవు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో విభజన చాంపియన్ అని చెప్పుకున్న టీఆర్ఎస్‌కి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆ తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ డిపాజిట్లు కూడా దక్కవని భయపడి పోటీయే చేయలేదు. మొన్నీమధ్య జరిగిన పంచాయితీ ఎన్నికలలో హైదరాబాద్ శివార్లలో టీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచింది చాలా తక్కువమంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో హైదరాబాద్‌లో గ్రిప్ పెంచుకోవాలన్న ఉద్దేశంతోనో, మరో ఉద్దేశంతోనే కేసీఆర్, కేటీఆర్ ద్వయం హైదరాబాద్ మెట్రో రైల్ మీద ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కనిపెట్టేశారు. సీఎంకి ఇందులో ఎన్నికోట్లో దక్కాయని పసిగట్టేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్ట్ మీద విచారణ జరుపుతామని, అవసరమైతే మెట్రో రైలు పిల్లర్లు కూలగొడతామని ప్రకటించారు. భలే తెలివిగా బెదిరిస్తున్నామని, ఇలాంటి వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో తమ పట్టు పెరిగే అవకాశం వుందని తండ్రీకొడుకులు  భావిస్తున్నట్టున్నారు. అయితే టీఆర్ఎస్ అధినేతలు చేసిన ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయాన్నిసృష్టించాయి. అసలే హైదరాబాద్‌లో అడుగంటిపోయి వున్న పార్టీ బలాన్ని మరింత తగ్గించేలా ఈ వ్యాఖ్యలు వున్నాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎవరైనా, ఏ స్థానంలో అయినా గెలవాలంటే సీమాంధ్రులు, తెలంగాణ వారితోపాటు ముస్లింల మద్దతు ఉండితీరాలి. సీమాంధ్రులు, ముస్లింలు ఎలాగూ టీఆర్ఎస్‌కి ఓటు వేయరు. ఉన్న తెలంగాణలో కొద్దిశాతం మంది మాత్రమే టీఆర్ఎస్‌కి ఓటేస్తారు. ఇప్పుడు తండ్రీకొడుకులు చేసిన నియంతృత్వ ధోరణిలో చేసిన కామెంట్లు ఉన్న ఆ కొద్దిమందినీ టీఆర్ఎస్‌కి దూరం చేసే ప్రమాదాన్ని తెచ్చిపెట్టినట్టు భావిస్తున్నారు. కాంగ్రెస్ పొలిటికల్ గేమ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విభజన ఎన్నికల తర్వాతకి వాయిదా పడితే, హైదరాబాద్‌లో గల్లంతయిపోయే టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ నినాదాన్ని ఇస్తుందని కార్యకర్తలు భయపడుతున్నారు. మెట్రో రైలు పిల్లర్లు కూలగొట్టే సంగతేమోగానీ, తెలంగాణలో తమ పార్టీ పునాదులే క్రుంగిపోయే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు.

కాంగ్రెస్‌కి సర్వేల గండం!

      ఎన్నికల సర్వేల పేరు చెబితే చాలు కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడుతోంది. ఎన్నికల సర్వేలనేవే వుండకూడదని తాజాగా ఉద్యమం చేపట్టింది. ఎన్నికల సర్వేలను రద్దు చేయించే వరకూ విశ్రమించకూడదని నిర్ణయించుకుంది. ఈమేరకు ఎన్నికల కమిషన్‌కి ఉత్తరం రాసేసింది. కాంగ్రెస్ సర్వేల మీద ఇంత ఇదిగా కత్తికట్టడానికి కారణం ఇటీవల వచ్చిన కొన్ని సర్వే రిపోర్టులే.   మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ ఎన్నికల సంగ్రామం త్వరలో జరుగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రచారపర్వం నడుస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండవచ్చన్న పాయింట్ మీద కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఆ సర్వేల్లో ఎన్నికలు జరిగే మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గల్లంతయిపోతుందని తేలింది. బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించే అవకాశం వుందని ఆ సర్వేలు తేల్చాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకన్నట్టుగా తనలో ఏ లోపం ఉందో పరిశీలించుకోకుండా సర్వేల మీద మండిపడుతోంది. తాజాగా మూడు రాష్ట్రాల విషయంలో జరిగిన సర్వేల వెనుక కుట్ర దాగి వుందని, దేశంలో ప్రస్తుతం సర్వేల రాకెట్ నడుస్తోందని విమర్శలు మొదలుపెట్టింది. తనకెలా తెలుసోగానీ, ఏ పార్టీ డబ్బులిస్తే ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు చేసే సంస్థలు పుట్టుకొచ్చాయని అంటోంది. ఓటర్ల మనసులను ప్రభావితం చేసే ఇలాంటి సర్వేలకు అడ్డుకట్ట వేయాలని నినదించింది. వెంటనే దేశంలో ఎన్నికల సర్వేలను నిషేధించాలని  ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసింది. ఎన్నికల కమిషన్ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా ఖండించింది. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోబోతోందని సర్వేలు రావడంతో తట్టుకోలేని కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తోంది. ఎన్నికల సర్వేలను నిషేధించాలని డిమాండ్ చేయడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని అంటోంది. గతంలో జరిగిన అనేక సర్వేలలో కాంగ్రెస్ అనుకూల ఫలితాలు వచ్చినప్పుడు ఎగిరి గంతేసిన కాంగ్రెస్ ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వచ్చేసరికి మొత్తం సర్వేల వ్యవస్థనే తప్పుపట్టడం, ప్రజల వాక్ స్వాతంత్ర్యాన్ని కాలరాయాలని చూడటం దారుణమని విమర్శిస్తోంది. ఎట్టిపరిస్థితులలోనూ సర్వేలను నిషేధించకుండా చూస్తామని బీజేపీ పట్టుదలగా చెబుతోంది.

