టిడిపి నర్సారెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట

తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) నర్సారెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నర్సారెడ్డి ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై శుక్రవారం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎన్నికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. దీనిపై నర్సారెడ్డి, వెంకట్రామి రెడ్డి ఇద్దరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్ మరో రెండు వారాల్లో విచారణకు వచ్చే అవకాశముంది.



కాగా నర్సారెడ్డికి హైకోర్టు తీర్పు ఇటీవల షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నర్సారెడ్డి ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు గత శుక్రవారం తీర్పు ఇచ్చింది. నర్సారెడ్డిపై కాంగ్రెసు అభ్యర్థి వెంకట్రామి రెడ్డి 9 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు హైకోర్టు వెల్లడించింది. నర్సారెడ్డి ఎన్నికల చెల్లదంటూ వెంకట్రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఓట్ల లెక్కింపు జరిపి నర్సారెడ్డి ఎన్నిక చెల్లదని ప్రకటించిన విషయం విదితమే.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.