ఓటేస్తాం..మార్పు తెస్తాం.. ఏపీలో పోటెత్తుతున్న ఓటర్లు!
posted on May 13, 2024 @ 11:55AM
పరుగెత్తి పాలు తాగినా, నిలబడి నీరు తాగినా దాహం తీర్పుకోవడమే లక్ష్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు అదే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది. కుదిరితే పరిగెత్తుకు వస్తున్నారు, లేకపోతే నడిచి వస్తున్నారు, అదీ కుదరకపోతే పాక్కుంటూ కూడా పోలింగ్ బూత్ కు చేరుకుంటున్నారు.
ఏరులు దాటి వస్తున్నారు. వర్షాన్నీ, ఎండనూ లెక్క చేయడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా వీల్ ఛైర్లలో వెళ్లి మరీ ఓటేస్తున్నారు. ఇక పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు కూడా సొంతూర్లకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకు తీరుతామన్న సంకల్పాన్ని చాటారు.
ఎ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. పోలింగ్లో పాల్గొనేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మాక్ పోలింగ్ తర్వాత.. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో కొంతమంది ఓటర్లు నది దాటి వెళ్లి మరీ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొమరాడ మండలంలో నాగావళి దాటి కూనేరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని కొంతమంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు పార్వతీపురం మినహా కురుపాం, సాలూరు, పాలకొండ నియోజవకర్గాల్లో సాయంత్రం ఏడు గంటలకు కాకుండా గంట ముందు ఆరుగంటలకే పోలింగ్ ముగుస్తుంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజలు కూడా బోటులో వెళ్లి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పి. గన్నవరం పరిధిలోని లంకల గన్నవరానికి చెందిన గ్రామస్థులు కూడేరు పోలింగ్ కేంద్రానికి చేరుకునేందుకు వాగు దాటాల్సి ఉంది. దీంతో బోటులో వెళ్లి ఈ ఊరి జనం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు గ్రామం బూత్ నెంబర్ 137, 138 ఓటు వేయడానికి వచ్చిన నలుగురు మహిళలు తీవ్ర ఉక్కపోత కారణంగా పోలింగ్ బూత్ లోనే ఊపిరాడక స్ఫృహ తప్పి పడిపోయారు. పోలింగ్ బూత్ లలోనే కాకుండా క్యూలైన్లలో ఉండే వారికి కూడా ఎటువంటి వెసులుబాటూ లేని విధంగా చాలా ఇరుకుగా ఉంది. జనం ఓటు వేయడానికిపెద్ద సంఖ్యలో రావడం తో స్థలం సరిపోక ఓటర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు.