ఇదేం భాష.. మర్యాదుండక్కర్లే?.. రాజకీయాలలో దిగజారుతున్న సంస్కారం

 నాడు...
-ఒక రైలు ప్రమాదం జరిగిందని బాధ్యత వాహిస్తూ రైల్వే మంత్రి పదవికి
రాజీనామా చేసి ఆఫీస్ బయటకు వచ్చి అధికారిక వాహనం వదిలేసిన
లాల్ బహదూర్ శాస్త్రి.

-ఎమర్జెన్సీ అనంతరం మురార్జీ దేశాయ్ ప్రధానిగా జనతా సర్కార్
ఏర్పాటైంది. మురార్జీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఫెర్నాండెజ్ ఒక
సభలో ఇందిరాగాంధీని నిరంతర అబద్ధాల కోరు అని విమర్శించడాన్ని
స్వయంగా మురార్జీ తప్పుపట్టారు. ఆ విమర్శ ఆమె రాజకీయ
అనుభవాన్ని కించపరిచేదిగా ఉందని ఫెర్నాండెజ్ ను మందలించారు.

-  పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు, విపక్ష నేతగా ఉన్న
అటల్‌ బిహారీ వాజ్‌పేయి పీవీ విధానాలపై నిత్యం విమర్శలు
కురిపించేవారు.అయితే, ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ సమస్యపై
మాట్లాడేందుకు దేశ ప్రతినిధిగా పీవీ వాజ్‌పేయినే  పంపారు.


నేడు...

-ఈడీలు కాదు బోడిలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో.. ఈడీ వస్తే
నాకే చాయి తాపీ పోవలె.. మోడీ నువ్వు గోకినా.. గోకక పోయినా నేను
గోకుతూనే ఉంటా 
-మునుగోడు ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్

చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా పర్వాలేదు. చంద్రబాబుకు కళ్లు
నెత్తికెక్కాయి.. ఉరిశిక్ష వేసినా తప్పు లేదు
 -విపక్ష నేతగా ఉండగా వేర్వేరు రోడ్ షోలలో జగన్

సమస్యలు, కష్టాలు ఇవేవీ నన్ను కదిలించలేవు, నన్ను బెదిరించలేవు.
దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఉన్నంతకాలం వాళ్లు నా
వెంట్రుక కూడా పీకలేరు.   

- సీఎం జగన్


ఒరేయ్ వెధవల్లారా, సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా.. నా సహనమే రా
ఇంత కాలం మిమ్మల్ని రక్షించింది. ఏరా వైసీపీ గూండాల్లారా.. ఒంటి
చేత్తో వస్తాం మెడ పిసికి కింద తొక్కేస్తాం కొడకల్లారా

-జనసేన అధినేత పవన్ కల్యాణ్
 
రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్లా కాకుండా శత్రువుల్లా మారిపోతున్నారనడానికి తెలుగు రాష్ట్రాలలో నాయకుల మాటలే తిరుగులేని నిదర్శనం. అందరు నాయకులూ ఇలాగే సభ్య సమాజం ఆమోదించని భాషతో ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోస్తున్నారని అనడానికి లేదు. గంజాయివనంలో తులసి మొక్కల్లా చంద్రబాబు వంటి నేతలూ ఉన్నారు. ఆయన విమర్శలు వాడిగా ఉంటాయి, సూటిగా ఉంటాయి. అయితే ఎన్నడూ వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భం లేదు. అయితే ఆయన సమకాలీనుడై తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ, జూనియర్లైన జగన్, పవన్ కల్యాణ్ లు కానీ ఆ పరిణితిని, సంయమనాన్ని పాటించడం లేదు. నాటి రాజకీయ నాయకుల హుందాతనం, పరస్పరం గౌరవించుకునే సంస్కారం నేడు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి.

ఒక నాయకుడు తన ప్రవర్తనతో, రుజు వర్తనతో అందరికీ ఆదర్శంగా నిలిచినప్పుడే ఆయన ఆధ్వర్యంలోని పార్టీ సమాజానికి మేలు చేసేలా రూపుదిద్దుకుంటుంది.  ఒక మార్గదర్శనం చేయగలుగుతుంది. యధారాజా తథా ప్రజా అన్నట్లుగా పార్టీ నాయకుడే మర్యాదను గాలికి వదిలేసి అమర్యాదకరమైన భాషను ఉపయోగిస్తే ఆయన నాయకత్వంలోని పార్టీ శ్రేణులూ అదే దారిన నడుస్తారు. అప్పుడుఅరాచకం వినా మరొకటి ఉండదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి అలాగే తయారైంది. తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోందనడానికి   నాయకుల ప్రసంగాలే ప్రత్యక్ష నిదర్శనం.

 రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు అంశాల వారీగా సిద్ధాంతం ప్రాతిపదికపై ఉండటం అనేది మర్యాద. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలే మర్యాద ముసుగు తీసేసి ఇష్టారీతిగా మాట్లాడుతున్న పరిస్థితి నేడు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల అధ్వాన స్థితికి అద్దం పడుతోంది. చదవేస్తే ఉన్న మతి పోయిందన్న చందంగా నేటి రాజకీయ నాయకుల తీరు ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావునే తీసుకుంటే.. ఆయనేమీ సామాన్యమైన నాయకుడు కాదు.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు నాయకత్వంలో పని చేసిన వ్యక్తి.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న మహనీయుడి వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి ఐదు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు.  అటువంటి నేత నోటి నుంచి నేడు గోకుడో పాఖ్యానం వినడమే రాజకీయాల నేతల భాషా దారిద్ర్యానికి,  విలువల పతనానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 


ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అశేష ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు. ఆయన కూడా కేవలం అధికారమే పరమావధిగా నేలబారు మాటలతో ప్రసంగాలతో రాజకీయ మర్యాదకు తిలోదకాలిచ్చేసి ప్రసంగాలు చేయడం విలువల పతనానికి పరాకాష్టగా చెప్పాలి. ప్రత్యర్థులపై విమర్శలకు ఆయన ప్రయోగించే భాష  ఉపయోగించే  సంస్కార లేమికి పరాకాష్టగా ఉంటుందనీ. వెంట్రుక కూడా పీకలేరు.. కాల్చి పారేయాలి.. ఉరి తీయాలి వంటి భాషా ప్రయోగం ఆయనకే చెల్లిందని పరిిశీలకులు చెబుతున్నారు.

అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ విషయాన్నే తీసుకుంటే ఇంత కాలం పొల్లు మాటలకు దూరంగా హుందా రాజకీయ వేత్తగా గెలుపోటములకు అతీతంగా ప్రజల కోసమే నిలబడతానని  చెప్పుకుంటూ వచ్చిన పవన్ కల్యాణ్ మంగళవారం (అక్టోబర్ 18)మంగళగిరిలో పార్టీ క్యాడర్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. గొప్ప గొప్ప గ్రంథాలను అధ్యయనం చేసి... ఆ స్ఫూర్తితో ప్రజా సేవ కోసం రాజకీయాలలోకి వచ్చినని చెప్పే పవన్ కల్యాణ్ వైసీపీ తీరును, వైసీపీ నాయకులతీరును ఎండగట్టడానికి ఉపయోగించిన భాష సభ్య సమాజానికి ఆమోదయోగ్యమైనది ఎంత మాత్రం కాదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఇంత కాలం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడా సంయమనం కోల్పోకుండా మంచి మాటలతోనే తన భావాలను వ్యక్త పరిచేవారు. కానీ మంగళవారం (అక్టోబర్ 18) మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ క్యార్యకర్తల సమావేశంలో ఆయన పరుష పదజాలం ఉపయోగించారు. విశాఖ ఘటనల నేపథ్యంలో వచ్చిన ఆవేశం వల్లనో, పెద్ద సంఖ్యలో తన పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించి అరెస్టులు చేసినందువల్ల వచ్చిన ఆగ్రహమో కానీ ఆయన కూడా మర్యాద గీత దాటేశారు.

అయితే తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ అధమస్థాయి భాషా ప్రయోగం ఇటీవల కాలంలోనే అంటే దాదాపుగా ఓ దశాబ్దం కిందటే ఆరంభమైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజల ఆమోదంతో సంబంధం లేకుండా ప్రత్యర్థులపై దుర్భాషలాడటం, ప్రత్యర్థులను మానసికంగా బలహీనులను చేయడమే లక్ష్యంగా రాజకీయ నేతలు దిగజారుడు భాష ఉపయోగిస్తున్నరని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో అసెంబ్లీ సాక్షిగా విపక్ష నేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన అధికార పక్ష సభ్యులు కొందరు చేసిన నీచ వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. ఏపీలో అయితే  వైసీపీ నేతల భాష సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా  ఉందనడంలో సందేహం లేదు. మాజీ మంత్రులు కొడాలి నాని, అనీల్ కుమార్ యాదవ్, మంత్రులు రోజా, అమర్ నాథ్ వంటి వారు రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, ఉపయోగిస్తున్న భాష వారి దిగజారుడు తనానికి నిదర్శనాలుగా ఉన్నాయంటున్నారు.

అయితే రాజకీయ భాష ఇంత అధమ స్థాయికి దిగజారిపోయిన తరుణంలో కూడా గంజాయివనంలో తులసి మొక్కలా కొందరు నాయకులు విలువలకు పెద్ద పీట వేస్తూ పల్లెత్తి పరుషంగా మాట్లాడకుండా సిద్ధాంతానికే కట్టుబడి మాట్లాడుతున్న వారూ  ఉండటం,  ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, ప్రజాజీవితంలో నేతలలో విలువల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న తీరు ఒక్కటే ప్రజాస్వామ్య వాదులకు ఊరటగా ఉందని పరిశీలకులు అంటున్నారు.

అలాంటి నాయకులలో మొదటి వరసలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉంటారని రాజకీయాలకు అతీతంగా సీనియర్ నాయకులు అంటున్నారు.  చంద్రబాబు విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వామపక్ష నేతలు కూడా ఆయన స్టేట్స్ మన్ షిప్ ను గౌరవిస్తామని చెబుతుంటారు. అలాగే బీజేపీ సీనియర్ నేతలు సైతం చంద్రబాబు దార్శనికతకు ఫిదా అయ్యామని అంటారు.  అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ భాష విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మాట్లాడేస్తున్నారు. పరుష పదజాలం, దూషణల ద్వారా వారు తమ పార్టీ క్యాడర్ కు కానీ, ప్రజలకు కానీ ఇచ్చే  ఇస్తున్న సందేశం ఏమిటి? సంకేతమేమిటి? అన్నది ఆయా నేతలే తెలుసుకోవలసి ఉంటుంది. లేకుంటే ప్రజలే వారి నోళ్లకు తాళం వేసే  రోజు వస్తుందని పరిశీలకులు అంటున్నారు.

నెహ్రూ, లాల్ బహదూర్శాస్త్రి, వాజ్ పేయి, రాజాజీ వంటి నేతలు రాజకీయ యవనికపై ఎంత హుందాగా వ్యవహరించాలో.. సైద్ధాంతిక విభేదాలపై పోరు కూడా ఎంత స్నేహపూర్వకంగా చేయవచ్చో చూపారు. ఇప్పటికైనా నేతలు తమ భాష మార్చుకుని రాజకీయ మర్యాద, హుందాను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు అంటున్నారు. లేదంటే ప్రజా క్షేత్రంలో వారికి గుణపాఠం తప్పదంటున్నారు. 

కారు పార్టీ పోయి...హస్తం పార్టీ వచ్చిన దోపిడీ ఆగలేదు : కిషన్‌రెడ్డి

  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్‌ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణలో కారు పార్టీ పోయి హస్తం పార్టీ దోపిడీ మాత్రం ఆగలేదని ఆయన అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లయినా 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయలంటే భూములు అమ్మవలసి వస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్నం, ఉచిత బస్సు పథకాలను మాత్రమే ప్రచారం చేసుకుంటుందని, అందులో సన్నం బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటనే ఎక్కువ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయోత్సవాలు జరుపుకునే హక్కు ఎక్కడిదని ఎంపీ డీకే అరుణ అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేలు ఏవి? రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎంత కేటాయించారని చెప్పాలని ప్రశ్నించారు  గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల హాయంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రాజ్యం కొనసగుతోందని కిషన్ రెడ్డి  తెలిపారు. ఈ మహాధర్నలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణం : సీపీఐ

బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్ల ఇస్తే తొలగిస్తామనడం దారుణమన్ని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నరన్నారు.  అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసులు పడిపొవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దిని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటికరణ చేసి చాల అన్యాయం చెస్తుందన్నారు. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు పాల్పడుతుందన్నారు. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారన్నారు.

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్

  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో మ‌రో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు కూడా మాయమవడం కలకలం రేపుతోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, లేబుళ్లు మార్చి ఓటర్లకు పంపిణీ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.  ఆనాడు ఈ నకిలీ మద్యం తాగి పలువురు మరణించగా, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు.ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫైళ్లు 2018లోనే అదృశ్యమైనట్లు విజయవాడ ప్రత్యేక కోర్టు గుర్తించి, కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి  ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తనపై కేసు నమోదు కావడంతో కాకాణి తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములు అక్రమాలపై ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డికి దమ్ముంటే నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్దమా అని సవాల్ విసిరారు.

వింటర్ లో హాట్ హాట్ గా మద్యం సేల్స్! నాలుగు రోజుల్లో రూ.600 కోట్లు!