ఇదెక్కడి సదస్సు?

      ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైలెవల్లో నిర్వహిస్తున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మొదలైంది. ఈ సదస్సులో ప్రపంచ దేశాల నుంచి అనేకమంది రైతులు ప్రతినిధులుగా పాల్గొంటారట. ఈ సదస్సు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో భారీ స్థాయిలో ప్రచారం చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.     ప్రభుత్వం పిలిచింది కదా అని రాష్ట్రం నలు మూలల నుంచి రైతులు మంచి పంచె కట్టుకుని, తలపాగా పెట్టుకుని సదస్సుకు వచ్చారు. అప్పటిగ్గానీ రాష్ట్ర ప్రభుత్వం తెలివితేటలు రైతులకు అర్థం కాలేదు. ఇది ప్రపంచస్థాయి సదస్సు కాబట్టి రైతులు డబ్బులు కట్టి సదస్సులో పాల్గొనాలంట. అంతగా కావాలంటే సదస్సు పక్కనే ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్స్‌ చూసి వెళ్ళిపోవచ్చంట. వ్యవసాయ సదస్సులో రైతులు డబ్బు కట్టి పాల్గొనడం ఏ విధానమో అర్థంకాక రైతులు అయోమయంలో పడిపోయారు. చాలామంది రైతులు సదస్సుకు వచ్చారు. అయితే వారిని స్టాల్స్ చూసి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి 400 మంది రైతులు సదస్సులో పాల్గొనాలని హైదరాబాద్‌కి ఖర్చులు పెట్టుకుని మరీ వస్తే, వారిని సదస్సు వరకు కూడా రానివ్వకుండా హైదరాబాద్ శివార్ల నుంచే వెనక్కి పంపేశారు. అదేంటయ్యా అని అడిగితే, డబ్బులిచ్చి సదస్సులో పాల్గొనే సత్తా వుంటే రావొచ్చని అధికారులు చెప్పారు. ఈ విషయంలో రైతులు వ్యవసాయ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి రైతులు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం ఎంపిక చేసిన 50 మంది రైతులకు మాత్రమే సదస్సులోకి ఉచిత ప్రవేశం ఉందట. మిగతా అందరూ వేలకు వేలు ప్రవేశ రుసుము చెల్లించి సదస్సులో పాల్గొనాలని మంత్రి, ముఖ్యమంత్రి చావుకబురు చల్లగా చెప్పినట్టు చెప్పారు. దాంతో కంగు తిన్న రైతన్నలు ఇంటిదారి పట్టారు. ఈ సదస్సులోనే ‘చిన్న కమతాలు అభివృద్ధి చేయడం ఎలా?’ అనే అంశం మీద చర్చా కార్యక్రమం కూడా వుందట. చిన్న రైతులు లేకుండా పెద్ద రైతులే దీని గురించి చర్చిస్తారేమో! మూడు రోజులపాటు జరిగే ఈ వ్యవసాయ సదస్సులో ముఖ్యమంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితోపాటు అనేకమంది అధికారులు, విదేశీ రైతులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యువతరం వ్యవసాయ రంగంలోకి రావడం లేదని వాపోయారట. రైతుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు చూస్తే ఆసక్తి వున్నవారు కూడా వ్యవసాయ రంగంలోకి రారు. ముందు ప్రభుత్వాల తీరు మారాలి. ఆ తర్వాతే ఎదుటివారికి నీతులు చెప్పాలి.

కేసీఆర్ పగటి కలలు!

