ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న.. అదేనా కారణం?
posted on Jan 26, 2019 @ 10:13AM
దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ఈ ఏడాది ముగ్గురు ప్రముఖులను వరించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జనసంఘ్ నేత నానాజీ దేశ్ముఖ్, గాయకుడు భూపేన్ హజారికాలకు భారతరత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. నానాజీ, హజారికాల పేర్లను మరణానంతరం పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. నాలుగేళ్ల విరామం అనంతరం భారతరత్న పురస్కారాలను ప్రకటించారు. చివరిసారిగా 2015లో మోదీ ప్రభుత్వం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు మదన్మోహన్ మాలవీయలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇప్పటిదాకా భారతరత్న పొందిన వారి సంఖ్య 48కి చేరింది.
ఇందిరా నుంచి సోనియా వరకూ ట్రబుల్ షూటర్గా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేయాలని నిర్ణయించడం విశేషం. దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన 84 ఏళ్ల ప్రణబ్ రాజనీతిజ్ఞుడిగా, సంక్షోభ పరిష్కర్తగా గుర్తింపు పొందారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టిన ఆయన.. ఆర్థిక మంత్రిగా ఎనలేని కీర్తిని ఆర్జించారు. 47 ఏళ్ల వయసులో భారతదేశానికి అతి పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టింది కూడా ఆయనే. యూపీఏ హయాంలో అత్యంత కీలకమైన విదేశాంగం, రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించారు. 2012-17 మధ్య కాలంలో రాష్ట్రపతిగా సేవలు అందించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రణబ్కు భారతరత్న ప్రకటించడం ద్వారా అటు బెంగాల్లో మమత, ఇటు కాంగ్రెస్ పార్టీలకు లోక్సభ ఎన్నికల ముందు మోదీ షాక్ ఇచ్చారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం 2019 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 112 మంది ప్రముఖులకు ‘పద్మ’ పురస్కారాల్ని ప్రకటించింది. ఇందులో నలుగురిని పద్మవిభూషణ్, 14 మందిని పద్మభూషణ్, 94 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి జాతీయ ఫుట్బాల్ జట్టు కెప్టెన్, ప్రపంచవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్ సాధించిన సునీల్ ఛెత్రి, 3 వేలకు పైగా సినీగీతాలు రాసిన సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి దశాబ్దకాలంగా చెస్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ 2011 చెస్ గ్రాండ్మాస్టర్గా నిలిచిన ప్రముఖ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, ‘రైతునేస్తం’ ఫౌండేషన్ ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వ్యవసాయ పాత్రికేయుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావులకు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.