తెలంగాణలో మద్యం విక్రయాలు అమాంతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో మందుబాబులు గజగజలాడించే చలి నుంచి రక్షణ కోసం చలిమంటలు, దుప్పట్లు, రగ్గులను కాకుండా మద్యాన్ని ఆశ్రయించారని భావించాల్సి వస్తోంది. ఎందుకంటేచలి పెరగడంతో గత నాలుగు రోజులలో  రాష్ట్రంలో  ఏకంగా 600 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే ఈ అమ్మకాలు 5 కోట్ల 86 లక్షలుగా ఉన్నాయి.  వెచ్చటి మద్యం గొంతులో పోసుకుని చలిలో  తెలంగాణ మందుబాబులు ఖుషీ చేస్తున్నారని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పొలిస్తే  మద్యం విక్రయాలు ఈ ఏడు ఏకంగా 107 శాతం పెరిగాయి.  రాష్ట్రం మొత్తంగా చూస్తే ఈ నెల మొదటి తారీకు నుంచి నాలుగో తేదీ వరకూ అంటే డిసెంబర్ 1 నుంచి 4 వరకూ కేవలం నాలుగు రోజుల్లో 600 కోట్లు ఉండటానికి  గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త మద్యం విధానం కూడా కారణమని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.  నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో  5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వడమే ఇందుకు నిదర్శనం. అదే గత ఏడాది ఇదే కాలంలో  బీర్ల అమ్మకాలు 4.26 లక్షల కేసులు మాత్రమే. 

ఏపీ గ్రోత్ రేట్@10.5%

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటోంది.  ఈ ఏడాది ఏపీ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. వైసీపీ హయాంలో ఏపీ ప్రగతి తిరోగమనంలో సాగిన సంగతి తెలిసిందే.  అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26  ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.   దేశవ్యాప్తంగా సగటు వృద్ధి 8.8 శాతం ఉంటే, ఒక్క అంధ్రప్రదేశ్ మాత్రం జాతీయ సగటును మించిన వృద్ధి రేటు సాధించింది. ఈ వేగం ఇలాగే సాగితే  ఈ ఏడాది మొత్తం రాష్ట్ర ఆదాయం సుమారు 18 లక్షల 65 వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం వ్యవసాయానిదే అని చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ ఉత్పత్తులు 9.6 శాతం పెరిగి 81 వేల 496 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది ఈ వృద్ధి 36 శాతంగా ఉంది. అలాగే సేవల రంగం 8.5 శాతం, పరిశ్రమలు 23 శాతం  పెరిగాయి. ఈ మూడు రంగాలూ ఒకేసారి బలపడటం వల్లనే  ఆర్థిక వ్యవస్థ పునాది గట్టిపడిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047    ప్రకారం 2047 నాటికి రాష్ట్ర ఆదాయం 2.4 లక్షల కోట్ల డాలర్లకు , తలసరి ఆదాయం 35 లక్షల రూపాయలు చేరాలి. ఆ దీర్ఘకాలిక లక్ష్యం దిశగా తొలి అడుగు పడిందనే తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.  పథకాల అమలులో వేగం,  అధికారుల చొరవ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ అన్నీ కూడా ఏపీ ప్రగతికి, పురోగతికి, ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తున్నాయని చెప్పాలి.    సముద్ర ఆహార ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రాకు 38 శాతం వాటా ఉంది, దాదాపు 7.74 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 28 వేల 409 మెగావాట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల్లో డబ్బు లభ్యత పెంచడం వల్ల ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగింది. జగన్ హయాంలో కుదేలైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు హయాంలో ఇప్పుడు కోలుకుని వేగంగా ముందుకు సాగుతోంది. 

ఏబీవీ కొత్త పార్టీ?!

