వైఎస్ వివేకాను చంపింది వాళ్లే.. వైసీపీ ఎమ్మెల్యే సంచలనం..
posted on Nov 17, 2021 7:59AM
ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ తీవ్ర కలకలం రేపుతోంది. దస్తగిరి స్టేట్ మెంట్ లో వైసీపీ ముఖ్య నేతలతో పాటు వైఎస్సార్ కుటుంబ సభ్యుల పేర్లు ఉండటం సంచలనంగా మారింది. తాజాగా వివేకా హత్యపై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి సంచలన కామెంట్లు చేశారు.
డబ్బు, అనుమానం, వ్యక్తిగత బలహీనతలే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి తొలుత ఇచ్చిన వాంగ్మూలానికి, ఆ తర్వాత ఇచ్చిన దానికి పొంతన లేదన్నారు.వివేకా హత్యలో పాల్గొనట్టు చెప్పిన డ్రైవర్ దస్తగిరిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. అతడిని అప్రూవర్గా మార్చేందుకే హైకోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు. ముద్దాయిని సాక్షిగా మార్చాలనుకోవడం సరికాదన్నారు.
సిట్, సీబీఐ దర్యాప్తులో భాగంగా ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం 161లో అవినాష్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, దేవిరెడ్డి శంకర్రెడ్డిల పేర్లు లేవని, కానీ ఆ తర్వాత ప్రొద్దుటూరు కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం 164లో మాత్రం ఆ నలుగురి పేర్లను చేర్చారని రాచమల్లు పేర్కొన్నారు. వివేకా హత్య విషయంలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని, ఉందని కనుక నిరూపిస్తే తనతో సహా 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని అన్నారు.
వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి తరపున సీబీఐ వేసిన అప్రూవర్ పిటిషన్పై న్యాయవాదులు బుధవారం కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎర్రగంగిరెడ్డి బెయిలు పిటిషన్ రద్దు పిటిషన్పై కడప సబ్ కోర్టులో విచారణ ఎల్లుండి (19)కి వాయిదా పడింది.