జగన్ ప్రభుత్వం అసలు టార్గెట్ అచ్చెన్న కాదా.. మరి ఇంకెవరు..
posted on Jun 13, 2020 @ 10:23AM
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని నిన్న ఎసిబి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు ఎసిబి కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం కూడా తెలిసిందే. ఐతే ఈ మొత్తం వ్యవహారం పై రాజకీయ విశ్లేషకుల స్పందన మాత్రం వేరుగా ఉంది. జగన్ ప్రభుత్వం టార్గెట్ అచ్చెన్న కాదని.. అసలు టార్గెట్ మాత్రం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అని విశ్లేషణ చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడికి అన్న కుమారుడు. కేవలం అసెంబ్లీ లో అధికార పక్షాన్ని ఇబ్బంది పెడుతున్నందువల్ల.. అయన కు హెచ్చరిక గా మాత్రమే అరెస్ట్ చేసారని అంటున్నారు. ఈ రోజు రేపు కోర్టుకు సెలవలు కావడం తో సోమవారం వరకు జైలు లో ఉంచి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయం లో అంతకు ముందు రోజే పైల్స్ ఆపరేషన్ జరిగిన వ్యక్తిని దాదాపు 10 గంటల సేపు ప్రయాణం చేయించి కారులో విజయవాడ కు తీసుకురావడం ఆరోగ్యపరంగా మరింత ఇబ్బంది కలిగించే అంశం.
కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే గత పదిహేను రోజులుగా వైసిపి నేతలు ఎర్రం నాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లు అర్ధం అవుతోంది. ఆ కుటుంబం నుండి ప్రస్తుతం ఆదిరెడ్డి భవాని తో సహా ముగ్గురు ప్రజా ప్రతినిధులుగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఈ కుటుంబం టీడీపీ తోనే ప్రయాణం సాగిస్తున్నారు. ఐతే కొద్దీ రోజుల క్రితం రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వైసిపి ఒక ప్రచారం మొదలు పెట్టింది. దాని సారాంశం ఏంటంటే చంద్రబాబు రామ్మోహన్ నాయుడుని ఎపి పార్టీ ప్రెసిడెంట్ గా నియమించే ఉద్దేశ్యంలో ఉన్నట్లు.. ఐతే దీనిని లోకేష్ తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా పేక్ న్యూస్ క్రియేట్ చేసి వైరల్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి కూడా రామ్మోహన్ నాయుడు ని టార్గెట్ చేస్తూ " లోకేష్ రాజకీయాలకు పనికి రాడని అందుకే రామ్మోహన్ ను బలి పశువును చేస్తున్నారని " ట్వీట్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విధంగా టార్గెట్ చేసి రామ్మోహన్ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసి తద్వారా పార్టీలో ఎటువంటి ఉన్నత పదవి తీసుకోకుండా భయపెట్టేలా వైసిపి ప్రయత్నిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. తండ్రి ఎర్రం నాయుడు హఠాన్మరణం తరువాత రాజకీయాలలోకి ప్రవేశించిన కొద్దీ కాలం లోనే రాజకీయంగా రాటుదేలిన రామ్మోహన్ నాయుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎలా అడుగు ముంచుకు వేస్తారో అని అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు టీడీపీ కేడర్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.