దేశంలో ఇప్పటికే స‌వాల‌క్ష పార్టీలు ఉన్నాయి. వీటిలో యాక్టివ్ గా ఉన్న‌వి కొన్నే. వాటిలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల‌తో పాటు ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, తృణ‌మూల్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు వీటికి అద‌నం. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే తెలుగుదేశం, వైసీపీ,  జ‌న‌సేన‌,  డీఎంకే, అన్నాడీఎంకే, బీఆర్ఎస్ వంటి పార్టీలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలనూ కలిపితే దాదాపు ఓ పాతిక పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయని చెప్పవచ్చు.  అలాంటి యాక్టీవ్ పార్టీల‌న్నిటినీ  ప‌క్క‌న పెడితే..   దేశంలో ఉన్న పార్టీల సంఖ్య సుమారు రెండున్న‌వేల వ‌ర‌కూ ఉంటాయి. రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న  తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ  కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.   ఆ పార్టీ పేరు ఇంకా  ఖరారు కాలేదు కానీ, పార్టీ ఏర్పాటైతే పక్కా అంటున్నారు. ఇంతకీ ఆ పార్టీని ఏర్పాటు చేస్తున్నది ఎవరయ్యా అని చూస్తే.. ఆయన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు. ఈయ‌న జ‌గ‌న్ జ‌మానాలో ఎన్నేసి అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారో  తెలిసిందే. ఇటీవ‌ల ప్ర‌వీణ్ ప్ర‌కాష్ చెప్పిన అపాల‌జీ వీడియోనే ప్ర‌త్య‌క్ష  సాక్షి. అదలా ఉంచితే..  ఏబీవీకి ఇంకా ప్ర‌భుత్వ ప‌రంగా రావ‌ల్సిన బ‌కాయిలు ఇప్పటికీ  రాలేదు. వాస్తవానికి ఏబీవీ   జ‌గ‌న్ పై పోరాడిన విధానికి కూట‌మి ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించాల్సి ఉంది. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి ఏబీవీకి ఎటువంటి మద్దతూ లభించలేదు.  అప్ర‌ధాన్య‌మైన పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని అప్పగించి మమ అనేశారు. అయితే ఆయనా పోస్టు తీసుకోలేదనుకోండి అది వేరే సంగతి. అయితే   ఏబీవీ ప్ర‌స్తుతం చంద్ర‌బాబు మీద ఆయ‌న ప్ర‌భుత్వ విధానాల‌పైనా విమర్శలు గుప్పిస్తున్నారు.   అంతే కాదు వైసీపీ వారికి య‌ధేచ్చ‌గా దోచి పెడుతున్నార‌న్న సంచ‌ల‌న కామెంట్లు కూడా చేశారు. ఆమాట‌కొస్తే మొన్న‌టికి మొన్న కందుకూరు క‌మ్మ  కాపు ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వం  ఇచ్చిన న‌ష్ట‌ప‌రిహారంపై కూడా రియాక్టయ్యారు ఏబీవీ. ఇలా తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వ నిర్ణయాలను ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఏబీ వెంకటేశ్వరరావు.   ఇలా ఖండనలు, ప్రకటనలతో కాదని తానే స్వయంగా ఒక కొత్త  పార్టీ  పెట్టి  సత్తా చాటాలన్న నిర్ణయానికి ఏబీవీ వచ్చినట్లు కనిపిస్తోంది.   దేశంలోనే అత్యంత అవినీతి ప‌రుడిగా  వేల కోట్ల‌ను సంపాదించిన పేరు సాధించిన  జ‌గ‌నే పార్టీ న‌డ‌ప‌డానికి  డ‌బ్బుల్లేవు కాబ‌ట్టి తాను  కార్యాల‌యాన్ని తీసేశాన‌ని బాహ‌టంగా చెప్పుకున్నారు. అలాంటిది ఏబీవీ లాంటి ఒక రిటైర్డ్ ప్ర‌భుత్వోద్యోగి వ‌ల్ల సాధ్య‌మ‌వుతుందా? అని సందేహాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అయితే  జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ‌ లోక్ స‌త్తా  అరవింద్ కేజ్రీవాల్  ఆమ్ ఆద్మీ పార్టీ,  సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ కూడా సేమ్ టు సేమ్  ఈయ‌న‌లాగానే ఐఏఎస్ ఐపీఎస్ కేడ‌ర్ కి సంబంధించిన వారే. వారిలో అర‌వింద్ కేజ్రీవాల్ పార్టీ క్లిక్ అయిన‌ట్టు మిగిలిన వారు పెట్టిన పార్టీలు రాణించ‌లేదు.  ఆ  కోవ‌లోకి వ‌చ్చే ఏబీవీ అంత‌గా మాస్ జ‌నాల్లోకి దూసుకెళ్ల‌గ‌ల‌రా? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా  మారింది.  ఇక పార్టీ పేరు ఏమిటని చూస్తూ.. ఈయన ఏపీకి పరిమితమై రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు కనుక ఆంధ్ర శ‌బ్ధం వ‌చ్చేలా ఆయన పార్టీ పేరు ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా ఏబీవీ పెట్టబోయే పార్టీ ఏమిటి? ఎప్పుడు ఆరంభం కానుంది? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.  

మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది... అధైర్య పడొద్దు : కేసీఆర్

  బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లలు కేసీఆర్‌ను  ఫాం హౌస్‌ కలిశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ అన్ని కాలాలు మనకు అనుకులంగా ఉండవు కొన్ని కష్టాలు వస్తాయి. వాటికి కుంగి పోవద్దని తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయిని అప్పటి వరకు ప్రజలు అధైర్యపడొద్దని వచ్చేది మన బీఆర్‌ఎస్ ప్రభుత్వమని తెలిపారు.  కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆగం కావొద్దని సూచించారు. గ్రామస్థుల మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను గుర్తుపట్టి పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితిని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారిన పరిస్థితిని, గ్రామస్తులు కేసీఆర్ దృష్టికి తెచ్చి ఆవేదన వ్యక్తం చేశారు

భార‌త్ అంటే...పుతిన్‌కి ఎలాంటి అభిప్రాయ‌ముందంటే!