      పగటి కలలు కనడంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారికి పీహెచ్‌డీ ఇవ్వొచ్చు. తెలంగాణ వచ్చేసినట్టు, తెరాస అధికారంలోకి వచ్చేసినట్టు కలలు కనడమే కాకుండా, ఆ పగటి కలల్ని అమాయకులైన తెలంగాణ ప్రజలకు చెబుతూ చప్పట్లు కొట్టించుకున్నాడు. చాలాకాలం తర్వాత ఫామ్ హౌస్‌లోంచి బయటికొచ్చి మెదక్ జిల్లా సిద్దిపేటలో మీటింగ్ పెట్టిన కేసీఆర్ మరోసారి తన పగటి కలల చిట్టా విప్పాడు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున మొత్తం 24 జిల్లాలు ఏర్పాటు చేస్తాడట. హైదరాబాద్ నగరం చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిలో శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తాడట. హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆరు లైన్ల జాతీయ రహదారిగా మారుస్తాడట. విద్యుత్‌తో నడిచే కాలుష్యం లేని లైట్ రైల్ రవాణా సిస్టాన్ని ఏర్పాటు చేస్తాడట. ఈ రైలు హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిలో తిరిగే ఏర్పాటు చేస్తాడట. ఈ రైలు వల్ల సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కి కేవలం 24 నిమిషాల్లో  చేరుకోవచ్చట. తెలంగాణకి పుష్కలంగా సాగునీరు అందించే పథకాలు తన దగ్గర బోలెడన్ని ఉన్నాయట. తెలంగాణలో బలహీన వర్గాల ప్రజలందరికీ రెండు పడక గదులు, హాలు, వంటగది వున్న ఇల్లు ప్రభుత్వమే కట్టి ఇస్తుందట. రోడ్లు, మోరీలు, నల్లాలతోపాటు మరుగుదొడ్లు కూడా తెలంగాణ ప్రభుత్వమే కట్టి ఇస్తుందట. తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగం అనే పదమే ఉండదట. ఇప్పుడు ఉన్న  కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేసేస్తారట. ఇంకా చాలా ఆలోచనలు తన బుర్రలో వున్నాయట. అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక ఆదర్శరాష్ట్రంగా ఎదిగిపోతుందట. ఈ పగటి కలల చిట్టా వినగానే సభలో వున్న తెరాస కార్యకర్తలందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టి జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ చప్పట్లు, నినాదాలే కేసీఆర్‌ని పగటి కలలు కనేలా ప్రోత్సహిస్తున్నాయి.  

వైసీపీ వెర్సెస్ అశోక్‌బాబు!

      సమైక్య ఉద్యమాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతూ రాజకీయ నాయకులకు చేతగాని పనిని చేసి చూపిన అశోక్‌బాబు మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కారాలు, మిరియాలు నూరుతోంది. గొంతు నొప్పి పుట్టేలా సమైక్య నినాదం వినిపిస్తున్నా సీమాంధ్రలో తమ పార్టీని పట్టించుకునేవారే లేకపోవడంతో వైసీపీ నాయకులు నిరాశలో వున్నారు. దాంతో తమ అక్కసును ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద వెళ్ళగక్కుతున్నారు.     ఆల్రెడీ సీమాంధ్రలో తమ పార్టీకి చెక్ పెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబుని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తున్న సమయంలో అశోక్‌బాబు బాబు చేత తమ పార్టీకి అనుకూలంగా మాట్లాడించాలని ప్రయత్నించిన వైసీపీ నేతలు విఫలమయ్యారు. తమ పార్టీ నీడలోకి రానని చెప్పడమే కాకుండా, రాష్ట్రం విభజన వరకూ రావడానికి కారణమైన వైసీపీ మీద పరోక్షంగా విమర్శలు కురిపించిన అశోక్‌బాబు మీద వైసీపీ నాయకులకు ఎప్పటి నుంచో ఆగ్రహం వుంది. సీమాంధ్రలో అశోక్‌బాబు రాజకీయ నాయకుడిగా ఎదిగి తమ పార్టీని అడ్రస్ లేకుండా చేసే అవకాశం కూడా వుందన్న భయం వారిలో వుంది. అశోక్‌బాబు రాజకీయ పార్టీ ప్రారంభించే అవకాశం వుందని తాజాగా వార్తలు వస్తూ వుండటంతో వైసీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయి.   అంతేకాకుండా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి జగన్ నిర్వహించిన సమైక్య శంఖారావ సభ అశోక్‌బాబు నిర్వహించిన సభ ముందు వెలవెలబోయిందన్న విమర్శలు కూడా వైసీపీకి అశోక్‌బాబు మీద ద్వేషం పెరిగేలా చేశాయి. దాంతో తాజాగా అశోక్‌బాబు మీద వైసీపీ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి అశోక్‌బాబు విఘాతం కలిగిస్తున్నాడని ఆధారం లేని ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అశోక్‌బాబు మీద  రాజకీయాలు ప్రయోగించి, ఆయన్ని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి, జనాల్లో అశోక్‌బాబు మీద వ్యతిరేకత పుట్టేలా చేసి రాజకీయ లబ్ధి పొందటమే వైసీపీ ప్రస్తుత కర్తవ్యంలా కనిపిస్తోంది.