పోలవరంపై శ్వేత పత్రం.. మంత్రి నిమ్మల
posted on Jun 20, 2024 @ 4:08PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన జాతీయ ప్రాజెక్టైన పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ అవగాహనా రాహిత్యంతో అస్తవ్యస్తం చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టు పనులు పడకేసేలా చేసిందన్నారు. జలవనరుల శాఖ మంత్రిగా గురువారం (జూన్ 20) న బాధ్యతలు చేపట్టిన మంత్రి నిమ్మల రామానాయుడు.. జగన్ సర్కార్ మొత్తంగా రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం రీఇంబర్సు మెంట్ కింద విడుదల చేసిన నిధులను జగన్ సర్కార్ వేరే అవసరాలకు మళ్ళించిందని అన్నారు.సిఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి క్షేత్ర స్థాయి పర్యటనగా పోలవరం సందర్శించారంటే పోలవరం ప్రాజెక్టుకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నారో తెలుస్తోందని పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం,అవినీతిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయఫ్రమ్ వాల్ కొట్టుకు పోయిందని హైదరాబాదు ఐఐఐటి నీతి ఆయోగ్ కు నివేదిక ఇచ్చిందని తెలిపారు. మరలా దానికి మరమ్మత్తులు చేయాలన్నా కనీసం 440 కోట్ల రూ.లు అవుతుందని ఒకవేళ కొత్తగా నిర్మించాలన్నా సుమారు 990 కోట్ల రూ.లకు పైగా వ్యయం అవుతుందని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.దీనిపై సవివరంగా సమీక్షించి మరమ్మత్తులు చేయాలా లేక కొత్తగా నిర్మించాలా అనేదానిపై తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం లాకులు,షట్టర్లకు మరమ్మత్తులు చేయలేదని కనీసం వాటికి గ్రీజు కూడా పూయలేదని మంత్రి రామానాయుడు ఆరోపించారు.
రాష్ట్రంలోని రైతాంగానికి తక్షణ ఉప శమనం కలిగించేందుకు వీలుగా వివిధ ఏటిగట్లు పటిష్టీకరణ, షట్టర్లు,గేట్లు వంటివాటి మరమ్మత్తుల నిర్వహణ వాటి పటిష్టీకరణకు అధికారులకు ఆదేశాలిచ్చామని జలవనరుల శాఖమంత్రి రామానాయుడు చెప్పారు.కాలువలు, డ్రైన్లలో గుర్రపు డెక్కు,తూడు తొలగించేందుకు పనులు చేపట్టేందుకు అనుమతిస్తే తొలి సంతకం చేశామని అన్నారు.