  పుతిన్ భార‌త్ వ‌చ్చినపుడు ఒక ప్రయివేటు ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో.. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పారు. ఆ ప్ర‌శ్న‌లేంటి  స‌మాధానాలు ఎలాంటివ‌ని చూస్తే..మీరు 25 ఏళ్లుగా రష్యాకు నాయకత్వం వహిస్తున్నారు. ఇది చాలా అరుదైన రికార్డు. ఈ దీర్ఘకాల పాలనా  రహస్యమేంట‌ని అడ‌గ్గా..  అందుకు స‌మాధానం చెప్పిన  పుతిన్.. రహస్యం ఏమీ లేదు. ప్రజలు మ‌న ప‌ట్ల‌ నమ్మకంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. 1990లలో రష్యా పతనమైంది – ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా. ప్రజలు దేశాన్ని మళ్లీ గౌరవించే స్థితికి తీసుకురావాలని కోరుకున్నారు. నేను ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాను. అంతే అంటూ ఎంతో క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌కు సింపుల్ గా తేల్చేశారు పుతిన్. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మీరు ఆయనతో రెండు సార్లు క‌ల‌సి పనిచేశారు. ఈసారి రష్యా-అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? అని అడిగిన ప్ర‌శ్న‌కు.. పుతిన్ ఇచ్చిన ఆన్స‌రేంంటే.. ట్రంప్ ఒక వ్యాపారవేత్త. ఆయనకు లాభనష్టాలు అర్థమవుతాయత‌ప్ప ఈ పోరాటాలు యుద్ధాల ప‌ట్ల ఆయ‌న‌కేమంత ముక్కువ లేదు.. ఉక్రెయిన్ యుద్ధం అమెరికాకు ఏం లాభం ఇస్తోంది? ఏమీ లేదు – డబ్బు వృథా అవుతోంది. యూరప్‌లో అస్థిరత పెరుగుతోంది. ట్రంప్ దీన్ని అర్థం చేసుకుంటార‌నే అనుకుంటున్నా అన్నారు పుతిన్.. రష్యాతో ఒప్పందం చేసుకోవడం అమెరికాకు మేలు చేస్తుందని ఆయన భావిస్తే, ఆ దిశలో అడుగులు వేస్తారు. ఇందుకు మేము సిద్ధంగా ఉన్నామ‌ని కుండ బ‌ద్ధ‌లు కొట్టేశారు పుతిన్.  ఇక‌ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎప్పుడు ముగిస్తారు? అన‌డిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా పుతిన్.. యుద్ధం మా చాయిస్ కాదన్నారు. 2014లో కీవ్‌లో పశ్చిమ దేశాల ఆధారిత రాజకీయ తిరుగుబాటు చేశాయి. మిన్స్క్ ఒప్పందాలను జర్మనీ మాజీ ఛాన్సలర్ ఒప్పుకున్నట్టుగా – ఉక్రెయిన్‌ను మోసం చేయడానికే ఆ ఒప్పందాలు చేశామని చెప్పారు. మేము రష్యా మాటును నమ్మమని కోరుకోవడం లేదు – వాళ్లే ఆ మాట చెప్పారు కదా! అని ప్ర‌శ్నించారు. పుతిన్. ఇప్పుడు మా షరతులు స్పష్టం: ఉక్రెయిన్ నిరాయుధీకరణ, నాటోలో చేరకపోవడం, రష్యన్ భాషా హక్కులు, క్రిమియా మ‌రియు నాలుగు ప్రాంతాలు రష్యాలో భాగమే అనే గుర్తింపు. ఇవి నెరవేరితే రేపే యుద్ధం ఆగిపోతుందని తేల్చి చెప్పేశారు పుతిన్.. భారత్-రష్యా సంబంధాలు ఎప్పటికీ మారవని మీరు చెబుతుంటారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. భారత్ మాత్రం కొనసాగిస్తోంది. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా? అని అడగ్గా.. అందుకు పుతిన్ ఏమ‌న్నారంటే.. ఎంత మాత్ర‌మూ ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేద‌న్నారు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ – ఇది భారత దేశ స్వభావం. భారత్ ఎప్పుడూ ఎవరి బెదిరింపులకు లొంగలేదు. 1971లో అమెరికా ఏడో నౌకాదళాన్ని బంగాళాఖాతంలోకి పంపినప్పుడు కూడా భారత్ తన మార్గంలోనే నడిచింది. ఇప్పుడు కూడా అదే. మీరు మా నుంచి చవకగా చమురు కొంటున్నారు, మేము మీ నుంచి ఔషధాలు, టెక్నాలజీ కొంటున్నాం – ఇది పరస్పర లాభం. ఇది దోస్తీ కాదు, వ్యాపారం స‌రిగ్గా అదే స‌మ‌యంలో వ్యూహాత్మక సహకారంగా చెప్పుకొచ్చారు పుతిన్. చైనాతో మీ సంబంధాలు చాలా దగ్గరయ్యాయి. ఇది భారత్‌ను ఆందోళన క‌లిగించే అంశం కదా? అని ప్ర‌శ్నించిన‌పుడు పుతిన్ ఇందుకెలాంటి ఆన్స‌రిచ్చారో చూస్తే..  చైనాతో మా సంబంధాలు భారత్‌కు వ్యతిరేకం కాదు. భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్యలు మా వల్ల రాలేదు – అది బ్రిటిష్ వలస పాలన నుంచి వచ్చిన సమస్యలు. మేము ఎప్పుడూ భారత్-చైనా మధ్య యుద్ధం కోరుకోలేదు. రష్యా భారత్‌కు S-400 ఇస్తుంది, చైనాకు SU-35 ఇస్తుంది – ఇది వ్యాపారం. రెండు దేశాలతోనూ మా సంబంధాలు స్వతంత్రంగా ఉంటాయన్నారాయ‌న‌. భారత్ క్వాడ్‌లో ఉంది, అమెరికాతో దగ్గరవుతోంది. ఇది రష్యాకు సమస్య కాదా? అన్న‌ది  స్ట్రైట్ క్వ‌శ్చిన్. కాగా.. పుతిన్ ఇందుకు చెప్పిన ఆన్స‌రేంటంటే.. భారత్ ఎప్పుడూ తన స్వతంత్ర విదేశాంగ విధానం కలిగి ఉంటుంది. 1950-60లలో నెహ్రూ నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ ప్రారంభించినప్పుడు మేము మద్దతు ఇచ్చాం. ఇప్పుడు క్వాడ్‌లో ఉన్నా, భారత్ తన అవసరాలను కాపాడుకుంటుంది. మేము దాన్ని గౌరవిస్తామ‌ని అన్నారే త‌ప్ప భార‌త వైఖ‌రిని వ్య‌తిరేఖించ‌లేదాయ‌న‌.  మీరు ఇండియాలో బ్రహ్మోస్, AK-203 తయారీ, అణు రియాక్టర్లు, ఇప్పుడు రష్యన్ ఆయిల్ రిఫైనరీలు కూడా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు. ఇదంతా ఆంక్షలను దాటవేయడానికా? అన్న‌ది ఒక ప్ర‌శ్న కాగా..  పుతిన్  నవ్వుతూ..  ఆంక్షలు మమ్మల్ని బలహీనపరుస్తాయని వాళ్లు అనుకున్నారు. కానీ మేము బలోపేతమయ్యాం. భారత్‌లో రిఫైనరీ పెట్టడం అంటే మీకు చవకైన ఇంధనం, మాకు స్థిరమైన మార్కెట్. ఇది విన్- విన్ సిట్యువేషన్. ఆంక్షలు లేకపోయినా మేము ఇదే చేసేవాళ్లమ‌ని క్లారిటీ ఇచ్చారు పుతిన్.. మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు? 2036 వరకు కొనసాగుతారా? అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు పుతిన్  చిరుద‌ర‌హాసంతో నేను రిటైర్ అయినప్పుడు మీడియాలో మొదట తెలుసుకుంటారు. ఇప్పుడు రష్యా స్థిరత్వం అవసరం. ఒకవేళ నేను వెళ్లిపోతే ఎవరూ దేశాన్ని విడదీయకుండా చూడాలి. అది జరిగే వరకు నేను ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.. ఇదీ పుతిన్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఆన్స‌ర్స్ ఇచ్చిన విధానం. అప్పుడ‌ప్పుడూ అక్క‌డ‌క్క‌డా చిరున‌వ్వులే త‌ప్ప‌.. ఎలాంటి హావ‌భావ విన్యాసాల‌ను చేయ‌లేదాయ‌న‌. భార‌త్ ప‌ట్ల త‌న వైఖ‌రి చెప్పేట‌ప్పుడు మాత్రం ఒకింత న‌మ్మ‌కంగా స్థిర‌చిత్తంతో చెప్పిన‌ట్టు క‌నిపించింది.  

