ఫైన్ కట్టనంటూ కిరికిరి.. ఖాకీలతో కొట్లాట.. లాక్డౌన్ రచ్చ..
posted on May 28, 2021 @ 4:47PM
5 నిమిషాలు ఆలస్యమైతే ఏమైతది? ఇదీ ఆ యువకుడి క్వశ్చన్. ఏమైతది అంటే.. వెయ్యి రూపాయలు ఫైన్ పడుతది.. ఇదీ పోలీసుల ఆన్సర్. ఇంత మాత్రానికే అంత ఫైన్ వేస్తారా? మళ్లీ ప్రశ్న. ఆ, వేస్తాం.. ఫైన్ కట్టి పో.. ఖాకీల వర్షన్. ఫైన్ లేదు.. ఏం లేదు.. నేను కట్టను పో.. ఏం చేస్తారో చేసుకోండి.. అంటూ అతను పోలీసులపైకి తిరగబడ్డాడు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాడు. అతన్ని అమాంతం పైకి లేపి.. బండ్లో వేసి.. అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఇదీ సీన్...
కొందరు సిల్లీ రీజన్స్కే రోడ్ల మీదికొస్తూ పోలీసులను పరేషాన్ చేస్తున్నారు. అలాంటి వారి వల్లే.. లాక్డౌన్ రూల్స్ కఠినతరం చేశారు. లాక్డౌన్ టైమ్ అంటే టైమే. నిమిషం లేటైనా.. ఫైన్స్ బాదేస్తున్నారు. లేటెస్ట్గా.. ఓ యువకుడి విషయంలోనూ ఇలాగే జరిగింది. 5 నిమిషాలు ఆలస్యం అయినందున పోలీసులు రూ.1000 జరిమానా విధించారు. తాను విధులు ముగించుకుని వచ్చేసరికి లేటైందని చెబుతున్నా ఖాకీలు పట్టించుకోలేదు.
ఇక డీటైల్స్ చూస్తే... యాదాద్రి భువనగిరికి చెందిన సురేష్ అనే యువకుడు హైదరాబాద్లో విధులు ముగించుకుని తిరిగి వచ్చాడు. అతను రావడం లాక్డౌన్ సమయం కంటే ఐదు నిమిషాలు ఆలస్యమైంది. దీంతో సురేష్ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడని పోలీసులు రూ.1000 ఫైన్ విధించారు. ‘5 నిమిషాల వ్యవధిలోనే 1000 రూపాయలు ఫైన్ వేయడమేంటి..?. ఫైన్ నేను కట్టను. అసలు చలానా వేయమని మీకు ఎవరు చెప్పారు..?. నేను ఒక్క రూపాయి కూడా కట్టను. నా బండికి ఏం లేవో చెప్పండి.. అన్ని పత్రాలున్నాయ్’ అని పోలీసులతో ఆ యువకుడు వాగ్వాదానికి దిగాడు.
అయినా, పోలీసులు వింటేగా. ఫైన్ కట్టాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో విసుగెత్తిన సురేశ్.. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాడు. అతడ్ని బలవంతంగా పోలీసులు లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.