బొత్సకి కూడా నమ్మకం లేదు!
posted on May 17, 2024 @ 11:34AM
ఏపీలో టీడీపీ విజయం ఫిక్సయిపోయింది. ఏపీలో దారిన పోయే దానయ్యని ఆపి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటావ్ అని అడిగితే, ఆ దానయ్య ఎగాదిగా చూసి ‘టీడీపీ రాబోతోందని ఇంకా అర్థం కాలేదా’ అని అంటాడు. మరి పామరులకే అసలు విషయం అర్థమైపోయినప్పుడు వైసీపీ నాయకులకు అర్థం కాకుండా వుంటుందా? అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాలు, బిల్డప్పులు ఫలితాలు వచ్చే వరకూ ప్రదర్శించాలి కదా. ప్రస్తుతం వైసీపీ నాయకులు ఆ పనిలోనే బిజీగా వున్నారు. మేమే గెలుస్తున్నాం అని వాళ్ళు చెబుతున్నారు. అయితే, ఆ గొంతుల్లో నమ్మకం ధ్వనించడం లేదు.
సోషల్ మీడియాలో ఈమధ్య ఒక పాయింట్ బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే, జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని.. ఈ పాయింట్ని బేస్ చేసుకుని ఆపద్ధర్మ మంత్రి బొత్స సత్యనారాయణ నేను కూడా వున్నా అంటూ రంగంలోకి దిగారు. ఈసారి కూడా వైసీపీ గెలుస్తుందని ఆశిస్తున్నానని, ఈనె 9న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. బొత్స స్టేట్మెంట్ చూసి జనం నవ్వుకుంటున్నారు. గెలుస్తున్నాం.. ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పకుండా, గెలుస్తారని ఆశిస్తున్నానని, ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను అన్నప్పుడే బొత్సకి కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారని నమ్మకం పోయిందని అనుకుంటున్నారు.
మొన్నామధ్య జగన్ పబ్లిక్ మీటింగ్లో బొత్స తన తండ్రి లాంటి వాడు అని అన్నప్పటి నుంచి బొత్స ఎమోషనల్గా ఫీలైపోతున్నట్టున్నారు. అందుకే, మిగతా మంత్రులందరూ విజయం మీద మాట్లాడే శక్తి లేక నవ డాష్లూ మూసుకుని కూర్చుంటే, బొత్స మాత్రం బయటకి వచ్చి ‘గెలుస్తామని ఆశిస్తున్నాను’ లాంటి బలహీన స్టేట్మెంట్ ఇచ్చారు. బొత్స స్టేట్మెంట్ వల్ల వైసీపీకి లాభం జరగకపోగా, మరింత నష్టం జరిగింది.
పోలింగ్కి ముందు రోజు మీడియాతో మాట్లాడిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మన బొత్స గారిని మామూలుగా తిట్టలేదు. బొత్సలాంటి వాళ్ళ వల్లే జగన్ పూర్తిగా నాశనమయ్యాడని చెప్పారు. కరెక్టే... ‘గెలుస్తామని ఆశిస్తున్నాను.. ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను’ అని స్టేట్మెంట్ ఇవ్వడమేంటి? వైసీపీని మరింత నాశనం చేయడానికి కాకపోతే!?