ప్రతిపక్ష నేతల పై కక్ష తీర్చుకోవడానికే జగన్ సీఎం అయినట్టు ఉంది
posted on Jun 13, 2020 @ 10:23AM
టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిల అరెస్ట్ను నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన లోకేష్.. ప్రతిపక్ష నేతల పై కక్ష తీర్చుకోవడానికే జగన్ సీఎం అయినట్టు ఉందని మండిపడ్డారు.
"బీసీ నేత అచ్చెన్నాయుడు గారి అక్రమ అరెస్ట్ ని పక్కదారి పట్టించేందుకే ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి లను అరెస్ట్ చేసారు. 16 నెలల జైలు పక్షి, లక్ష కోట్ల దోపిడీదారు, 11 కేసుల్లో ఏ1 జగన్ రెడ్డి, టిడిపి నాయకుల్ని జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నాడు." అంటూ లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"ఏడాది పాలనలో వైఎస్ జగన్ ఒక చేతగాని ముఖ్యమంత్రి అనే విషయం ప్రజలకు అర్థమైంది. ఆయనను అభద్రతా భావం వెంటాడుతోంది. అందుకే రాజారెడ్డి రాజ్యాంగంలో వేధింపుల పర్వానికి తెరలేపారు. ప్రలోభాలకు లొంగితే వైకాపా కండువా. లొంగకపోతే జైలు." అంటూ విమర్శించారు.
"ప్రతిపక్ష నేతల పై వేధింపులు, కక్ష తీర్చుకోవడానికే జగన్ ముఖ్యమంత్రి అయినట్టు ఉంది. సమర్థవంతంగా జగన్ గవర్నమెంట్ 'టెర్రరిజాన్ని' ఎదుర్కొంటాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు,అస్మిత్ రెడ్డి ల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను." అని లోకేష్ ట్వీట్ చేశారు.