జగన్ ద్వేషం.. అమరావతికి వరం!!

అమరావతి నెత్తిన జగన్ పాలు పోశారంటున్నారు పరిశీలకులు. అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. సరే రాష్ట్ర ప్రజలంతా అమరావతి వెంనే ఉన్నారన్న సంగతి 2024 ఎన్నికల ఫలితం తేల్చేసింది. అధికార పగ్గాలు చేపట్టినత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అమరావతి పురోగతి పనులను వాయువేగంతో చేపట్టింది. జగన్ కాలంలో జంగిల్ గా కనిపించిన అమరావతి ఇప్పుడు ఆకాశ హర్మ్యాలతో, నిరాటంకంగా సాగుతున్న నిర్మాణ పనులతో కలకలలాడు తోంది. అయినా అందరిలో ఓ చిన్న అనుమానం. ఐదేళ్ల తరువాత అంటే 2029 ఎన్నికలలో ఏదైనా అనూహ్యం సంభవించి జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇదే సంశయం అమరావతి రాజధాని రైతులనూ తొలిచేసింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా  అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం కూడా కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం కూడా  అందుకు సై అంది.  అమరావతికి రక్షణగా నిలవడానికి ముందుకు వచ్చింది.దీంతో ఆంధ్రప్రదేశ్ శాశ్వత, ఏకైక  రాజధానిగా అమరావతి అని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు చట్టబద్ధత కల్పించడానికి సై అంది.  ఇక ఆ దిశగా చర్యలు తీసుకోవడం లాంఛనమే అన్నది రూఢీ అయిపోయింది. దేశం మొత్తంలోనే ఏ రాష్ట్ర రాజధానికీ ఇలా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలేదు. చటబద్ధత కల్పించిన పరిస్థితీ లేదు. ఒక్క అమరావతికి మాత్రమే ఆ భాగ్యం దక్కింది. ఇందుకు ఎవరు ఔనన్నా కాదన్నీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే కారణం. ఆయన ఇసుమంతైనా దాచని అమరావతి ద్వేషం కారణంగానే సపోజ్ ఫర్ సపోజ్ ఆయన భవిష్యత్ లో పొరపాటున అధికారంలోకి వచ్చినా అమరావతిలో ఒక్క ఇటుక ముక్క కూడా కదిలించే అవకాశం లేకుండా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రాబోతోంది.  దేశంలో ఏ రాజధానికీ దక్కని ఈ భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దక్కడానికి జగన్ ద్వేష పూరిత, కక్ష సాధింపు రాజకీయ వైఖరే కారణమనడంలో సందేహం లేదు. 

దినదిన ప్రవర్ధమానంగా దిగజారుతున్న వైసీపీ గ్రాఫ్!

ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన విపక్షం వైసీపీయే. అందులో సందేహం లేదు. ఎందుకంటే కూటమి పార్టీలు కాకుండా అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉన్న పార్టీ వైసీపీయే. అటువంటి వైసీపీ పని తీరును కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి?  ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 17 నెలలు గడిచింది. ఒకింత ఆలస్యమైనా వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. తాము ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల పట్ల వారి స్పందన ఎలా ఉంది అన్న అంశంపై అంతర్గతంగా ఒక సర్వే చేయించారు. ఐప్యాక్ పై నమ్మకం సడలిపోయిందో ఏమో కానీ, ఈ సారి విపక్షంగా తన పార్టీ తీరు ఎలా ఉంది అన్నఅంశంపై ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో కూటమి పాలనపైనా, విపక్షంగా వైసీపీ తీరుపైనా సర్వే చేయించారు.  అయితే ఈ సర్వే ఫలితంతో  జగన్ కు షాక్ తగిలింది.   విపక్షంగా వైసీపీ ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్నదే ఈ సర్వే పలితంగా తేలిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి.  గత ఏడాది ఓటమి తరువాత కంటే రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ దారుణంగా పతనమైందని ఆ సర్వేలో తేలిందంటున్నారు. ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా గల్లంతయ్యేంత ఘోర పరాజయం మూటగట్టుకున్న తరువాత.. రాయలసీమలో కూడా వైసీపీ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయిందని ఆ సర్వే పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ అధినేత జగన్ పట్ల కూడా ప్రజలలో వ్యతిరేకత గూడుకట్టుకుంటోందని సర్వే తేల్చిం దంటున్నారు. పార్టీ ఓటమి తరువాత రాష్ట్ర వదిలి బెంగళూరులో ప్రవాసం ఉంటున్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలతో పాటు, పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తి గూడుకట్టుకుందని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది.   చూడాలి మరి ఈ సర్వే ఫలితంతో నైనా జగన్ రెడ్డి తన తీరు మార్చుకుంటారా?