వైసీపీ కాడె వదిలేసిందా?

ఏపీలో అధికార పార్టీ వైసీపీ సరిగ్గా పోలంగ్ రోజున కాడె వదిలేసిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే ఫేక్ హామీలు, ఫేక్ వాగ్దానాలు చేసిందన్న తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న అధికార పార్టీ తాజాగా ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఫేక్ వీడియోలకు తెరలేపింది. విడతల వారీగా చంద్రబాబు ఫేక్ వీడియోలను విడుదల చేయడం చూస్తుంటే ప్రజలను మభ్యపెట్టడం సాధ్యం కాదు, కనీసం కన్ఫ్యూజ్ చేసి ఏదో ఓ మేరకు లబ్ధి పొందాలన్న దుష్ట పన్నాగానికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది.

రిజర్వేషన్లు, పథకాలు..ఇలా ఒకటనేమిటి.. తమ అధినేత వైఫల్యాల నుంచి జనాన్ని డైవర్ట్ చేయాలంటే చంద్రబాబుపై అసత్యాల ప్రచారం ఒక్కటే మార్గమని తలపోసింది.  ఎన్నికల ప్రచారంలో జనం మొహం చాటేసినీ, తామేం చెప్పినా జనం నమ్మేస్తారన్న భ్రమలో మాత్రం వైసీపీ అధినేతలో పోయినట్లు కనిపించడం లేదు.  విజయంపై ఆశలు వదిలేసుకున్న వైసీపీ దింపుడు కళ్లెం ఆశగా చంద్రబాబుపై ఫేక్ వీడియోల ప్రచారానికి పాల్పడింది. 

వాస్తవానికి తెలుగుదేశం కూటమిలో బీజేపీ కూడా ఉన్నప్పటికీ ముస్లింలు కూటమివైపే ఉన్నారు. దీంతో వైసీపీ బెంబేలెత్తిపోతోంది. అందుకే రిజర్వేషన్ల విషయంలో జగన్ మాటలకు భిన్నంగా చంద్రబాబుపై ఫేక్ వీడియోల ప్రచారానికి తెరలేపింది. ఇక సంక్షేమ పథకాల విషయంలో కూడా అదే దారిలో నడుస్తోంది. ఇక అమరావతి విషయంలో కూడా వైసీపీ తగ్గేదేలే అన్నట్లుగా ఫేక్ ప్రచారానికి తెరతీసింది. చంద్రబాబు అమరావతి తప్ప మరే పథకాన్నీ పట్టిచుకోను అని చెబుతున్నట్లుగా ఉన్న ఒక ఫేక్ ఆడియోను విడుదల చేసింది.

 అయితే పాపం సమయం లేకపోవడమో, మరో కారణమో కానీ  ఆ ఆడియోలో ఉన్నది చంద్రబాబు వాయిస్  కాదని చిన్నపిల్లాడికైనా అర్ధమైపోయేలా ఉంది.  సరిగ్గా ఓటు వేయడానికి ముందు వెలుగులోకి వచ్చిన ఈ ఫేక్ వీడియోలు, ఆడియోలు చూసిన జనానికి  వైసీపీ  ఊహించిన దాని కన్నా ఘోరమైన పరాజయం ముంగిట ఉందన్న భావన వ్యక్తం అవుతోంది. చివరి క్షణంలో పోల్ మేనేజ్ మెంట్ చేయాల్సిన వైసీపీ శ్రేణులు కూడా ఈ ఫేక్ ప్రచారం చూసిన తరువాత, పార్టీ హైకమాండే గెలుపు ఆశలు లేవన్న నిర్ణయానికి వచ్చేసింది, ఇప్పుడిక మనం కష్టపడటం ఎందుకని చర్చించుకుంటున్నారు.  

Teluguone gnews banner