జర్నలిస్టులకు పీపీఈ లు, ఇన్సూరెన్స్ అక్కర్లేదా...?
posted on Apr 10, 2020 @ 4:50PM
కరోనా తో పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులే సమాజానికి, ప్రభుత్వానికి కనిపిస్తున్నారా..? సమాజం ఇంట్లో కదలకుండా కూర్చోవాలంటే, వారి ఇంట్లోకి సమాచారాన్ని చేరవేసేది జర్నలిస్టులే (టివి, పత్రికలే), మరి వీరు కనపడటంలేదా?
కరోనా మహమ్మారి భయంతో ప్రపంచం వణుకుతూ, ఇంట్లోనే ఉంటే... ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండిపోయారు?, మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? మీ గ్రామం ఎలా ఉంది? మీ ఇంటి బయట ఏమి జరుగుతుంది..? ప్రభుత్వం ఏమి చేస్తుంది.? పోలీసులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు.? వైద్యులు ఎలాంటి సాహసోపేత వృత్తి ధర్మం పాటిస్తున్నారు అని, అనునిత్యం మిమ్మల్ని టీవీ లకి, పత్రికలకు కట్టిపడేసేలా ప్రాణాలను పణంగా పెట్టి వృత్తి ధర్మం పాటిస్తుంది జర్నలిస్టులే..ఇది జర్నలిస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంధిస్తున్న ప్రశ్న.
ప్రభుత్వం... కనీస గౌరవ వేతనమే కాదు కదా, అత్యవసర విధుల్లో భాగమైనా కనీసం ఇన్సూరెన్స్ కూడా ప్రత్యేకంగా ప్రకటించలేకపోయింది.. వారి ఆర్ధిక పరిస్థితి అర్ధం చేసుకోలేకపోయింది.. కరోనా నివారణలో మీరే ప్రథమ పాత్ర అంటూ డేంజర్ జోన్ లోకి నెట్టివేస్తూ కనీసం పీపీఈ (Personal protective equipment) లు కూడా ప్రభుత్వం సరఫరా చేయలేకపోతోంది. జర్నలిస్టులారా, మీకు ఎలాంటి ప్రత్యేక ఇన్సూరెన్స్ కేంద్రం ప్రకటించలేదు..? రక్షణ ముఖ్యం, మీ కోసం కాదు, మీ కోసం వేచి చూసే మీ కుటుంబ సభ్యుల కోసం.. ప్రభుత్వం స్పందించవచ్చు, ఎప్పటిలాగే ఊరుకోవచ్చు, మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి.