మోదీ మళ్ళీ గెలిస్తే రాజ్యాంగానికి ఎసరే ?
posted on Jun 17, 2023 @ 9:58AM
కేంద్రంలో మళ్ళీ మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? రాజ్యాంగాన్ని మార్చేస్తుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ లా రాజ్యాంగాన్ని మార్చేసి జీవితకాల ప్రధానిగా ప్రకటించు కుంటారా? అంటే, అవుననే అంటున్నారు ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత.. సౌరభ్ భరద్వాజ్.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే శాశ్వతంగా అధికారంలో ఉండేలా రాజ్యంగాన్ని మార్చి రాజరిక వ్యవస్థను ప్రవేశ పెడుతుందని ఆయన హెచ్చరించారు. అందుకే దేశాన్ని ఈ విపత్తు నుంచి కాపాడేందుకు విపక్ష పార్టీలు అన్నీ కలిసి పోటీ చేయాలని, లేదంటే, 2024 ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ను అడ్డుకోవడం అయ్యే పనికాదని ఆయన విపక్ష పార్టీలకు హిత బోధ చేశారు. విపక్షాల మధ్య ఎన్ని విభేదలున్నా, అవన్నీ పక్కన పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యం కావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశంలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నిజానికి, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావలసిన అవసరాన్ని ఒక్క ఆప్ మాత్రమే కాదు, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఎప్పుడో గుర్తించాయి. 2024 ఎన్నికల్లో ప్రధాని మోడీని ఓడించాలంటే.. విపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేయాలని... కాంగ్రెస్ మొదలు కమ్యూనిస్టుల వరకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. విపక్ష పార్టీలు తరచూ పిలుపునిస్తూనే ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. నిజానికి, ప్రతిపక్షాల ఐక్యత అవసరాని గుర్తించడంలో ఆప్ కొంత ఆవెనక బడింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నియామక నియంత్రణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అర్దినెన్సు తెచ్చే వరకు ఆప్ ప్రతిపక్షాల ఐక్యత ప్రయత్నాలను అవహేళ చేసింది.
ఇంత వరకు సాగిన ఐక్యతా ప్రయత్నాలకు ఆప్ దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పడు, విపక్షాల ఐక్యత కోసం ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కాలికి బలపం కట్టుకుని దేశాన్ని చుట్టి వస్తున్నారు. రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్సు వీగి పోయేలా చేయాలని, ప్రతిపక్ష పార్టీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈ నేపద్యంలోనే ఆప్ నేత భరద్వాజ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదలా ఉంటే విపక్షాలను ఐక్యం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో జూన్ 23న బిహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం జరగనుంది. జూన్ 23న జరిగే సమావేశంలో 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి వ్యూహరచన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి కాంగ్రెస్ సహా ఎన్సీపీ, శివసేన, ఆప్ వంటి ప్రధాన పార్టీలు హాజరుకానున్నాయి.అయితే, తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న, వైసేపీ, బీఆర్ఎస్ సహా తెలుగు దేశం హాజరావుతాయా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.