ఎల్లో ఫంగస్.. మరింత డేంజరస్.. ఫంగస్లతో ఫసక్..
posted on May 24, 2021 @ 2:47PM
కరోనాతో కొత్త, పాత రోగాలు వరుస పెట్టి చుట్టుముట్టుతున్నాయి. మునుపెన్నడూ వినని కొత్త కొత్త రోగాల పేర్లు వినిపిస్తున్నాయి. కరోనా సోకి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 5వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించడం కలకలం రేపుతోంది. ఓవైపు బ్లాక్ ఫంగస్తో బెదురుతుంటే.. దానికి పోటీగా వైట్ ఫంగస్ సైతం విజృంభిస్తోంది. ఇది బ్లాక్ ఫంగస్ కంటే మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఇలా బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ల దండయాత్ర సరిపోనట్టు.. తాజాగా, ఎల్లో ఫంగస్ అనే మరోరకం ఫంగస్ వ్యాధి ముదురుతోంది. ఇది.. ఆ రెండు ఫంగస్ల కంటే డేంజరస్ అని చెబుతుండటం ఆందోళనకరం.
దేశంలో కొత్తగా మరో ఫంగస్ బయటపడింది. తాజాగా ఎల్లో ఫంగస్ పుట్టుకొచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో తొలి ఎల్లో ఫంగస్ కేసు నమోదు అయింది. ఎల్లో ఫంగస్ బారిన పడిన తొలి రోగి ప్రస్తుతం ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ బ్రిజ్ పాల్ త్యాగి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఎల్లో ఫంగస్ వ్యాధి ఉన్నవారిలో నీరసం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం తదితర లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వ్యాధి తీవ్రంగా ఉన్నవారిలో చీము కారే లక్షణం కూడా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి అని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్లో ఫంగస్కు యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్తో చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు.
ఎల్లో ఫంగస్ ప్రధానంగా పరిశుభ్రత లేకపోవడం వల్లే వ్యాపిస్తుంది. ఇంటి లోపల, బయట వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నిల్వ ఉన్న పదార్థాలు ఫంగస్ పెరుగుదలకు దోహదపడుతాయి. కావున వీలైనంత వరకు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. ఇంట్లో తేమ శాతం ఎక్కువ ఉన్నా.. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుతాయి. కావున తేమ స్థాయి 30 నుంచి 40 శాతం మధ్య ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్లో కొవిడ్ నుంచి కోలుకున్న వారిని మళ్లీ అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. ఇవి, కరోనా వైరస్ కంటే మరింత ఖతర్నాక్గా ఉన్నాయి. ఫంగస్ సోకి.. ప్రాణాలతో బయటబడిన వాళ్ల సంఖ్య తక్కువే. అందుకే, బీ అలర్ట్. బీ కేర్ఫుల్.