సీఎస్ ను మారిస్తేనే సజావుగా కౌంటింగ్.. ఈసీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!

ఏపీలో ఎన్నికలు పూర్తి అయి నాలుగు రోజులైనా రాష్ట్రంలో  ఉద్రిక్తతలు చల్లారలేదు. హింసాకాండ అదుపులోనికి రాలేదు. పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై  సీఈసీ  సీరియస్ అయింది.  సీఎస్,డిజిపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. సరే దాదాపు మూడు గంటల పాటు సీఎస్, డీజీపీలో రాష్ట్రంలో పరిస్థితులపై వారి వివరణ ఇచ్చారు. అయితే వారి వివరణ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఒకింత సీరియస్ అయినట్లు కనిపిస్తోంది.

 అనంతపురం,తిరుపతి,పల్నాడు మూడు జిల్లాల్లో 12మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.  తిరుపతి ఎస్పీని బదిలీ  చేసింది.పల్నాడు కలెక్టర్ నూ బదిలీ చేసింది. వీరందరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ, సిట్ ఏర్పాటు చేసి అల్లర్లకు కారణమైన వారిపై విచారణకు ఆదేశించి  48 గంటల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు రాష్ట్రంలో కౌంటింగ్ పూర్తి అయిన తరువాత 15రోజుల వరకూ ఉండేలా పారామిలిటరీ దళాలను ఏపీకి తరలించాలని సీఈసీ ఆదేశించింది. అయతే సీఎస్, డీజీపీలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారి కింది అధికారులపై వేటు వేసి ఊరుకుందా? అనే చర్చ రాష్ట్రంలో  మొదలైంది. 

ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసాకాండకు ఎన్నికల్లో ఓడిపోతారనే దుగ్ధతో ప్రత్యర్ధులపై   వైసీపీ నాయకులు, మూకలు కారణమనీ, పోలీసులు, అధికారులు ఈ హింసాకాండను, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు టార్గెట్ గా జరిగిన దాడులను చోద్యం చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క తెలుగుదేశం నేతలు, కార్యకర్తలే అని కాదు, తమకు ఓటు వేయలేదని భావించిన  ఓటర్లపై కూడా దాడులు జరిగాయి. ‘పైవారి’ ఆదేశాల మేరకే చేష్టలుడిగి ఉండిపోయామని స్వయంగా ప్రైవేటు సంభాషణల్లో కొందరు పోలీసులే చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వారు చెప్పే ‘పైవారు’ ఎవరన్నది ఊహించడం పెద్ద  కష్టం కూడా కాదు.  

పోలింగ్ సరళితో.. స్వయంగా వైసీపీ అంతర్గతంగా నిర్వహించుకున్న సమీక్షలో, అలాగే ఐప్యాక్ నివేదికలో పార్టీ ఓటమి ఖాయమైపోయిన నేపథ్యంలో ఇప్పుడు  వైసీపీ అధినాయకత్వం మీద ఉన్న గురుతర బాధ్యత ఏమిటంటే  ఓట్ల లెక్కింపు జరిగే వరకైనా పార్టీ నేతలు, క్యాడర్ ను కాపాడుకోవడం, ఇప్పుడే చేతులెత్తేస్తే కౌంటింగ్ కేంద్రాలలో కూర్చోవడానికి కూడా ఏజెంట్లు దొరకరన్న భయం. అందుకే కౌంటింగ్ జరిగే వరకూ వైసీపీ నాయకులను, శ్రేణులలో విజయం సాధిస్తున్నామన్న విశ్వాసాన్ని నిలిపి ఉంచడానికి నానా తంటాలూ పడుతున్నారు. ఆ క్రమంలో జగన్ ఏకంగా గత ఎన్నికలలో కంటే అధిక స్థానాలు సాధిస్తున్నామంటూ ప్రకటించారు. సొంత పార్టీ నేతలే ఆ మాటలు నమ్మడం లేదు. బొత్స వంటి సీనియర్ నాయకులు కూడా విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు.

అయితే వారి ప్రకటనలు పార్టీలో పెద్దగా జోష్ నింపలేదు. ఎందుకంటే అంతకంటే ముందే సజ్జల, అనీల్ కమార్ యాదవ్, రోజా,  అంబటి రాంబాబు,  కొమ్మినేని శ్రీనివాసరావు వంటి వారు పార్టీ ఓటమి తథ్యమని పరోక్షంగా సంకేతాలిచ్చేశారు. అనవసరంగా బెట్టింగులకు పాల్పడి ఆర్థికంగా నష్టపోవద్దని హితవు చెప్పారు. ఈ పరిస్థితుల్లో క్యాడర్ ను ఎంగేజ్ చేయాలంటూ కౌంటింగ్ వరకూ రాష్ట్రంలో ఉద్రిక్తతలు కొనసాగేలా చేయడం వినా మరో మార్గం లేదని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే వైసీపీ మూకలను రెచ్చగొడుతున్నారు. ఉద్రిక్తతలు చల్లారకుండా దాడులను ప్రేరేపిస్తున్నారు.  ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున  ఈసీ పర్యవేక్షణలో అధికారులు తమ బాధ్యతను గుర్తెరిగి ఎలాంటి అభిమానం దురభిమానాలకు దూరంగా శాంతిభద్రతలు కాపాడాలి. అయితే రాష్ట్రంలో కొందరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటం వల్లనే పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తరువాత కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసీ ఏపీ విషయంలో సీరియస్ యాక్షన్ కు దిగింది.  కౌంటింగ్ సందర్భంగా అధికార యంత్రాంగం  నిష్పాక్షికంగా వ్యవహరించాలంటే సీఎస్ ను మార్చాల్సిన అవసరం ఉందని విపక్ష తెలుగుదేశం కూటమి డిమాండ్ చేస్తున్నది. మరి రానున్న ఒకటి రెండు రోజులలో ఈసీ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా చూడాల్సి ఉంది.