కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ సెంటిమెంట్!
posted on Sep 19, 2024 @ 9:46AM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో పార్టీలో కీలక పదవులను దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. ఇటీవల ప్రకటించిన టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ నేతలు అనేక మంది పోటీపడ్డారు. వారిలో సీనియర్లు, జూనియర్లు కూడా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో పార్టీ అధిష్టానం బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ కు టీపీసీసీ పదవిని కట్టబెట్టింది. దీంతో రెండు రోజుల కిందట ఆయన టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కితే అదృష్టం కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యలు చేపట్టినవారు ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక పదవులలో ఉన్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకునేందుకు పార్టీలోని సీనియర్, జూనియర్ నేతలు పోటీలు పడుతున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్ఠానంపెద్దలతోపాటు, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ముఖ్య నేతలను సంప్రదించి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తనకు దక్కేలా చూడాలని ఆశావహులు కోరుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పోటీ ఎక్కువగా ఉండటంతో ఈసారి ముగ్గురు లేదా నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తే బాగుంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారని సమాచారం.
రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి సారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును క్రియేట్ చేశారు. అప్పటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులో కొనసాగినవారంతా ప్రస్తుతం మంచి పదవుల్లో కొనసాగుతున్నారు. మంత్రి, డిప్యూటీ సీఎం, సీఎం స్థాయిలో కొనసాగుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కించుకోవటం అంటే అదృష్టాన్ని వెంటపెట్టుకొని ప్రయాణించడమేనన్నసెంటిమెంట్ బలపడింది. తెలంగాణ ఏర్పడిన తరువాత పార్టీ తొలి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో పార్టీ అశించిన స్థాయిలో రాణించకపోవటంతో టీపీసీసీ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న పొన్నాల లక్ష్మయ్యను బాధ్యతల నుంచి తప్పించి.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ అధిష్ఠానం ప్రమోషన్ ఇచ్చింది. దీంతో పొన్నాల స్థానంలో ఉత్తమ్ టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కీలక శాఖలకు మంత్రిగా కొనసాగుతున్నారు. దీనికితోడు ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఉత్తమ్ టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టిన తరువాత భట్టి గ్రాఫ్ పార్టీలో ఒక్కసారిగా పెరిగింది. పార్టీ జాతీయ స్థాయి నాయకులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ తరువాతకాలంలో భట్టి విక్రమార్కకు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు. సీఎల్పీ ప్రచార కమిటీ చైర్మన్ గా, సీఎల్పీ లీడర్ గా ఆయన ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉప ముఖ్యమంత్రిగా భట్టి కొనసాగుతున్నారు. ప్రభుత్వంలో నెం.2 స్థానంలో కొనసాగుతున్నారు.
భట్టి విక్రమార్క తరువాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం స్థానంలో ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలను పార్టీ అధిష్టానం కట్టపెట్టింది. ఆ తరువాత రేవంత్ తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు చెక్ పెడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డికే సీఎంగా పగ్గాలు అప్పగించారు. ఇక రేవంత్ కు అధిష్ఠానం వద్ద కూడా పలుకుబడి పెరిగింది. రాహుల్ గాంధీకి నమ్మకైన వ్యక్తిగా కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు నిర్వహించిన వారంతా ప్రస్తుతం మంచి స్థాయిల్లో ఉన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కడమంటే అదృష్టం తలుపుతట్టడమే అన్న సెంటిమెంట్ పార్టీ రాష్ట్ర నేతలలో ఏర్పడింది.
బీసీ వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ కు టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎస్సీ సామాజిక వర్గ నేతలకు దక్కుతుందన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. అయినా, అన్ని వర్గాలవారు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఢిల్లీలోని పార్టీ పెద్దల ద్వారా, రాష్ట్రంలోని పార్టీ పెద్దల ద్వారా పదవిని దక్కించుకునేందుకు రాయబారాలు నడుపుతున్నారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం పోటీపడుతున్న ఇరవై నుంచి ముప్పై మందికి పైగా నేతల పేర్లు అధిష్టానం వద్దకు చేరినట్లు తెలుస్తోంది. పోటీ ఎక్కువగా ఉండటంతో అన్నివర్గాల వారిని సంతృప్తి పర్చేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ముగ్గురు లేదా నలుగురికి ఇచ్చేలా నిర్ణయించినట్లు సమాచారం. బీసీ వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో.. మిగిలిన ఎస్సీ, ఓసీ, మైనార్టీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతోంది.