రక్తంతో తడిసిన చొక్కాతో చంద్రబాబుని కలిశాడు
posted on Feb 6, 2020 @ 3:28PM
టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును వైసీపీ బాధితుడు కలిశాడు. టీడీపీకి మద్దతుగా ఉన్నందుకు తనపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ వాపోయాడు. మాచర్లకు చెందిన దండు పెద వెంకయ్యపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో వెంకయ్య టీడీపీ కార్యాలయానికి వెళ్లి, పార్టీ అధినేతతో తనపై జరిగిన దాడి గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రక్తంతో తడిసిన చొక్కాతో వెంకయ్య రావడంతో.. అతడిని చూసి చంద్రబాబు చలించిపోయారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కుమారుడి కోసం వచ్చి తనపై దాడి చేశారని వెంకయ్య భోరున విలపించాడు.
టీడీపీకి మద్దతుగా ఉన్నందుకే దాడి చేశారని వెంకయ్య వాపోయారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తారనే ఉద్దేశంతోనే.. వెంకయ్యపై దాడి చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే వెంకయ్యపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసుంటారని అంటున్నారు. కాగా, బాధితుడికి ప్రాథమిక చికిత్స చేయించి.. డీజీపీ, ఎస్పీ దగ్గరకు తీసుకెళ్లాలని వర్ల రామయ్యకు చంద్రబాబు సూచించారు.